రేషన్కార్డుదారులకు శుభవార్త - ఇక మీకోసం ప్రత్యేక బ్యాగులు..! ఈ కొత్త అప్డేట్ తెలుసుకోండి
రేషన్ కార్డుదారులకు తెలంగాణ సర్కార్ మరో శుభవార్త చెప్పేందుకు సిద్ధమైంది. సరుకులను తీసుకెళ్లేందుకు పర్యావరణహిత బ్యాగులు పంపిణీ చేయనుంది. వచ్చే నెల నుంచే వీటిని లబ్ధిదారులకు అందజేసే అవకాశం ఉంది. ముఖ్య వివరాలు ఇక్కడ తెలుసుకోండి….
నిజానికి కొత్త రేషన్ కార్డులు స్మార్ట్ కార్డుల రూపంలోనే ఇవ్వాలని సర్కార్ నిర్ణయించింది.
కొత్త కార్డులతో పాటు, ఇప్పటికే ఉన్న కార్డుల స్థానంలో క్యూఆర్ కోడ్తో ఉన్న స్మార్ట్ రేషన్కార్డులను అందించే దిశగా పౌరసరఫరాల శాఖ కసరత్తు చేస్తోంది. అయితే ఈ ప్రక్రియ ఆలస్యం కావటంతో… ప్రస్తుతం పత్రాల రూపంలోనే అందజేస్తోంది.
త్వరలోనే అందించబోయే స్మార్ట్ రేషన్ కార్డులు గతంలో కంటే భిన్నంగా ఉండనున్నాయి. కొత్త కార్డులపై కుటుంబ పెద్ద పేరు మినహా ఎవరి ఫొటోలు ఉండే అవకాశం లేదు. ఏటీఎమ్ కార్డు సైజులో ఉంటుందని తెలుస్తోంది.
తెలంగాణలో కొత్త రేషన్ కార్డులను పంపిణీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ప్రభుత్వం మరో శుభవార్త చెప్పేందుకు సిద్ధమైంది. వచ్చే నెలలో రేషన్ పంపిణీలో భాగంగా సన్నబియ్యంతో పాటు పర్యావరణహిత బ్యాగులను కూడా పంపిణీ చేయనుంది. ఆ దిశగా కార్యాచరణను సిద్ధం చేసింది.
రేషన్ కార్డుల్లో ఇచ్చే సరుకులను తీసుకెళ్లేందుకు వీలుగా ఈ బ్యాగులను పంపిణీ చేయనున్నారు. ఈ ప్రత్యేక బ్యాగులు ఇప్పటికే జిల్లాల్లోని మెయిన్ లీగల్ సప్లయ్ గోదాములకు చేరుకున్నాయి.
గోదాముల నుంచి రేషన్ డీలర్ల కార్డుల సంఖ్య ఆధారంగా ఈ బ్యాగులను సరఫరా చేస్తారు. ఆ తర్వాత రేషన్ కార్డుదారులకు అందజేస్తారు. వీటి పంపిణీపై పౌరసరఫరాలశాఖ అధికారికంగా ప్రకటన చేయనుంది.
ఆరు గ్యారెంటీల చిహ్నంతో పాటు 'అందరికీ సన్న బియ్యం ప్రజా ప్రభుత్వంతోనే సాధ్యం' అనే నినాదం ముద్రించి ఉంటుంది. వచ్చే నెల నుంచి వీటిని రేషన్ లబ్ధిదారులకు అందజేసే దిశగా సర్కార్ అడుగులు వేస్తున్నట్లు సమాచారం.
ఈ పర్యావరణహిత బ్యాగులపై అభయహస్తం చిహ్నంతో పాటు సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, పౌరసరఫరాలశాఖ మంత్రి ఉత్తమ్ ఫొటోలు ఉండనున్నాయి. అంతేకాకుండా అభయహస్తం చిహ్నంతో మాజీ ప్రధాని ఇందిరాగాంధీ ఫొటో కూడా ఉంటుంది.
మరోవైపు కొత్త రేషన్ కార్డుల స్టేటస్ ను తెలుసుకునేందుకు పౌరసరఫరాల శాఖ వెబ్ సైట్ (https://epds.telangana.gov.in/FoodSecurityAct/) ను సంప్రదింవచ్చు. ఏమైనా మార్పులు చేర్పులు కూడా మీసేవా కేంద్రాల ఆధారంగా సవరించుకోవచ్చు.
ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం కొత్త రేషన్ కార్డులను పంపిణీ చేసింది. జూలై 25 నుంచి ఆగస్ట్ 10 వరకు వీటిని అందజేసింది. అంతేకాకుండా దరఖాస్తు చేసుకున్న వారి వివరాలను పరిశీలించి… కొత్త కార్డులను కూడా మంజూరు చేస్తున్నారు.
E-Paper

