New Toll Rules : నేషనల్ హైవేలపై కొత్త టోల్ నిబంధనలు- అలా చేస్తే రెట్టింపు జరిమానా..!
భారత ప్రభుత్వం జాతీయ రహదారుల టోల్ నిబంధనల్లో కీలక మార్పులు చేసింది. ఇకపై టోల్ కట్టకుండా వెళ్లే వాహనదారులకు ఈ-నోటీసులు పంపడంతో పాటు, సకాలంలో స్పందించకుంటే రెట్టింపు జరిమానా విధించనున్నారు. ఈ వ్యవస్థను నేరుగా 'వాహన్' డేటాబేస్తో అనుసంధానించారు.
దేశవ్యాప్తంగా అడ్డంకులు లేని రహదారులను నిర్మించాలనే లక్ష్యంతో భారత ప్రభుత్వం టోల్ నిబంధనలను సవరించింది. కొత్త డిజిటల్ ఎన్ఫోర్స్మెంట్ వ్యవస్థను అమల్లోకి తెస్తూ కేంద్రం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. దీనివల్ల టోల్ వసూళ్లలో పారదర్శకత పెరగడమే కాకుండా, నిబంధనలు ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది.
కొత్త రూల్స్ ప్రకారం.. ఎలక్ట్రానిక్ టోల్ కలెక్షన్ సిస్టమ్ ద్వారా వాహనం రికార్డు అయినప్పటికీ, టోల్ ఫీజు జమ కాకపోతే దానిని ‘అన్పెయిడ్ యూజర్ ఫీ’గా పరిగణిస్తారు. అంటే ఫాస్టాగ్లో బ్యాలెన్స్ లేకపోయినా లేదా సాంకేతిక కారణాలతో టోల్ కట్ కాకపోయినా దానిని ఉల్లంఘనగానే గుర్తిస్తారు. మరోవైపు టోల్ ప్లాజాల వద్ద భౌతిక తనిఖీలను తగ్గించి, డిజిటల్ పద్ధతిలో నిఘా పెంచనున్నారు. టోల్ చెల్లించని వారికి ఎస్ఎంఎస్, ఈమెయిల్ లేదా మొబైల్ యాప్స్ ద్వారా 'ఈ-నోటీసు' పంపుతారు. అందులో వాహనం నంబర్, టోల్ దాటిన ప్రదేశం, తేదీ, చెల్లించాల్సిన మొత్తం వివరాలు ఉంటాయి.
టోల్ ఫీజు చెల్లించకపోతే, అసలు మొత్తం కంటే రెండు రెట్లు జరిమానాగా కట్టాల్సి ఉంటుంది. అయితే, వాహనదారులకు ఒక మంచి అవకాశం కల్పించారు. ఈ-నోటీసు వచ్చిన 72 గంటల లోపు టోల్ చెల్లిస్తే, కేవలం అసలు మొత్తాన్ని మాత్రమే కడితే సరిపోతుంది. ఎలాంటి అదనపు జరిమానా ఉండదు.
ఒకవేళ నోటీసులో తప్పులు ఉన్నాయని భావిస్తే, వాహన యజమానులు 72 గంటల్లోపు దానిని సవాలు చేయవచ్చు. అధికారులు 5 రోజుల్లోపు ఆ ఫిర్యాదును పరిష్కరించాలి, లేదంటే ఆ టోల్ క్లెయిమ్ ఆటోమేటిక్గా రద్దవుతుంది.
అత్యంత కీలకమైన మార్పు ఏంటంటే, ఈ టోల్ వ్యవస్థను ‘వాహన్’ డేటాబేస్తో లింక్ చేశారు. నోటీసు వచ్చిన 15 రోజుల వరకు చెల్లింపు చేయకపోయినా లేదా ఫిర్యాదు చేయకపోయినా, ఆ బకాయి వాహన్ పోర్టల్లో రికార్డ్ అవుతుంది. దీనివల్ల భవిష్యత్తులో ఆ వాహనానికి సంబంధించిన ఇతర సేవలు (రెన్యూవల్స్ వంటివి) నిలిచిపోయే ప్రమాదం ఉంది.
E-Paper

