సచివాలయానికి మాజీ మావోయిస్ట్ అగ్రనేతలు - సీఎం రేవంత్రెడ్డితో భేటీ
ఇటీవలే తెలంగాణ పోలీసుల ఎదుట లొంగిపోయిన పలువురు మావోయిస్ట్ అగ్రనేతలు సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. మాజీ మావోయిస్ట్ నేతలు ఇలా భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది.
తెలంగాణ సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని లొంగిపోయిన ఆరుగురు మావోయిస్టు అగ్రనేతలు శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిశారు.
ఇటీవలే డీజీపీ శివధర్రెడ్డి ఎదుట లొంగిపోయిన సీనియర్ నేతలు తిప్పిరి తిరుపతి (దేవ్జీ), మల్లా రాజిరెడ్డి (సంగ్రామ్), బడే చొక్కారావు (దామోదర్), నూనె నరసింహారెడ్డి (గంగన్న)లతో పాటు సుజాతక్క, చంద్రన్నలు ముఖ్యమంత్రిని కలిశారు.
దశాబ్దాల పాటు అడవిలో ఉన్న వీరంతా జనజీవన స్రవంతిలో కలిశారు. అయితే ఈ అగ్రనేతలంతా నేరుగా అధికార కేంద్రమైన సచివాలయంలో ముఖ్యమంత్రితో సమావేశం కావటం ఆసక్తికరంగా మారింది.
లొంగిపోయిన నేతలు….. వారి పునరావాసం, వారి కుటుంబాల భద్రతపై చర్చించినట్లు తెలుస్తోంది. ప్రజాస్వామ్య పద్ధతుల్లో ప్రజా సమస్యల పరిష్కారం కోసం వీరు చేపట్టబోయే తదుపరి కార్యాచరణపై ముఖ్యమంత్రికి వివరించినట్లు సమాచారం.
మాజీ మావోయిస్టులతో జరిగిన భేటీలో ప్రభుత్వ సలహాదారులు కె.కేశవరావు, వేం నరేందర్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, డీజీపీ శివధర్ రెడ్డి, ఇంటెలిజెన్స్ ఏడీజీ విజయ్ కుమార్, స్పెషల్ బ్రాంచీ ఐజీ సుమతి పాల్గొన్నారు.
E-Paper

