TG Indiramma Housing Scheme : ఇందిరమ్మ ఇంటి లబ్ధిదారులకు శుభవార్త - రూ.230 కే సిమెంట్ బస్తా!
Telangana Indiramma Housing Scheme Updates : తెలంగాణలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి సిమెంట్ బస్తాను రూ.230కే అందించేందుకు తయారీదారులు సమ్మతించారు. సచివాలయంలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి జరిపిన చర్చల అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నారు.
తెలంగాణలో పేదల సొంతింటి కలను నెరవేర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల పథకానికి పారిశ్రామిక రంగా నుంచి సాయం లభించింది. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ ఖర్చును తగ్గించే క్రమంలో సిమెంట్ పరిశ్రమల యాజమాన్యాలతో రాష్ట్ర రెవెన్యూ, గృహనిర్మాణ, సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి జరిపిన చర్చలు ఫలించాయి.
మంత్రి విజ్ఞప్తికి సానుకూలంగా స్పందించిన సిమెంట్ సంస్థలు, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల కోసం ఒక్కో సిమెంట్ బస్తాను కేవలం రూ.230 కే సరఫరా చేసేందుకు అంగీకరించాయి.
మంగళవారం సచివాలయంలోని తన కార్యాలయంలో సిమెంట్ పరిశ్రమల ప్రతినిధులు, యాజమాన్యాలతో మంత్రి పొంగులేటి ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, "ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రజా ప్రభుత్వం చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల పథకం కేవలం ఒక గృహ నిర్మాణ కార్యక్రమం మాత్రమే కాదు. ఇది పేద కుటుంబాలకు గౌరవప్రదమైన జీవితం, సామాజిక భద్రత మరియు ఆత్మగౌరవాన్ని కల్పించే ఒక బృహత్తర యజ్ఞం," అని స్పష్టం చేశారు. ఈ పవిత్రమైన యజ్ఞంలో సిమెంట్ పరిశ్రమలు కూడా భాగస్వాములు కావాలని ఆయన పిలుపునిచ్చారు.
రాష్ట్రవ్యాప్తంగా (హైదరాబాద్ మినహా) మొదటి విడత కింద 4.50 లక్షల ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేశామని మంత్రి వెల్లడించారు. ఈ ఇళ్ల నిర్మాణ ప్రక్రియ వేగంగా సాగుతోందని, వీటిలో ఇప్పటికే 85 శాతం ఇళ్లకు సంబంధించి శ్లాబ్ పనులు పూర్తయ్యాయని తెలిపారు. మిగిలిన 15 శాతం ఇళ్లు వివిధ నిర్మాణ దశల్లో ఉన్నాయని వివరించారు.
దీనికి తోడు…. రెండో విడత కింద ప్రతి నియోజకవర్గానికి 2,000 ఇళ్ల చొప్పున రాష్ట్రవ్యాప్తంగా మరో 2.50 లక్షల ఇళ్లను మంజూరు చేసినట్లు మంత్రి తెలిపారు. అలాగే 'క్యూఆర్' పరిధిలో లక్ష ఇళ్ల నిర్మాణాన్ని లక్ష్యంగా పెట్టుకుని, ప్రయోగాత్మకంగా 16 నియోజకవర్గాల్లో ఇందిరమ్మ టవర్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టామని వివరించారు.
దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా 100 శాతం సబ్సిడీతో, రూ.5 లక్షల మేర ఆర్థిక సహాయం అందిస్తూ ఇళ్ల నిర్మాణాన్ని చేపట్టడం లేదని, ఈ విషయంలో తెలంగాణ ప్రభుత్వం దేశానికే ఆదర్శంగా నిలుస్తోందని మంత్రి పొంగులేటి పేర్కొన్నారు. "ప్రభుత్వంపై ఎంతటి ఆర్థిక భారం పడుతున్నప్పటికీ, పేదల ఇళ్ల నిర్మాణంలో ఎలాంటి రాజీ పడటం లేదు. ప్రతి లబ్ధిదారుడికి నిర్మాణ పురోగతిని బట్టి ప్రతి సోమవారం పారదర్శకంగా విడతల వారీగా నిధులను నేరుగా విడుదల చేస్తున్నాం," అని చెప్పారు.
E-Paper

