Digital detox : డిజిటల్ డీటాక్స్ పనిచేస్తుందా? మెదడుకు ఏమవుతుంది? అసలు సైన్స్ ఇదే..
నిరంతరం నోటిఫికేషన్లు, సోషల్ మీడియా స్క్రోలింగ్తో సతమతమవుతున్న మెదడును, శరీరాన్ని కాపాడుకునేందుకు 'డిజిటల్ డీటాక్స్ రిట్రీట్స్' శరవేగంగా విస్తరిస్తున్నాయి. అసలు స్క్రీన్లకు దూరంగా ఉంటే మన శరీరంలో, మెదడులో ఎలాంటి అద్భుత మార్పులు జరుగుతాయో న్యూరాలజిస్ట్ మాటల్లో తెలుసుకోండి..
ఉదయం కన్ను విప్పింది మొదలు రాత్రి నిద్రపోయే వరకు మన కళ్లు ఏదో ఒక స్క్రీన్ను చూస్తూనే ఉంటున్నాయి. స్మార్ట్ఫోన్లు, ల్యాప్టాప్లు, ట్యాబ్లు, స్మార్ట్ టీవీలు.. ఇలా డివైజ్లు మన జీవితాన్ని సంపూర్ణంగా ఆక్రమించేశాయి. ఉదయం లేవగానే నోటిఫికేషన్లు, ఆఫీస్ ఈమెయిళ్లు, వాట్సాప్ మెసేజ్లు, సోషల్ మీడియా లైక్లు.. ఈ నిరంతర 'డిజిటల్ శబ్దం' మన మెదడును ఒక క్షణం కూడా ప్రశాంతంగా ఉండనివ్వడం లేదు. ఈ మానసిక, శారీరక ఒత్తిడి నుంచి బయటపడేందుకు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ప్రజలు ‘డిజిటల్ డిటాక్స్ రిట్రీట్స్’వైపు పరుగులు తీస్తున్నారు. అంటే కొన్ని రోజుల పాటు ఫోన్లు, గాడ్జెట్లను పక్కన పెట్టి, ప్రకృతి ఒడిలో ప్రశాంతంగా గడిపే పర్యాటక ప్యాకేజీలు ఇవి. అసలు ఈ డిజిటల్ డీటాక్స్ బిజినెస్ ఎందుకు అంతగా పెరుగుతోంది? ఫోన్ పక్కన పెడితే మన శరీరంలో, మెదడులో ఏం జరుగుతుంది? బెంగళూరులోని రామయ్య మెమోరియల్ హాస్పిటల్ న్యూరాలజీ విభాగధిపతి డాక్టర్ మహేంద్ర జేవి అందించిన సైంటిఫిక్ విశ్లేషణ ఇదిగో..
డిజిటల్ డీటాక్స్ కేవలం ఒక తాత్కాలిక ఫ్యాషన్ కాదని, మన ఆరోగ్యం డిమాండ్ చేస్తున్న అవసరమని గణాంకాలు చెబుతున్నాయి. "డిజిటల్ డిటాక్స్ రిట్రీట్ మార్కెట్ 2026 నాటికి 1.65 బిలియన్ డాలర్ల స్థాయికి చేరుకుంటుంది. 2030 వరకు ఇది ఏటా 12.2 శాతం వృద్ధిని నమోదు చేయనుంది. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 67 శాతం మంది పర్యాటకులు తమ పర్యటనల్లో స్క్రీన్ రహిత లేదా తక్కువ డివైజ్ లభ్యత ఉన్న అనుభవాలనే కోరుకుంటున్నారు," అని డాక్టర్ మహేంద్ర వెల్లడించారు. మనం నిరంతరం నెట్వర్క్తో కనెక్ట్ అయి ఉండటం వల్ల నరాల వ్యవస్థపై తీవ్ర ఒత్తిడి పడుతుందని, ఫోన్కు దూరంగా ఉండటం వల్ల శరీరంలో జీవక్రియ మార్పులు జరుగుతాయని న్యూరాలజీ పరిశోధనలు స్పష్టం చేస్తున్నాయని వివరించారు.
స్ట్రెస్ హార్మోన్ల అదుపు- ఫోన్ మోగిన ప్రతిసారీ, నోటిఫికేషన్ వచ్చిన ప్రతిసారీ మన నాడీ వ్యవస్థ 'హై అలర్ట్' మోడ్లోకి వెళ్తుంది. దీనివల్ల శరీరంలో 'కార్టిసోల్' అనే స్ట్రెస్ హార్మోన్, అడ్రినలిన్ నిరంతరం విడుదలవుతాయి. స్క్రీన్లకు దూరంగా ఉన్నప్పుడు ఈ హార్మోన్ల స్థాయిలు క్రమంగా తగ్గుతాయి. ఫలితంగా రక్తపోటు అదుపులోకి వస్తుంది, గుండె కొట్టుకునే వేగం ప్రశాంతంగా మారడమే కాకుండా శరీరంలో ఇన్ఫ్లమేషన్ తగ్గుతుంది.
డోపమైన్ రీసెట్- మన ఫోన్లలోని యాప్లన్నీ మెదడులోని 'డోపమైన్' (రివార్డ్ సిస్టమ్) వ్యవస్థను టార్గెట్ చేసి డిజైన్ చేసినవే. ప్రతి మెసేజ్ లేదా లైక్ చూసినప్పుడు మెదడులో చిన్న మొత్తంలో డోపమైన్ విడుదలవుతుంది. దీనివల్ల "మరో నోటిఫికేషన్ చూద్దాం" అనే తీవ్రమైన కోరిక పుడుతుంది. డిజిటల్ డీటాక్స్ చేయడం వల్ల డోపమైన్ రీసెప్టర్లు మళ్లీ పునరుజ్జీవనం పొందుతాయి. దీనివల్ల దేనిపైనా అయినా సులభంగా దృష్టి సారించే సామర్థ్యం, స్వీయ నియంత్రణ పెరుగుతాయి.
గాఢమైన నిద్ర – స్క్రీన్ల నుంచి వచ్చే ‘బ్లూ లైట్’ నిద్రను ప్రేరేపించే 'మెలటోనిన్' అనే హార్మోన్ ఉత్పత్తిని అడ్డుకుంటుంది. అందుకే రాత్రి పడుకునే ముందు ఫోన్ చూస్తే శరీరం అలసిపోయినా మెదడు మెలకువగానే ఉంటుంది. డిజిటల్ డీటాక్స్ ప్రారంభించగానే నిద్రలేమి సమస్య దూరమవుతుంది. త్వరగా నిద్ర పట్టడం, మధ్యలో మెలకువ రాకపోవడం, కళ్లు పొడిబారడం తగ్గడం వంటి మార్పులు స్పష్టంగా కనిపిస్తాయి.
ఆందోళన, డిప్రెషన్ దూరం- ప్రతి నోటిఫికేషన్ మన శ్రద్ధను వేరే వైపునకు మళ్లిస్తుంది. మళ్లీ పనిపై దృష్టి పెట్టడానికి మెదడు తీవ్రంగా శ్రమించాల్సి వస్తుంది. స్క్రీన్ టైమ్ తగ్గించడం వల్ల మెదడుకు కావాల్సినంత విశ్రాంతి లభిస్తుంది. అంతేకాకుండా, సోషల్ మీడియాలో ఇతరుల జీవితాలతో మనల్ని పోల్చుకోవడం వల్ల వచ్చే ఆందోళన, డిప్రెషన్ వంటి రుగ్మతలు తగ్గుముఖం పడతాయి.
ఒకటి రెండు రోజులు ఫోన్ పక్కన పెడితే తాత్కాలిక ఉపశమనం లభిస్తుంది కానీ, మెదడులోని డోపమైన్ స్థాయిలు పూర్తిగా రీసెట్ అయి శాశ్వత ఆరోగ్యకరమైన అలవాట్లు రావడానికి కనీసం 1 నుండి 2 వారాల సమయం పడుతుందని డాక్టర్ మహేంద్ర వివరిస్తున్నారు. ప్రారంభంలో మొదటి రెండు మూడు రోజులు ఫోన్ చూడకుండా ఉండటం వల్ల కొంత అసహనం, చిరాకు, చికాకు కలగడం సహజమేనని, కానీ ఆ కష్టాన్ని దాటితే మెదడు అద్భుతమైన ప్రశాంతతను పొందుతుందని ఆయన స్పష్టం చేశారు. రోజుకు కనీసం కొన్ని గంటలైనా స్మార్ట్ఫోన్ రహిత సమయాన్ని (నో స్క్రీన్ టైమ్) కేటాయించుకోవడం నేటి కాలంలో ఎంతో అవసరం అంటున్నారు.
E-Paper

