సర్వీస్లో ఉన్న టీచర్లకూ ‘టెట్’ తప్పనిసరి - ఏ క్షణమైనా నోటిఫికేషన్..!
సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో సర్వీస్ లో ఉన్న టీచర్లు తప్పనిసరిగా టెట్ పాస్ కావాల్సి ఉంది. దీంతో నోటిఫికేషన్ ఇచ్చేందుకు ఏపీ విద్యాశాఖ కసరత్తు చేస్తోంది. ఏ క్షణంలోనైనా నోటిఫికేషన్ ను విడుదల చేసే అవకాశం ఉంది.
సర్వీసులో ఉన్న టీచర్లు ఉద్యోగంలో కొనసాగాలంటే టెట్ పాస్ కావాలని సుప్రీంకోర్టు సెప్టెంబర్ 1న తీర్పును వెలువరించిన సంగతి తెలిసిందే. ఇదే విషయాన్ని ఎన్సిటిఇ కూడా స్పష్టం చేసింది. దీంతో సర్వీస్ లో ఉన్న టీచర్లు తప్పకుండా టెట్ రాసి ఉత్తీర్ణత సాధించాల్సి ఉంది.
సుప్రీం తీర్పు ప్రకారం ఐదేళ్లలో పదవీ విరమణ చేయబోయేవారికి మాత్రమే టెట్ అవసరం లేదు. అయితే వారు పదోన్నతి పొందాలంటే మాత్రం టెట్ పాస్ కావాల్సి ఉంటుంది. టెట్ పరీక్షను 2010 నుంచి నిర్వహిస్తూ వస్తున్నారు. 2010 తర్వాత నియామకమైన ఉపాధ్యాయులందరూ టెట్ ఉత్తీర్ణత సాధించి ఉన్నారు. అంతకుముందు నియమితులై సర్వీసులో కొనసాగుతున్న వారిలో కొందరు మాత్రమే టెట్ ఉత్తీర్ణత సాధించగా, మరికొందరు టెట్ ఉత్తీర్ణత సాధించాల్సి ఉంది.
సుప్రీంకోర్టు తీర్పుపై ఇప్పటికే కొన్ని ఉపాధ్యాయ సంఘాలు రివ్యూ పిటిషన్లు వేశాయి. ఈ తీర్పు కోసం వేచి ఉండేవారికీ వెసులుబాటు కల్పిస్తారు. ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చిన వెంటనే పాఠశాల విద్యాశాఖ డైరెక్టరేట్ షెడ్యూల్ను విడుదల చేయనుంది.
ఈ రెండు మూడు రోజుల్లో టీచర్ల కోసం టెట్ నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశం ఉందని తెలుస్తోంది.ఇందుకోసం ఏపీ విద్యాశాఖ కసరత్తు చేస్తోంది. ఏ క్షణమైనా నోటిఫికేషన్ రావొచ్చు.
సర్వీసులో ఉన్న ఉపాధ్యాయులకు విద్యార్హతల్లో కనీస మార్కులు ఉండాలనే దానిపై ఇంతవరకు స్పష్టత రాలేదు. దీనిపై నోటిఫికేషన్ లో క్లారిటీ ఇస్తారు.
E-Paper

