భూముల రిజిస్ట్రేషన్ లో ఇకపై 'సర్వే మ్యాప్' తప్పనిసరి - ఎకరాల చొప్పున ఛార్జీలు..! ఇవిగో వివరాలు
తెలంగాణలోని మండలాలకు సర్వేయర్లు వచ్చేశారు. ఇకపై ఏ భూమి రిజిస్ట్రేషన్ జరగాలన్నా… సర్వే మ్యాప్ తప్పనిసరి. ఈ పనిని సర్వేయర్లు పూర్తి చేయాల్సి ఉంటుంది. అయితే ఛార్జీల వివరాలు ఎలా ఉంటాయో ఇక్కడ తెలుసుకోండి….
తెలంగాణలోని మండలాలకు సర్వేయర్లు వచ్చేశారు. ఇకపై ఏ భూమి రిజిస్ట్రేషన్ జరగాలన్నా… సర్వే మ్యాప్ తప్పనిసరి. ఈ పనిని సర్వేయర్లు పూర్తి చేయాల్సి ఉంటుంది.
భూ భారతి చట్టంలో భాగంగా ప్రతి మండలానికి సర్వేయర్లను నియమించారు. ఈ పోస్టుల కోసం పదివేల మంది దరఖాస్తు చేసుకోగా…. ఏడువేల మందికి శిక్షణ ఇచ్చారు. వీరిలో 3456 మంది క్షేత్రస్ధాయిలో తర్ఫీదు పొంది ఎంపికయ్యారు. వీరికి ఆదివారం సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా లైసెన్స్లు అందజేశారు.
భూ భారతి చట్టం అమల్లోకి రావటంతో… రాష్ట్రంలో భూముల నిర్వహణతో పాటు రిజిస్ట్రేషన్ల వంటి అంశాలన్నీ కూడా భూ భారతి పోర్టల్ ఆధారంగానే జరగనున్నాయి. రిజిస్ట్రేషన్, మ్యూటేషన్ వంటి ప్రక్రియలో ప్రభుత్వం పలు మార్పులను కూడా తీసుకువచ్చిన సంగతి తెలిసిందే.
భూ భారతి చట్టం ప్రకారం… ఇకపై భూముల రిజిస్ట్రేషన్లు కావాలంటే సర్వే మ్యాప్ తప్పనిసరి కానుంది. సర్వే మ్యాప్ ఉంటేనే రిజిస్ట్రేషన్ జరుగుతుందని చట్టంలో పొందుపరిచారు. దీంతో సర్వేయర్ల పాత్ర కీలకంగా ఉండనుంది.భూమి రిజిస్ట్రేషన్, మ్యూటేషన్కు ముందు తప్పనిసరిగా భూమి సర్వే జరిపిస్తారు. మ్యాప్ తయారు చేస్తారు.
ఈ సర్వే మ్యాప్ లో సదరు భూమి యొక్క హద్దులను వివరంగా పొందుపరుస్తారు. విక్రయించే భూమి లేదా హక్కుల మార్పిడి భూమి యొక్క విస్తీరణంతో పాటు ప్రతి అంశాన్ని ఇందులో వివరిస్తారు. మ్యాప్ ను జత చేసిన తర్వాతే… రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తవుతుంది.
2 ఎకరాల విస్తీర్ణానికి సర్వే, పటం అందజేయడానికి రూ.వెయ్యి ఫీజు వసూలు చేయాలని ప్రభుత్వం తాజాగా నిర్ణయించింది. 2 నుంచి 5 ఎకరాలు అయితే రూ. 2 వేలు, 5 - 10 ఎకరాలు అయితే రూ. 5 వేలు చెల్లించాలి. ఇప్పటికే లైసెన్స్ పత్రాలు అందజేసిన ప్రభుత్వం... త్వరలో నోటిఫికేషన్ తేదీని ప్రకటించనుంది. అప్పటి నుంచి భూభారతి చట్టం ప్రకారం సాగు భూముల రిజిస్ట్రేషన్లు, మ్యుటేషన్ల ప్రక్రియలో సర్వే మ్యాప్ జతచేయటం అమల్లోకి రానుంది.
E-Paper

