Andhra Pradesh Weather : బంగాళాఖాతంలో అల్పపీడనం - ఇవాళ ఈ జిల్లాలకు వర్ష సూచన, IMD అంచనాలు ఇలా
Andhra Pradesh Rain Alert : ఉపరితల ఆవర్తనం ప్రభావంతో బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ (APSDMA) తెలిపింది. ఈ ప్రభావంతో ఇవాళ ఏపీలోని పలు జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వాతావరణంలో కీలక మార్పులు చోటుచేసుకోనున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఇవాళ (బుధవారం) వాయువ్య బంగాళాఖాతం పరిసర ప్రాంతాల్లో అల్పపీడనం బలపడే అవకాశం ఉందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ (APSDMA) వెల్లడించింది.
దీని ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ పేర్కొంది. ఈ మేరకు పలు జిల్లాలకు వర్ష ఉందని అంచనా వేసింది.
ఇవాళ(ఆగస్ట్ 18, 2026) పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, పోలవరం జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది.
అంతేకాకుండా శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ చెదురుమదురుగా తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది.
వర్షాలు పడే సమయంలో వాతావరణంలో వేగంగా మార్పులు వస్తాయని, ఉరుములు, మెరుపులు మరియు ఈదురుగాలులు వీచే ముప్పు ఉందని అధికారులు హెచ్చరించారు. ఈ సమయంలో బయట ఉండే ప్రజలు, ముఖ్యంగా రైతులు, వ్యవసాయ కూలీలు, పశువుల కాపరులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
ఉరుములు, మెరుపులతో కూడిన ఈదురుగాలులు వీచే సమయంలో ప్రజలు ఎట్టి పరిస్థితుల్లోనూ బహిరంగ ప్రదేశాల్లోని పెద్ద పెద్ద చెట్ల కింద గానీ, ప్రకటనల భారీ హోర్డింగ్స్ వద్ద గానీ నిలబడకూడదని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ స్పష్టం చేసింది. విద్యుత్ స్తంభాలు, పాత భవనాలు, ఐరన్ షెడ్ల వద్ద కాసేపు ఆగడం కూడా ప్రమాదకరమని పేర్కొంది.
వర్షం, పిడుగులు పడే సమయంలో ప్రతి ఒక్కరూ సురక్షితమైన కాంక్రీట్ భవనాలు లేదా సురక్షిత ప్రాంతాల్లో మాత్రమే ఆశ్రయం పొందాలని విజ్ఞప్తి చేసింది.
E-Paper

