నాంపల్లి పరిధిలోని చీరక్ గాలి లైన్లో ఉన్న ఓ ఫర్నీచర్ షాపులో భారీ అగ్నిప్రమాదం జరిగింది. నాలుగు అంతస్తుల భవనంలోని గ్రౌండ్ ఫ్లోర్లో మంటలు మొదలై పైకి వ్యాపించాయి. భవనంలో ఆరుగురు చిక్కుకున్నట్లు సమాచారం. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.
హైదరాబాద్ నాంపల్లిలోని ఓ ఫర్నిచర్ దుకాణంలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాదవశాత్తూ చోటు చేసుకున్న మంటలు… ఒక్కసారిగా వ్యాపించాయి. నాలుగు అంతస్తుల భవనంలోని గ్రౌండ్ ఫ్లోర్లో అగ్నిప్రమాదం జరిగింది.
నాంపల్లి లో భారీ అగ్నిప్రమాదం
భవనంలో లోపల ఆరుగురు చిక్కుకున్నట్లు గుర్తించారు. వాచ్మెన్ కుటుంబంలో ఇద్దరు పిల్లలు, మరో కుటుంబంలోని నలుగురు పెద్దవారు చిక్కుకున్నట్లు తెలిసింది. చిక్కుకున్న ఇద్దరు చిన్నారులను అఖిల్ (7), ప్రణీత్ (11)గా గుర్తించారు. వీరి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.
మరోవైపు భవనం పరిసర ప్రాంతవాసులను అధికారులు ఖాళీ చేయిస్తున్నారు. పెద్ద ఎత్తున మంటలు ఎగసిపడుతుండడంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.
సమాచారం అందుకున్న అగ్నిమాపక శాఖ సిబ్బంది… 8 ఫైరింజన్ల సాయంతో మంటలను ఆర్పేందుకు ప్రయత్నిస్తోంది. మరోవైపు రోబో ఫైర్ మిషన్ ద్వారా రెస్క్యూ కొనసాగుతోంది. సెల్లార్ నిండా ఫర్నీచర్ ఉండటంతో సహాయక చర్యలకు ఇబ్బంది నెలకొంది. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
పోలీసుల నుంచి అలర్ట్…
మరోవైపు ఫర్నిచర్ షాపులో జరిగిన అగ్నిప్రమాదం నేపథ్యంలో హైదరాబాద్ సీపీ సజ్జనార్ ప్రకటన విడుదల చేశారు. ఆ ప్రాంతంలో ట్రాఫిక్ స్తంభించిందని పేర్కొంది. ట్రాఫిక్ రద్దీని దృష్టిలో ఉంచుకుని… సందర్శకులు తమ ఎగ్జిబిషన్ పర్యటనను ఈ రోజు వాయిదా వేసుకోవాలని విజ్ఞప్తి చేశారు.