Health tests for men : 40ఏళ్లు వచ్చేశాయా? పురుషులు కచ్చితంగా చేయించుకోవాల్సిన 5 ఆరోగ్య పరీక్షలు..
నలభై ఏళ్ల వయసు దాటిన పురుషులు ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఎలాంటి స్క్రీనింగ్ టెస్ట్లు చేయించుకోవాలో నిపుణులు వివరిస్తున్నారు. ముందస్తు పరీక్షలతో అనారోగ్యాలను నివారించవచ్చని చెబుతున్నారు. ఆ వివరాలు..
వయసు నలభై ఏళ్లకు చేరిందంటే కొన్ని రకాల ఆరోగ్య సమస్యల ముప్పు పెరుగుతుంది. అందుకే తగిన స్క్రీనింగ్ పరీక్షలు చేయించుకోవడం ద్వారా ఏవైనా సమస్యలు ఉంటే ప్రారంభ దశలోనే గుర్తించవచ్చు. ముందస్తుగా తగిన జాగ్రత్తలు తీసుకోవడం వల్ల వ్యాధులు తీవ్రరూపం దాల్చకుండా కాపాడుకోవచ్చు. నలభై ఏళ్ల వయసు దాటిన పురుషులు ప్రధానంగా దృష్టి పెట్టాల్సిన ఐదు ఆరోగ్య అంశాలు ఇక్కడ ఉన్నాయి..
గుండె సంబంధిత ముప్పు- గుండె జబ్బులు అకస్మాత్తుగా నలభై ఏళ్ల వయసు రాగానే పుట్టుకొచ్చేవి కావు. ఏళ్ల తరబడి సరైన ఆహారం తీసుకోకపోవడం, విపరీతమైన ఒత్తిడి, శారీరక శ్రమ లేకపోవడం వంటి కారణాల వల్ల ఇవి క్రమంగా పెరుగుతాయి. నలభై ఏళ్లు రాగానే ఈ ముప్పు దానంతట అదే ఆన్ అవుతుందనే అపోహను వైద్యులు తోసిపుచ్చారు. అందుకే గుండె టెస్టులు ఖచ్చితంగా చేసుకోవాలి.
రక్తపోటు పరీక్ష- రక్తపోటును పరీక్షించడం అత్యంత సులభమైన ఆరోగ్య సూచిక అని వైద్యులు చెబుతున్నారు. అయితే అధిక రక్తపోటు ఉన్నప్పటికీ ఎలాంటి స్పష్టమైన లక్షణాలు కనిపించకపోవచ్చు. తలనొప్పి ఉండదు, తల తిరగడం ఉండదు, అసలు ఎలాంటి లక్షణాలు ఉండవు. కానీ కొందరు పురుషులు 150/95 బీపీ ఉన్నప్పటికీ తాము పూర్తిగా ఆరోగ్యంగా ఉన్నామని చెబుతుంటారు.
రక్తంలో చక్కెర స్థాయిల, కొలెస్ట్రాల్- రక్తంలో చక్కెర స్థాయిలు, కొలెస్ట్రాల్ ఒకదానితో ఒకటి ముడిపడి ఉంటాయని డాక్టర్లు చెబుతున్నారు. కుటుంబంలో ఎవరికైనా మధుమేహం చరిత్ర ఉంటే, లేదా గత కొన్ని సంవత్సరాలలో బరువు క్రమంగా పెరిగితే ఏడాదికి ఒకసారి ఫాస్టింగ్ గ్లూకోజ్, హెచ్బీఏ1సీ పరీక్షలు చేయించుకోవాలని సూచిస్తున్నారు.
కాలేయ ఆరోగ్యం- రక్తంలోని విష పదార్థాలను వడకట్టడం, పోషకాలను ప్రాసెస్ చేయడం వంటి ముఖ్యమైన బాధ్యతలను కాలేయం నిర్వహిస్తుంది. అయినప్పటికీ కాలేయ వ్యాధులు కేవలం ఎక్కువగా మద్యం తాగేవారికి మాత్రమే వస్తాయనే అపోహ కారణంగా దీనిపై తగినంత చర్చ జరగడం లేదని డాక్టర్లు అంటున్నారు.
క్యాన్సర్ స్క్రీనింగ్- వయసు పెరిగే కొద్ది కొన్ని రకాల క్యాన్సర్లు వచ్చే ముప్పు కూడా పెరుగుతుంది. "పురుషులకు నలభై ఏళ్లు దాటిన తర్వాత కొన్ని క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు చాలా ముఖ్యమైనవిగా మారుతాయి. ముఖ్యంగా ప్రోస్టేట్-స్పెసిఫైడ్ యాంటిజెన్ పరీక్ష, కొలొరెక్టల్ స్క్రీనింగ్ పరీక్షలను చేయించుకోవాలని," అని వైద్యులు సిఫార్సు చేస్తున్నారు.
E-Paper

