ఉచితంగా ఏపీ టెట్ కోచింగ్ - వీరు మాత్రమే అర్హులు, వివరాలు ఇలా నమోదు చేసుకోండి
ఏపీ టెట్ నోటిఫికేషన్ విడుదలైన సంగతి తెలిసిందే. ఇప్పటికే పరీక్షల తేదీలు కూడా ఖరారయ్యాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర మైనారిటీ సంక్షేమ శాఖ కీలక ప్రకటన చేసింది. ఉచితంగా టెట్ కోచింగ్ అందివ్వనున్నట్లు ప్రకటించింది. మైనారిటీ యువత సద్వినియోగం చేసుకోవాలని మంత్రి ఎన్ఎండి ఫరూక్ ఓ ప్రకటన ద్వారా కోరారు.
రాష్ట్ర విద్యా శాఖ నిర్వహించబోయే టెట్ పరీక్షకు హాజరయ్యే మైనారిటీ యువతకు ఉచితంగా కోచింగ్ ఇవ్వనున్నారు. ఇందుకోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ మేరకు రాష్ట్ర న్యాయ, మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ ఓ ప్రకటన విడుదల చేశారు.
ఏపీ ప్రభుత్వ మైనారిటీ సంక్షేమ శాఖ ఆధ్వర్యం లో సెంటర్ ఫర్ ఎడ్యుకేషనల్ డెవలప్మెంట్ అఫ్ మైనారిటీస్ (సిఈడియం) ద్వారా మైనారిటీలకు ఉచిత కోచింగ్ అందించడం జరుగుతుందని మంత్రి తెలిపారు. విద్యా శాఖ ఈ ఏడాది డిసెంబర్ 10 న టెట్ పరీక్ష నిర్వహిస్తుందన్నారు.
టెట్ పరీక్షలకు నవంబర్ మొదటి వారం చివరి నుండి మైనారిటీ యువతకు ఉచితంగా కోచింగ్ తరగతులు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయడం జరిగిందన్నారు.
టెట్ పరీక్ష కోసం కోచింగ్ ను ఆన్ లైన్ తో పాటు ఆఫ్ లైన్ ద్వారా అందిస్తారు. కూటమి ప్రభుత్వం చేపట్టిన ఈ అవకాశాన్ని మైనారిటీ యువతి యువకులు సద్వినియోగం చేసుకోవాలని మంత్రి ఫరూక్ కోరారు.
పూర్తి వివరాల కోసం సిఈడియం వెబ్ సైట్ www.apcedmmwd.org ద్వారా టెట్ పరీక్షకు సన్నద్ధమయ్యే మైనారిటీ యువత తమ వివరాలు నమోదు చేసుకోవాలన్నారు. మరింత సమాచారం కోసం సిఈడియం కార్యాలయం, భవానీపురం, విజయవాడ - 5200012 కు లేదా 0866-2970567, 7386789966 నెంబర్లను సంప్రదించవచ్చు.
E-Paper

