Tirumala Srivari Darshan Rush : తిరుమలలో భక్తజన సంద్రం - ఒకే రోజు రికార్డు స్థాయిలో దర్శనం..!
Tirumala Srivari Darshan Rush : వేసవి సెలవుల రద్దీ వేళ తిరుమలలో భక్తుల రద్దీ భారీగా పెరిగింది. మే 2వ తేదీన రికార్డు స్థాయిలో 91,005 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. సామాన్య భక్తులకు ఇబ్బంది కలగకుండా టీటీడీ అన్నప్రసాదం, పాలు, మజ్జిగ పంపిణీలో పకడ్బందీ ఏర్పాట్లు చేసింది.
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి కొలువై ఉన్న తిరుమల క్షేత్రం భక్తజన సంద్రమైంది. వేసవి సెలవులకు తోడు వారాంతం (వీకెండ్) కలిసి రావడంతో దేశం నలుమూలల నుండి భక్తులు భారీగా తిరుమలకు తరలివచ్చారు. దీంతో తిరుమల గిరులు గోవింద నామస్మరణతో మారుమోగుతున్నాయి.
శనివారం(మే 2) ఒక్కరోజే రికార్డు స్థాయిలో 91,005 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. వేసవి సెలవుల కారణంగా సామాన్య భక్తుల రద్దీ ఊహించిన దానికంటే ఎక్కువగా ఉంది. స్వామివారికి మొక్కులు చెల్లించుకునే క్రమంలో 36,257 మంది భక్తులు కల్యాణకట్టలో తలనీలాలు సమర్పించారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని టీటీడీ అధికారులు దర్శన సమయాలను, క్యూలైన్లను నిరంతరం పర్యవేక్షిస్తున్నారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాల మేరకు… తిరుమలలో సామాన్య భక్తులకు మొదటి ప్రాధాన్యత ఇస్తున్నారు. వీఐపీ సంస్కృతిని తగ్గించి, గంటల తరబడి క్యూలైన్లలో వేచి ఉండే సామాన్య భక్తులకు మెరుగైన సేవలు అందించే దిశగా టీటీడీ యంత్రాంగం పని చేస్తోందని టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు ఓ ప్రకటన ద్వారా తెలిపారు.
ఎండల తీవ్రత దృష్ట్యా క్యూలైన్లలో ఉన్న భక్తులకు టీటీడీ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. శ్రీవారి సేవకుల సహకారంతో భక్తులకు నిరంతరాయంగా అన్నప్రసాదాలు, పాలు, చల్లని మజ్జిగ మరియు తాగునీటిని అందజేస్తున్నారు. వేడి నుంచి ఉపశమనం పొందేలా క్యూలైన్లలో ఫ్యాన్లు, కూలర్లను ఏర్పాటు చేయడంతో పాటు, భక్తులకు అవసరమైన సమాచారాన్ని అనౌన్స్మెంట్ సిస్టమ్ ద్వారా ఎప్పటికప్పుడు తెలియజేస్తున్నారు.
శ్రీవారి లడ్డూ ప్రసాదం విషయంలోనూ భక్తులకు ఎలాంటి లోటు రాకుండా టీటీడీ జాగ్రత్తలు తీసుకుంది. బఫర్ స్టాక్ను అందుబాటులో ఉంచి, దర్శనం ముగించుకుని వచ్చే ప్రతి భక్తుడికి లడ్డూలు అందేలా కౌంటర్ల వద్ద సిబ్బందిని అప్రమత్తం చేసింది. (File/PTI)
రద్దీ ఎంత ఉన్నా సేవల్లో నాణ్యత తగ్గకుండా టీటీడీ సిబ్బంది, పోలీసులు మరియు శ్రీవారి సేవకులు సమన్వయంతో పనిచేస్తున్నారు.
E-Paper

