...
...
Next Story

TG Govt Employees : తెలంగాణ ఉద్యోగులకు గుడ్ న్యూస్ - పీఆర్సీపై సీఎం రేవంత్ కీలక ప్రకటన.. 100 రోజుల్లో రూ. 6 వేల కోట్లు!

Telangana Govt Employee : ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలపై సీఎం రేవంత్ రెడ్డి సానుకూల నిర్ణయం తీసుకున్నారు. పీఆర్సీ నివేదిక తక్షణమే సమర్పించాలని ఆదేశించడంతో పాటు…. రిటైర్మెంట్ బెనిఫిట్స్ కోసం రూ. 6 వేల కోట్లు విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. దీంతో మే 5న తలపెట్టిన నిరసనను ఉద్యోగ సంఘాలు విరమించుకున్నాయి.

Published on: May 3, 2026, 05:12:39 IST
Advertisement

Telangana Employee PRC : రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల వేతన సవరణ కమిషన్ (PRC) నివేదికపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. పీఆర్సీ నివేదికను తక్షణమే ప్రభుత్వానికి సమర్పించాలని అధికారుల కమిటీని ఆదేశించారు. ఈ నివేదిక అందిన వెంటనే ఉద్యోగుల వేతన సవరణపై ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకుంటుందని స్పష్టం చేశారు.

ఉద్యోగ సంఘాల నేతలతో సీఎం రేవంత్ రెడ్డి
ఉద్యోగ సంఘాల నేతలతో సీఎం రేవంత్ రెడ్డి

సచివాలయంలో తెలంగాణ ఉద్యోగ సంఘాల సంయుక్త కార్యాచరణ కమిటీ (JAC), ఎంప్లాయీస్ జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ నాయకులతో శనివారం నిర్వహించిన సుదీర్ఘ సమావేశంలో సీఎం పలు కీలక హామీలు ఇచ్చారు.

100 రోజుల్లో రూ. 6 వేల కోట్లు…

పే రివిజన్ కమిషన్ (PRC) నివేదికను తక్షణమే అందించాలని అధికారుల కమిటీని ఆదేశించామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెల్లడించారు. నివేదిక ఆధారంగా పీఆర్సీపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు. వచ్చే వంద రోజుల్లో ఉద్యోగుల రిటైర్మెంట్ బెనిఫిట్స్ కోసం రూ. 6 వేల కోట్లు చెల్లించనున్నట్టు తెలిపారు. నిధుల ఖర్చు ప్రాధాన్యతలను నిర్ణయించాల్సిన బాధ్యత ఉద్యోగ సంఘాలపై ఉందని అన్నారు.

ఈ సందర్భంగా నాలుగు కీలకమైన అంశాలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉద్యోగ సంఘాలకు స్పష్టతనిచ్చారు. ఉద్యోగుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పారు. వంద రోజుల్లో పదవీ విరమణ చేసిన ఉద్యోగుల బెనిఫిట్స్ కోసం రూ. 6 వేల కోట్లు చెల్లించడంతో పాటు పీఆర్సీపై నివేదిక అందగానే నిర్ణయం తీసుకుంటామని అన్నారు.

గుర్తింపు పొందిన ఉద్యోగ సంఘాలు ప్రతి రెండు నెలలకు ఒకసారి సమావేశమై సమస్యలపై ప్రభుత్వానికి నివేదిక అందించాలని సూచించారు. ఇది స్నేహపూర్వకమైన ప్రభుత్వమని, ఉద్యోగుల సమస్యలను పరిష్కరించే బాధ్యత ప్రభుత్వానిదని ముఖ్యమంత్రి చెప్పారు.

“ఉద్యోగుల సహకారంతోనే ప్రభుత్వ సంక్షేమ పథకాలను విజయవంతంగా అమలు చేయగలుగుతున్నాం. మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఉద్యోగుల కోసమే మొదటి నిర్ణయం తీసుకున్నాం. ఉద్యోగులకు ప్రతీ నెలా మొదటి తారీఖున వేతనాలు అందేలా చర్యలు తీసుకున్నాం” అని ముఖ్యమంత్ర రేవంత్ రెడ్డి తెలిపారు.

“ఉద్యోగ సంఘాలు స్వేచ్ఛగా ఎన్నికలు నిర్వహించుకునేలా అవకాశం కల్పించాం. ఉద్యోగుల బదిలీల విషయంలో గందరగోళం తలెత్తకుండా ప్రణాళిక ప్రకారం నిర్వహించాం. ఎంతో కాలంగా పెండింగ్‌లో ఉన్న టీచర్ల బదిలీలు ఎలాంటి వివాదం లేకుండా పూర్తిచేశాం. ఉద్యోగుల ఆరోగ్య భద్రత కార్డుల ప్రతిపాదనపై కూడా ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. ఈ రెండేళ్లలో ప్రజా ప్రభుత్వంలో 67,760 ఉద్యోగ నియామకాలు చేపట్టాం” అని ముఖ్యమంత్రి గుర్తుచేశారు.

పలు డిమాండ్లపై స్పష్టతనిచ్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఈ సందర్భంగా ఉద్యోగ సంఘాల నాయకులు ధన్యవాదాలు తెలిపారు. సీఎం నేతృత్వంలో చాలావరకు ఉద్యోగుల సమస్యలను ప్రజాప్రభుత్వం పరిష్కరించిందని గుర్తుచేసుకున్నారు. ఈ నెల 5 న తలపెట్టిన నిరసనతో పాటు అన్ని రకాల నిరసన కార్యక్రమాలను ఉపసంహరించుకున్నట్టు ఉద్యోగుల సంఘాల నేతలు ప్రకటించారు.

 

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe