Medaram In Pics : మేడారంలో గద్దెపైకి సారలమ్మను తీసుకువస్తున్నప్పటి ఫొటోలు
మేడారం మహా జాతరలో కీలక ఘట్టం ఆవిష్కృతమైంది. కన్నెపల్లి నుంచి వచ్చి మేడారంలో గద్దెపై సారలమ్మ కొలువు తీరింది. సారలమ్మను తీసుకవస్తుంటే భక్తులు ఊగిపోయారు. ఆ ఫొటోలు ఇక్కడ చూడండి.
తెలంగాణ కుంభమేళా మేడారం సమ్మక్క-సారలమ్మ మహా జాతరలో అత్యంత కీలక ఘట్టం ఆవిష్కృతమైంది. కోట్లాది భక్తులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ ఘడియ బుధవారం సాయంత్రం ప్రారంభమవ్వగా.. కన్నెపల్లి నుంచి గద్దెపైకి సారలమ్మ కొలువు తీరడం జాతరలో తొలి ప్రధాన ఘట్టంగా నిలిచింది.
ఈ ఘట్టానికి ముందుగా పూజారులు, జిల్లా యంత్రాంగం కన్నెపల్లి ఆలయానికి చేరుకుని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. సమ్మక్క దేవతల పూజారులు సిద్ధబోయిన వారి ఇంటికి చేరి సంప్రదాయ కార్యక్రమాలు చేపట్టగా, కొండాయి గ్రామం నుంచి గోవిందరాజుల దేవతను కన్నెపల్లికి తీసుకువచ్చారు. అనంతరం సారలమ్మ ప్రధాన పూజారి కాక సారయ్య, పూజారులు కాక వెంకటేశ్వర్లు, కాక కిరణ్ కుమార్, కాక కనకమ్మ, కాక భుజంగరావు, కాక లక్ష్మీబాయిలతో పాటు గోవిందరాజుల పూజారి దుబ్బకట్ల గోవర్ధన్లు కలిసి ఆదివాసీ ఆచారాల ప్రకారం ప్రత్యేక పూజలు నిర్వహించారు.
దాదాపు రెండు గంటల పాటు కన్నెపల్లి సారలమ్మ ఆలయంలో పూజా కార్యక్రమాలు నిర్వహించిన అనంతరం సుమారు సాయంత్రం 7 గంటలకు సారలమ్మ అమ్మవారు కన్నెపల్లి నుంచి బయలుదేరారు. జంపన్న వాగు మీదుగా మేడారం గ్రామానికి చేరుకున్న సందర్భంగా పూనకాలతో తన్మయత్వానికి లోనైన భక్తులు, డప్పు వాయిద్యాల నడుమ దారి పొడవునా అమ్మవారికి ఘన స్వాగతం పలికారు. ఈ ఘట్టంతో మేడారం పరిసరాలు భక్తి పరవశ్యంతో ఆధ్యాత్మిక వాతావరణాన్ని సంతరించుకున్నాయి.
రాత్రి 12.30 గంటలకు గద్దెల ప్రాంతానికి చేరుకున్న సారలమ్మ అమ్మవారికి అక్కడ ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం గోవిందరాజులు, పగిడిద్దారాజులతో కలిసి అర్ధరాత్రి గద్దెపైకి సారలమ్మ చేరుకున్నారు. ప్రధాన పూజారి సారయ్య అమ్మవారిని గద్దెలపైకి తీసుకొచ్చి కొలువు తీర్చారు.
మేడారం సమ్మక్క-సారలమ్మ మహా జాతరలో తొలి కీలక ఘట్టం పూర్తైంది. కొంగుబంగారు తల్లి సారలమ్మ గద్దెపై కొలువు తీరుతూ భక్తులకు దీవెనలు ఇస్తోంది.
E-Paper

