హైదరాబాద్‌ డీఆర్‌డీఓ-డీఎంఆర్‌ఎల్‌లో ఖాళీలు.. జులై 15లోపు ఈమెయిల్ చేయండి

హైదరాబాద్‌లోని డిఫెన్స్ మెటలర్జికల్ రిసెర్చ్ లాబొరేటరీ(డీఎంఆర్ఎల్), డిఫెన్స్ రిసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్(డీఆర్డీఓ)లో ఇంటర్న్‌షిప్ ఖాళీలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. అర్హత ఉన్న అభ్యర్థులు 2026 జులై 15వ తేదీలోపు అప్లై చేసుకోవాలి.

Published on: Jul 4, 2026, 10:54:35 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

హైదరాబాద్‌లోని డిఫెన్స్ మెటలర్జికల్ రిసెర్చ్ లాబొరేటరీ(DMRL) తాజాగా ఒక కీలక ప్రకటన విడుదల చేసింది. రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ(DRDO) పరిధిలో పనిచేసే ఈ ప్రతిష్టాత్మక సంస్థ.. చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్థుల కోసం సరికొత్త పెయిడ్ ఇంటర్న్‌షిప్ అవకాశాలను కల్పిస్తోంది. పరిశోధన రంగంపై ఆసక్తి ఉండి, రక్షణ రంగ సంస్థల్లో అనుభవం సంపాదించాలనుకునే యువతకు ఇది ఒక సువర్ణావకాశం.

డీఆర్‌డీఓ అప్రెంటీస్ ఖాళీలు
డీఆర్‌డీఓ అప్రెంటీస్ ఖాళీలు

ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 20 ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఎంపికైన అభ్యర్థులకు ఆరు నెలల పాటు శిక్షణతో కూడిన ఇంటర్న్‌షిప్ అందిస్తారు.

మెటలర్జికల్ లేదా మెటీరియల్ సైన్స్ ఇంజినీరింగ్, మెకానికల్ ఇంజినీరింగ్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్(డేటా సైన్స్‌తో కలిపి) వంటి విభాగాలకు చెందిన విద్యార్థులు ఈ పోస్టులకు అర్హులు. గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం లేదా ఇన్‌స్టిట్యూట్ నుంచి బీఈ (BE), బీటెక్ (B.Tech), ఎంఈ (ME), ఎంటెక్ (M.Tech), లేదా ఎమ్మెస్సీ (M.Sc) కోర్సుల్లో చివరి సంవత్సరం చదువుతున్న అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవడానికి అర్హత కలిగి ఉంటారు.

ఈ ఇంటర్న్‌షిప్‌నకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల గరిష్ఠ వయస్సు 2026 జులై 31 నాటికి 28 ఏళ్లు మించకూడదు. నిబంధనల ప్రకారం అర్హులైన వారికి వయోపరిమితిలో సడలింపులు ఉంటాయి. ఇంటర్న్‌షిప్‌కు ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.5,000 చొప్పున గరిష్ఠంగా ఆరు నెలల పాటు స్టైపెండ్ రూపంలో ఆర్థిక సహాయం అందుతుంది.

శిక్షణ కాలపరిమితి 6 నెలలు ఉంటుంది. ఈ ఇంటర్న్‌షిప్ ప్రోగ్రామ్‌కు పూర్తిగా ఆన్‌లైన్ (ఈ-మెయిల్) ద్వారానే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఆసక్తి, సరైన అర్హతలు ఉన్న అభ్యర్థులు తమ దరఖాస్తులను, విద్యార్హతల పత్రాలను స్కాన్ చేసి hrd.dmrl@gov.in అనే అధికారిక ఈ-మెయిల్ ఐడీకి పంపాలి. దరఖాస్తులు సమర్పించడానికి చివరి తేదీ 2026, జులై 15. గడువు ముగిసిన తర్వాత వచ్చే దరఖాస్తులను పరిశీలించరు. కాబట్టి అర్హులైన అభ్యర్థులు ముందే దరఖాస్తు చేసుకోవడం మంచిది.

పూర్తిగా నింపిన దరఖాస్తు ఫారమ్ స్కాన్ చేసిన కాపీని, పెయిడ్ ఇంటర్న్‌షిప్ (Paid Internship) కోసం కళాశాల నుండి తీసుకున్న రిఫరెన్స్/అభ్యర్థన లేఖను (జతచేసిన నమూనా ప్రకారం) డైరెక్టర్, DMRLకి కేవలం ఈమెయిల్ ద్వారా మాత్రమే పంపాలి. ఇంటర్న్‌షిప్ దరఖాస్తుగా ఎటువంటి హార్డ్ కాపీ (కాగితం రూపంలో ఉన్న ప్రతి) స్వీకరించరు.

దరఖాస్తును పంపాల్సిన ఈమెయిల్ చిరునామా hrd.dmrl@gov.in. ఈమెయిల్ సబ్జెక్ట్ (విషయం) ఇలా ఉండాలి ‘Application for paid internship 2026, DMRL Hyderabad (BRANCH CODE: ___ )’. దరఖాస్తును www.drdo.gov.in/drdo/careers నుండి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఈ ఇంటర్న్‌షిప్ ప్రోగ్రామ్‌కు దరఖాస్తు చేయడానికి ఎటువంటి రుసుము లేదు. సెలక్ట్ అయిన అభ్యర్థులకు 31 జులై వరకు మెయిల్ చేస్తారు. ఆగస్టు 5 నుంచి ఇంటర్న్‌షిప్ మెుదలవుతుంది.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More