Southwest Monsoon Update : అండమాన్ లోకి నైరుతి రుతుపవనాలు - ఏపీలోకి ఎప్పుడు రావొచ్చంటే..?
Southwest Monsoon Updates 2026 : నైరుతి రుతుపవనాలు భారత్ను తాకాయి. అండమాన్ సముద్రం, బంగాళాఖాతంలోకి ప్రవేశించిన ఇవి…. మే 26 నాటికి కేరళ తీరాన్ని తాకే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది.
దేశవ్యాప్తంగా ఎండ తీవ్రత, ఉక్కపోతతో అల్లాడుతున్న ప్రజలకు ఉపశమనం కలిగిస్తూ రుతుపవనాలు దేశంలోకి అధికారికంగా ప్రవేశించాయి. మే 16 శనివారం నాటికే నైరుతి రుతుపవనాలు ఆగ్నేయ అరేబియా సముద్రంలోని కొన్ని ప్రాంతాలకు విజయవంతంగా విస్తరించాయి. దీనితో పాటు నైరుతి మరియు ఆగ్నేయ బంగాళాఖాతంలోని మరికొన్ని భాగాలు, అండమాన్ సముద్రంలోని అత్యధిక ప్రాంతాలు మరియు నికోబార్ దీవుల సమూహంలోకి ఇవి వేగంగా ముందుకు కదిలాయి.
సాధారణంగా అండమాన్ పరిసర ప్రాంతాల్లోకి మే 22వ తేదీ నాటికి రావాల్సిన రుతుపవనాలు…. ఈ ఏడాది అంతకంటే ముందే అంటే మే 16 నాటికే విస్తరించడం విశేషం. వాతావరణ పరిస్థితులు అనుకూలంగా మారడం, సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలలో వస్తున్న మార్పుల వల్ల రుతుపవనాల కదలికలు చురుగ్గా సాగుతున్నట్లు శాస్త్రవేత్తలు విశ్లేషిస్తున్నారు.
భారత ప్రధాన భూభాగానికి రుతుపవనాల రాకను సూచించే కేరళ ప్రవేశంపై కూడా ఐఎండీ స్పష్టతనిచ్చింది. ఈ ఏడాది మే 26వ తేదీ నాటికి నైరుతి రుతుపవనాలు కేరళ తీరాన్ని తాకే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం అంచనా వేసింది. అయితే వాతావరణ మార్పుల తీవ్రతను బట్టి దీనికి ప్లస్ లేదా మైనస్ 4 రోజులు (± 4 రోజులు) అటు ఇటుగా మార్పులు జరగొచ్చని అధికారులు స్పష్టం చేశారు. అంటే మే 22 నుంచి మే 30వ తేదీల మధ్యలో ఎప్పుడైనా రుతుపవనాలు కేరళలోకి అధికారికంగా ప్రవేశించవచ్చు.
కేరళలోకి ప్రవేశించిన తర్వాత ఈ రుతుపవనాలు క్రమంగా దేశంలోని ఇతర రాష్ట్రాలకు విస్తరిస్తాయి.రుతుపవనాలు కేరళలో ప్రవేశించిన తర్వాత.. ఏపీలోని రాయలసీమకు విస్తరిస్తాయి. ఆ తర్వాత రాష్ట్రమంతా అలాగే.. తెలంగాణకు విస్తరించి వర్షాలు కురిపిస్తాయి. ఐఎండి అంచనాన్ని బట్టి.. ప్రతిఏటా సాధారణంగా రుతుపవనాలు జూన్ 1న తాకిన తర్వాత పది రోజులకు ఏపీలోకి ప్రవేశిస్తాయని అంచనా. కానీ ఈసారి ఈ నెలాఖరు లోగానే కేరళకు తాకితే.. అప్పటి పరిస్థితులను బట్టి ఏపీలోకి ఇప్పుడు ప్రవేశిస్తుందనేది ఒక అంచనాకు రావొచ్చు.
ఏడాది రుతుపవనాలు ముందుగానే కదులుతుండటంతో… జూన్ మొదటి వారంలోనే తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
దేశంలో సగానికి పైగా వ్యవసాయం ఈ నైరుతి రుతుపవనాల వర్షాలపైనే ఆధారపడి ఉండటంతో… వీటి రాక వార్త అటు అన్నదాతలకు, ఇటు ప్రభుత్వాలకు పెద్ద ఊరటనివ్వనుంది.
E-Paper

