వికారాబాద్ : కంటపడిన అరుదైన ‘రాక్ ఈగల్ గుడ్లగూబ’ - నెల రోజుల పాటు క్వారీ పనులు నిలిపివేత, ఎందుకో తెలుసా...!
తెలంగాణలోని వికారాబాద్ జిల్లాలో ఆసక్తికరమైన సంఘటన చోటు చేసుకుంది. క్వారీ తవ్వకాలు జరిగే ఓ ప్రాంతంలో అరుదైన గుడ్లగూబ(రాక్ ఈగల్) కంటపడింది. అంతేకాదు గుడ్ల పొద కూడా కనిపించింది. క్వారీ పనులు జరిగితే ఇబ్బందులు వచ్చే అవకాశం ఉండటంతో… 35 రోజుల పాటు పనులను నిలిపివేశారు. పూర్తి వివరాలను ఇక్కడ తెలుసుకోండి..
తెలంగాణలోని వికారాబాద్ జిల్లాలోని ఓ రాతి క్వారీ వద్ద అరుదైన రాక్ ఈగల్ గుడ్లగూబ గుడ్లు పొద కంటపడింది. ఈ విషయాన్ని వన్య ప్రాణి ఫొటోగ్రాఫర్లు గమనించారు. వెంటనే అటవీశాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు.
( image from @sudhakarudumula 'X' Account)
సరిగ్గా ఆరు రోజుల క్రితం వికారాబాద్ లోని ఎంకథల పరిసరాల్లో గడ్డి భూములంటాయి. వీటిని సందర్శించిన వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్ మనోజ్ కుమార్ విట్టపు… ఈ గుడ్లగూబతో పాటు గుడ్ల పొదను గమనించారు. ఈ విషయాన్ని తెలంగాణ ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ (పిసిసిఎఫ్) సువర్ణకు సమాచారం ఇచ్చారు. రాక్ ఈగిల్ గుడ్లగూబతో పాటు ఐదు గుడ్లు ఉన్నాయని తెలియజేశారని వికారాబాద్ జిల్లా అటవీ అధికారి జ్ఞానేశ్వర్ గురువారం పిటిఐకి తెలిపారు.
( image from @sudhakarudumula 'X' Account)
అరుదైన రాక్ ఈగల్ గుడ్ల పొదకు ఇబ్బంది రాకుండా చర్యలు తీసుకోవాలని పీసీసీఎఫ్… వికారాబాద్ జిల్లా అటవీ అధికారులను అప్రమత్తం చేసింది. సంఘటనా స్థలానికి చేరుకున్న అటవీశాఖ సిబ్బంది… అరుదైన పక్షి జాతులు, గుడ్లు ఉన్నాయని గుర్తించింది. క్వారీ యాజమాని అయిన లక్ష్మారెడ్డికి కూడా సమాచారం ఇచ్చారు. వాటిని రక్షించటంతో గుడ్లు పొదిగేందుకు ఇబ్బందులు రాకుండా ఉండేందుకు క్వారీ పనులను కూడా నిలిపివేసేందుకు అంగీకరించాడు. అప్పటి నుంచి అటవీశాఖ సిబ్బంది ఈ పక్షిని నిశితంగా గమనిస్తోందని జ్ఞానేశ్వర్ తెలిపారు.
( image from @sudhakarudumula 'X' Account)
కీటకాలు, ఎలుకలు మరియు ఇతరులను వేటాడే రాక్ ఈగిల్ గుడ్లగూబ ప్రధానంగా ఆగ్నేయాసియాలో కనిపిస్తుంది. ఇతర గుడ్లగూబలతో పోలిస్తే, ఇది రాతి ప్రాంతాల్లో నివసిస్తుందని వికారాబాద్ జిల్లా అటవీ అధికారి జ్ఞానేశ్వర్ తెలిపారు. పొదిగే పిల్లలు ఎగిరే వరకు పక్షిని ఇబ్బంది పెట్టకూడదని క్వారీ యూనిట్ యజమాని అంగీకరించాడని తెలిపారు.
“ఇది అంతరించిపోతున్న స్థితిలో లేనప్పటికీ ఇది అరుదైన జాతి. దీనిని చూడటం చాలా అరుదు' అని వివరించారు. 'ఈ గడ్డి మైదానంలో పక్షి ఎప్పుడు గుడ్లు పెట్టిందో తెలియకపోయినా… మరో 15 రోజుల్లో పొదిగే అవకాశం ఉందని భావిస్తున్నాం. 20-25 రోజులు రక్షణ చర్యలు తీసుకుంటే పొదిగిన పిల్లలు ఎగిరిపోతాయి” అని వివరించారు.
( image from @sudhakarudumula 'X' Account)
E-Paper

