లారీల వెనుక ‘Horn OK Please’ అని ఎందుకు రాస్తారో తెలుసా? పెద్ద చరిత్రే ఉందిగా..!
మన దేశంలో రహదారులపై ప్రయాణించేటప్పుడు రంగురంగుల అక్షరాలతో, విభిన్న డిజైన్లతో లారీల వెనుక భాగంలో 'Horn OK Please' అని రాసి ఉండటం మనం చూస్తూనే ఉంటాం. అయితే ఇది అలంకరణ కోసం రాసుకునే పదం అనుకుంటే పొరపాటే! ఈ చిన్న వాక్యం వెనుక ఆసక్తికరమైన, చారిత్రక కారణం ఉంది.
రెండో ప్రపంచ యుద్ధ సమయంలో ఈ ‘హార్న్ ఓకే ప్లీజ్’ సంప్రదాయం మొదలైంది. ఆ కాలంలో బ్రిటిష్ ప్రభుత్వం భారతదేశంలో ఉన్న డీజిల్ నిల్వలనంతటినీ తమ సైనిక అవసరాల కోసం యూరప్కు తరలించేది. దీనివల్ల మన దేశంలో తీవ్రమైన డీజిల్ కొరత ఏర్పడింది. ఆ సమయంలో లారీలను, సరుకు రవాణా వాహనాలను నడపడానికి డీజిల్కు ప్రత్యామ్నాయంగా 'కిరోసిన్'ను ఇంధనంగా వాడటం ప్రారంభించారు.
అయితే డీజిల్తో పోలిస్తే కిరోసిన్ అత్యంత ప్రమాదకరమైనది, త్వరగా మంటలు వ్యాపించే స్వభావం కలది. చిన్న ప్రమాదం లేదా వేరే వాహనం వచ్చి స్వల్పంగా ఢీకొట్టినా లారీ బాంబులా పేలిపోయే ప్రమాదం ఉండేది.
ఈ ప్రమాదాన్ని నివారించడానికి, వెనుక నుంచి వచ్చే వాహనదారులను హెచ్చరించేందుకు బ్రిటిష్ ప్రభుత్వం ఒక ఉపాయం ఆలోచించింది. ప్రతి లారీ వెనుక భాగంలో "Horn Please, On Kerosene" (హార్న్ కొట్టండి.. ఈ లారీ కిరోసిన్తో నడుస్తోంది) అని స్పష్టంగా రాసేవారు. "వెనుక వచ్చే వాహనం హార్న్ కొట్టి సురక్షితంగా ఓవర్టేక్ చేయాలి, లేదంటే ప్రమాదం జరిగితే కిరోసిన్ వల్ల పెద్ద పేలుడు సంభవిస్తుంది," అని హెచ్చరించడమే దీని ముఖ్య ఉద్దేశం.
కాలక్రమేణా 'On Kerosene' అనే పూర్తి వాక్యాన్ని రాయడం తగ్గిపోయి, కేవలం దాని మొదటి అక్షరాలైన 'O.K.' మాత్రమే మిగిలిపోయింది. ఆ తర్వాత డ్రైవర్లు ‘Horn’, 'Please' మధ్యలో ఈ 'OK'ను చేర్చడంతో అది కాస్తా 'Horn OK Please'గా మారిపోయింది.
ఇదిలా ఉండగా, ఈ బోర్డుల వల్ల రహదారులపై అనవసర శబ్ద కాలుష్యం పెరుగుతోందని మహారాష్ట్ర ప్రభుత్వం భావించింది. లారీ వెనుక ఉన్న బోర్డును చూసి వెనుక వచ్చే వాహనదారులు పదే పదే అనవసరంగా హార్న్ కొడుతున్నారని గుర్తించి, 2015లో మహారాష్ట్ర రవాణా శాఖ తమ రాష్ట్రంలో 'Horn OK Please' బోర్డులను పూర్తిగా నిషేధించింది.
E-Paper

