నానబెట్టిన కిస్మిస్ నీరు నిజంగా ఆరోగ్యానికి మేలు చేస్తుందా? ఇవి తెలుసుకోండి..
రాత్రిపూట నానబెట్టిన కిస్మిస్ నీటిని ఉదయాన్నే తాగడం వల్ల బరువు తగ్గుతారనే ప్రచారంలో ఎంత నిజం ఉంది? ఇది కేవలం ఆరోగ్యకరమైన అలవాటే తప్ప మ్యాజికల్ డ్రింక్ కాదని ప్రముఖ డైటీషియన్ సిమ్రత్ కతురియా స్పష్టం చేస్తున్నారు.
ఉదయాన్నే నిద్రలేవగానే రాత్రి నీటిలో నానబెట్టిన కిస్మిస్ నీటిని తాగడం చాలా మంది అలవాటుగా మార్చుకున్నారు. బరువు తగ్గడానికి, రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడానికి, శరీరాన్ని డిటాక్స్ చేయడానికి, జీర్ణక్రియను మెరుగుపరచడానికి, చర్మాన్ని కాంతివంతంగా మార్చడానికి ఇది చక్కటి చిట్కా అని సోషల్ మీడియాలో విపరీతంగా ప్రచారం జరుగుతోంది. ఆరోగ్యకరమైన జీవనశైలిలో కిస్మిస్ భాగమే అయినప్పటికీ, ఈ కిస్మిస్ వాటర్ ట్రెండ్ వెనుక అసలు నిజాలు ఏంటో నిపుణుల ద్వారా తెలుసుకోవడం చాలా ముఖ్యం. సెలబ్రిటీ డైటీషియన్ సిమ్రత్ కతురియా ఈ ట్రెండ్పై తన అభిప్రాయాలను పంచుకున్నారు.
కిస్మిస్లో సహజమైన డైటరీ ఫైబర్, పొటాషియం, పాలిఫెనాల్స్ వంటి ప్లాంట్ కాంపౌండ్స్ పుష్కలంగా ఉంటాయని సిమ్రత్ కతురియా తెలిపారు. ఇవి ఆకలిని అణచివేయడానికి, జీర్ణక్రియను మెరుగుపరచడానికి సహాయపడతాయని కొన్ని నిరూపణలు ఉన్నాయి. అంతేకాకుండా కిస్మిస్కు తక్కువ నుంచి మధ్యస్థ గ్లైసెమిక్ ఇండెక్స్ ఉంటుంది. అయితే, ఈ ప్రయోజనాలన్నీ నేరుగా కిస్మిస్ తినడం వల్లే లభిస్తాయి కానీ, వాటిని నానబెట్టిన నీటిని తాగడం వల్ల మాత్రమే ప్రత్యేకంగా రావు.
"ఈ నానబెట్టిన కిస్మిస్ నీరు రోజును ప్రారంభించడానికి ఒక మంచి మార్గం కావొచ్చు. ముఖ్యంగా దీన్ని ఇష్టపడే వారికి ఇది సహాయపడుతుంది. కానీ దీన్ని ఎలాంటి డిటాక్స్ లేదా బరువు తగ్గించే అద్భుత మందుగా భావించకూడదు. కేవలం కిస్మిస్ తినడం ద్వారా పొందే పోషకాలను మించి, ఈ నానబెట్టిన నీటి వల్ల ప్రత్యేకమైన ఆరోగ్య ప్రయోజనాలు ఏవీ లభించవని చెప్పడానికి తగిన ఆధారాలు లేవు," అని సిమ్రత్ కతురియా తేల్చిచెప్పారు.
పరిశోధనల ప్రకారం నీటి వినియోగం పెంచడం వల్ల బరువు నియంత్రణ వంటి అనేక విధాలుగా ప్రయోజనం కలుగుతుంది. ఒకవేళ మీకు కిస్మిస్ ఇష్టమైతే రాత్రిపూట నీటిలో నానబెట్టి అల్పాహారంతో పాటు తీసుకోవడంలో ఎలాంటి తప్పు లేదు. అయితే కేవలం నీరు తాగి వదిలేయకుండా ఆ కిస్మిస్ను కూడా కచ్చితంగా తినాలి. ఎందుకంటే ఫైబర్, ఇతర పోషకాలు నీటిలోకి పూర్తిగా మారవు.
అలాగే ఆహార మోతాదు కూడా చాలా ముఖ్యం. కిస్మిస్లు ఎండిన పండ్లు కాబట్టి వాటిలో చక్కెర, కేలరీలు చాలా ఉంటాయి. రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించుకునేవారు లేదా కేలరీలను లెక్కించేవారు గుప్పెళ్ల కొద్దీ కిస్మిస్లను తినకూడదు. కంటికి కనిపించే ప్రతీ ఆరోగ్య ట్రెండ్ను గుడ్డిగా అనుసరించాల్సిన అవసరం లేదు. మీ శరీరానికి ఏది సరిపోతుందో తెలుసుకుని, వాస్తవిక దృక్పథంతో దీర్ఘకాలికంగా పాటించగల సరైన ఆహారపు అలవాట్లను ఎంచుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
E-Paper

