దయచేసి బయటకు రండి.. జూబ్లీహిల్స్లో రిగ్గింగ్ జరుగుతోంది : మాగంటి సునీత
జూబ్లీహిల్స్లో రిగ్గింగ్ జరుగుతోందని బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత సంచలన ఆరోపణలు చేశారు. ఓటర్లను భయపెడుతున్నారని చెప్పారు.
జూబ్లీహిల్స్లో రిగ్గింగ్ జరుగుతోందని, ఓటర్లను భయపెడుతున్నారని మాగంటి సునీత అన్నారు. జూబ్లీహిల్స్లో పలుచోట్ల రౌడీషీటర్లు తిరుగుతున్నారని ఆరోపించారు. ఓటర్లను ప్రలోభాలకు గురిచేస్తున్నారని వ్యాఖ్యానించారు. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్యకు జూబ్లీహిల్స్లో ఏం పని అని అడిగారు.

మరోవైపు ఎన్నికల కమిషనర్ను మాగంటి సునీత రిక్వెస్ట్ చేశారు. ఎన్నికల కమిషనర్ దయచేసి బయట రండి అని, పరిస్థితి సమీక్షించాలని చెప్పారు. ఒక మహిళను ఇలా చేస్తుంటే కూడా చూస్తూ ఊరుకున్నారన్నారు. ఏది కరెక్ట్గా ఉందో చెప్పి, చేయించాలన్నారు. పోలీసులు కూడా గొడవలు చేశారని ఆరోపించారు.
జూబ్లీహిల్స్ ఉపఎన్నిక పోలింగ్ను హైదరాబాద్ సీపీ సజ్జనార్ పరిశీలించారు. డ్రోన్ల ద్వారా పోలింగ్ స్టేషన్ల వద్ద పరిస్థితి వీక్షించారు. దేశంలోనే తొలిసారి డ్రోన్ టెక్నాలజీ ద్వారా పోలింగ్ పర్యవేక్షణ చేస్తున్నట్టుగా తెలిపారు. జూబ్లీహిల్స్లో పోలింగ్ ప్రశాంతంగా జరుగుతోందని, 150 డ్రోన్ కెమెరాలు ఉపయోగిస్తున్నామన్నారు.
పోలింగ్ కోసం పటిష్ట భద్రత ఏర్పాటు చేశామని సౌత్ ఈస్ట్ డీసీపీ చంద్రమోహన్ చెప్పారు. కేంద్ర బలగాలతో కూడా భద్రత ఏర్పాటు చేశామన్నారు. 5 సమస్యాత్మక ప్రాంతాలు గుర్తించి భద్రత పెంచినట్టుగా వెల్లడించారు. 'ఓటర్లు ఎవరైనా ఉన్నారా అని చెక్ చేస్తున్నాం. హోటల్ రూమ్స్, లాడ్జిల్లో తనిఖీ చేశాం. దొంగ ఓట్లు అనేది ఎక్కడా లేదు. ఎప్పటికప్పుడు అధికారులతో సమన్వయం చేసుకుంటున్నాం. గ్యాదరింగ్ జరిగింది అని, కొన్నిచోట్ల ఈవీఎంలు పని చేయడం లేదని, గొడవలు అవుతున్నాయని లలో తప్పుడు సమాచారం సర్క్యులేట్ చేస్తున్నారు. ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు లేవు. ప్రశాంతంగా ఎన్నికలు జరుగుతున్నాయి.' అని సౌత్ ఈస్ట్ డీసీపీ చంద్రమోహన్ తెలిపారు.
జూబ్లీహిల్స్లో ఒంటిగంట వరకు 31.94 శాతం పోలింగ్ నమోదు అయింది. మధ్యాహ్నం 3 గం. వరకు 40.20 శాతం పోలింగ్ నమోదైనట్టుగా ఈసీ ప్రకటించింది. సాయంత్రం 6 వరకు పోలింగ్ ఉంటుంది. ఈ నెల 14న జూబ్లీహిల్స్ ఉపఎన్నిక ఓట్ల లెక్కింపు జరగనుంది.
మరోవైపు ఎన్నికల కోడ్ ఉల్లంఘించిన స్థానికేతర ప్రజాప్రతినిధులపై ఈసీ కేసులు నమోదు చేసింది. కోడ్ ఉల్లంఘించిన వారిపై కేసులు పెట్టామని జిల్లా ఎన్నికల అధికారి తెలిపారు. నియమావళి ఉల్లంఘించిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను గుర్తించామన్నారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అనధికారికంగా పోలింగ్ బూత్ల వద్ద ఉన్నారని తెలిపారు.













