కడుపులో నుంచి శబ్దాలు ఎందుకు వస్తాయి? ఆకలి వల్లే అనుకుంటే పొరపాటే!
ప్రశాంతంగా ఉన్న సమయంలో కడుపులోంచి వచ్చే వింత శబ్దాలు కేవలం ఆకలికే సంకేతం అనుకుంటే పొరపాటే! జీర్ణవ్యవస్థలో జరిగే ఈ ప్రక్రియ వెనుక ఉన్న అసలు వైద్య కారణాలు, ఏ ఆహారాలు ఈ శబ్దాలను పెంచుతాయి, ఎప్పుడు డాక్టర్ను కలవాలో ఈ కథనంలో వివరంగా తెలుసుకోండి..
ప్రశాంతంగా ఉన్న ఆఫీస్ మీటింగ్లోనో లేదా ఇంట్లో ఖాళీగా కూర్చున్నప్పుడో సడన్గా కడుపులోంచి 'గుడగుడ' లేదా 'గుర్రు గుర్రు' అంటూ పెద్ద శబ్దాలు రావడం చాలామంది అనుభవించే ఉంటారు. ఇలా శబ్దం రాగానే మనకు గుర్తొచ్చే మొదటి ఆలోచన.. 'బాగా ఆకలేస్తోంది'. అయితే, కడుపులోంచి వచ్చే ఈ తరహా శబ్దాలకు కేవలం ఆకలి మాత్రమే కారణం కాదని ప్రముఖ జీర్ణకోశ వ్యాధి నిపుణులు స్పష్టం చేస్తున్నారు.
మనం ఆహారం తీసుకున్నా, తీసుకోకపోయినా మన జీర్ణవ్యవస్థ నిరంతరం పనిచేస్తూనే ఉంటుంది. భోజనం చేసిన కొన్ని గంటల తర్వాత కడుపు ఖాళీగా ఉన్న సమయంలో కూడా ప్రేగులలోని కండరాలు సంకోచ వ్యాకోచాలు చెందుతాయి. ఈ ప్రక్రియను వైద్య పరిభాషలో 'మైగ్రేటింగ్ మోటార్ కాంప్లెక్స్' అని పిలుస్తారు. ప్రేగులలో మిగిలివున్న ద్రవాలు, వాయువులు (గ్యాస్) ముందుకు కదిలే సమయంలో వచ్చే శబ్దాలనే 'బోర్బోరిగ్మి' (Borborygmi) అంటారు. "కడుపు ఖాళీగా ఉన్న సమయంలో ప్రేగుల చలనం వల్ల వచ్చే శబ్దాలు మరింత స్పష్టంగా బయటకు వినిపిస్తాయి," అని ఫరీదాబాద్ మెట్రో హాస్పిటల్ గ్యాస్ట్రోఎంటరాలజీ విభాగధిపతి డాక్టర్ విశాల్ ఖురానా వివరించారు. ప్రేగులు తమలోని వ్యర్థాలను, గ్యాస్ను బయటకు నెట్టే క్రమంలో చేసే సహజమైన శబ్దమే ఇదని ఆయన పేర్కొన్నారు.
మనం రోజువారీ భోజనంలో తీసుకునే కొన్ని రకాల ఆహార పదార్థాలు కూడా కడుపులో గ్యాస్ ఉత్పత్తిని పెంచి, ఈ శబ్దాలు ఎక్కువయ్యేలా చేస్తాయి. కూల్ డ్రింక్స్, సోడా వంటి కార్బోనేటెడ్ పానీయాలతో పాటు బీన్స్, వెల్లుల్లి, ఉల్లిపాయలు, యాపిల్స్ వంటి పండ్లు ప్రేగులలో వాయువులను ఎక్కువగా తయారుచేస్తాయి. ఫలితంగా జీర్ణవ్యవస్థలో చలనంతో గుడగుడ శబ్దాలు మోత మోగుతాయి. నిర్దిష్ట ఆహారం తిన్న తర్వాతే ఈ సమస్య పదే పదే వస్తుంటే, ఆ ఆహారమే కడుపులో గ్యాస్ ఉత్పత్తికి కారణమవుతోందని అర్థం చేసుకోవాలి.
అప్పుడప్పుడు కడుపులో శబ్దాలు రావడం జీర్ణవ్యవస్థ ఆరోగ్యంగా ఉందనడానికి నిదర్శనం. అయితే, ఈ శబ్దాలు రోజూ పదే పదే వస్తూ, ఇతర ఆరోగ్య సమస్యలతో తోడైతే మాత్రం అప్రమత్తమవ్వాలి. "కడుపులో శబ్దాలతో పాటు తీవ్రమైన కడుపునొప్పి, వాంతులు, వికారం, మలబద్ధకం, విరేచనాలు, ఉన్నట్టుండి బరువు తగ్గడం, జ్వరం, రక్తహీనత (హిమోగ్లోబిన్ పడిపోవడం) లేదా నల్లటి మలం రావడం వంటి లక్షణాలు ఉంటే వెంటనే వైద్యుడిని సంప్రదించాలి," అని డాక్టర్ విశాల్ ఖురానా హెచ్చరిస్తున్నారు.
కేవలం శబ్దం రావడం పెద్ద సమస్య కాకపోవచ్చు. కానీ, దానితో పాటు పైన పేర్కొన్న తీవ్రమైన లక్షణాలు ఉంటే ప్రేగులకు సంబంధించిన ఏదైనా అంతర్గత ఆరోగ్య సమస్య ఉండే అవకాశం ఉందని గ్రహించి తగిన వైద్య పరీక్షలు చేయించుకోవడం శ్రేయస్కరం.
E-Paper

