Sai Pallavi : దట్ ఈజ్ సాయి పల్లవి! ఆ రూ. 2కోట్ల డీల్ని ఎందుకు వదులుకుందో తెలుసా?
గురువారం ఉదయం విడుదలైన రామాయణం ట్రైలర్.. సోషల్ మీడియాను ఊపేస్తోంది. మరీ ముఖ్యంగా సీత పాత్రలో నటించిన సాయి పల్లవిపై ప్రశంసల వర్షం కురుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఆమెకు సంబంధించిన ఒక పాత స్టోరీ ఇప్పుడు మళ్లీ ట్రెండింగ్లోకి వచ్చింది. రూ. 2కోట్ల డీల్ని తాను ఎందుకు వదులుకున్నానో అందులో ఆమె వివరించారు.
నితీష్ తివారీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక చిత్రం 'రామాయణ: పార్ట్ 1'లో సీతగా నటిస్తున్న సాయిపల్లవి, తన సహజ సిద్ధమైన అందంతో పాటు విలువలకు కట్టుబడే నైజంతో కోట్లాది మంది అభిమానుల హృదయాలను గెలుచుకున్నారు. అయితే, 2019లో ఒక ప్రముఖ ఫెయిర్నెస్ క్రీమ్ ప్రకటన కోసం వచ్చిన ఏకంగా రూ.2 కోట్ల భారీ ఆఫర్ను ఆమె తిరస్కరించి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఈ నిర్ణయం వెనుక ఉన్న అసలు కారణాలను ఆమె గతంలో పంచుకున్న విషయాలు ఇప్పుడు మరోసారి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
తన ముఖానికి మేకప్ పెద్దగా పడదని, అందుకే మేకప్కు దూరంగా ఉంటానని సాయిపల్లవి చెబుతుంటారు. సినిమాల్లో కూడా తన ముఖంపై ఉన్న మొటిమలను దాచకుండా సహజంగానే కనిపించడానికి ఆమె ఎప్పుడూ వెనుకాడలేదు. "నేను ఎలాంటి బ్యూటీ క్రీమ్ ప్రకటనల్లో నటించను. మీ రూపురేఖలు, చర్మ రంగు ఏదైనా సరే.. మీపై మీకు నమ్మకం ఉండటమే అసలైన అందం," అని ఆమె స్పష్టం చేశారు. అయితే, ఆ భారీ ఆఫర్ను తిరస్కరించడానికి కేవలం ఇది మాత్రమే కారణం కాదు.. తన సొంత చెల్లెలు పడిన బాధ కూడా ప్రధాన కారణమని ఆమె వెల్లడించారు.
సమాజం సృష్టించిన అందాల కొలమానాల వల్ల చర్మ రంగు తక్కువగా ఉన్నవారు ఎంతటి చిన్నతనానికి గురవుతారో తను దగ్గరగా చూశానని సాయిపల్లవి తెలిపారు. "మా ఇంట్లోనే నా చెల్లి ఈ సమస్యను ఎదుర్కొంది. నేను తనకంటే కాస్త తెల్లగా ఉంటాను. దాంతో తను తెల్లగా మారాలనే ఆశతో ఇష్టం లేకపోయినా కాయగూరలు, పండ్లు తినేది. 'ఇవి తింటే తెల్లగా అవుతావు' అని మా అమ్మ కూడా తనను బలవంతం చేసేది" అని సాయిపల్లవి గుర్తుచేసుకున్నారు. తెల్లగా మారడం కోసం చెల్లి ఇష్టం లేని పదార్థాలు తింటూ పడ్డ వేదన తనను తీవ్రంగా కలిచివేసిందని ఆమె చెప్పారు. "కనీసం నా చెల్లి కోసమైనా నేను ఈ వివక్షకు వ్యతిరేకంగా నిలబడాలని అనుకున్నాను. లేకపోతే అంత డబ్బు సంపాదించి నేను ఏం చేసుకోవాలి?" అని ఆమె ప్రశ్నించారు.
తెల్లగా ఉండటమే అందానికి కొలమానమనే భావజాలాన్ని ప్రచారం చేసే బ్రాండ్లలో నటించడం తన వ్యక్తిత్వానికి వ్యతిరేకమని సాయిపల్లవి స్పష్టం చేశారు. "నేను ఎప్పుడూ సాధారణ జీవితాన్ని గడపడానికే ఇష్టపడతాను. డబ్బు నన్ను ఎప్పుడూ ఆకర్షించలేదు" అని ఆమె పేర్కొన్నారు. 2015లో మలయాళంలో వచ్చిన 'ప్రేమమ్' సినిమాతో సినీ రంగ ప్రవేశం చేయడానికి ముందు, తన ముఖంపై ఉన్న మొటిమల వల్ల తను పడిన మానసిక వేదనను ఆమె పంచుకున్నారు. "సినిమాల్లోకి రాకముందు నా మొటిమలు పోవడానికి వందలాది క్రీములు వాడాను. నన్ను నేను చాలా బాధపెట్టుకున్నాను. జనాలు నా కళ్లలోకి చూడకుండా కేవలం నా ముఖంపై ఉన్న మొటిమల వైపే చూస్తూ మాట్లాడుకుంటున్నారని భావించి బయటకు రావడానికే భయపడేదాన్ని," అని చెప్పారు.
అయితే 'ప్రేమమ్' సినిమా విడుదలయ్యాక ప్రేక్షకులు తన్ను ఉన్నది ఉన్నట్లుగానే ఆదరించారని, ముఖంపై మొటిమలు ఉన్నప్పటికీ అభిమానించారని సాయిపల్లవి ఆనందం వ్యక్తం చేశారు. "నాలాంటి సాధారణ అమ్మాయిని జనాలు ఆదరించడం చూసి, ముఖ్యంగా చిన్న పిల్లలు, టీనేజర్లు ఎంతగానో స్ఫూర్తి పొందారు. 'మొటిమలు ఉన్నా ఆమెను అందరూ ఇష్టపడుతున్నారు' అనే భావన వారిలో ఆత్మవిశ్వాసాన్ని నింపింది. అది నాలో మరింత ధైర్యాన్ని పెంచింది," అని ఆమె వివరించారు.
తనని తనుగా ఆమోదించిన అభిమానులను మోసం చేయడం తన వల్ల కాదని సాయిపల్లవి అన్నారు. ఫెయిర్నెస్ క్రీమ్ ప్రకటనల్లో నటించి, ప్రజల్లో చర్మ రంగుపై అపరాధ భావాన్ని లేదా ఆత్మన్యూనతా భావాన్ని పెంచడం తనకు ఇష్టం లేకే ఆ రూ.2 కోట్ల ఆఫర్ను వదులుకున్నానని ఈ 'రామాయణం' నటి స్పష్టం చేశారు.
(PTI)
E-Paper

