తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రవాణా శాఖకు సంబంధించిన అన్ని చెక్ పోస్టులను తక్షణం మూసివేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు రవాణా కమిషనర్… డీటీఓలకు ఆదేశాలు విడుదల చేశారు.
బారికేడ్లు తొలగింపు…

రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా రవాణా అధికారులు (డీటీఓ) స్వయంగా చెక్ పోస్టుల వద్ద ప్రస్తుతం ఉన్న బోర్డులను, బారికేడ్లను తొలగించే కార్యక్రమాన్ని పర్యవేక్షించాలని ఆదేశాల్లో పేర్కొన్నారు. చెక్ పోస్టులు మూసి వేయబడినట్టుగా కొత్త బోర్డులను ఏర్పాటు చేయాలని ఆదేశాల్లో తెలిపారు. చెక్ పోస్టుల వద్ద విధుల్లో సిబ్బంది ఎవరూ లేకుండా తక్షణమే ఉపసంహరించాలని ఆదేశించారు.
ఆయా ప్రాంతాల్లో చెక్ పోస్టులను సూచిస్తూ ఉన్న బోర్డులు, బారికేడ్లను తక్షణం తొలగించాలని డీటీఓలకు సూచించారు. ఈ తొలగింపు ప్రక్రియను మొత్తం వీడియో తీసి దాన్ని భద్రపరచాలని చెప్పారు. చెక్ పోస్టుల వద్ద ఉన్న రికార్డులు, ఫర్నీచర్, ఇతర సామగ్రి, కంప్యూటర్లు, ఇతర వస్తువులను తక్షణం డీటీఓ కార్యాలయాలకు తరలించాలని, అలాగే పరిపాలనకు సంబంధించిన రికార్డులు, క్యాష్ బుక్స్, రిసిప్టులు, చాలాన్లను అన్నింటినీ డీటీవో కార్యాలయంలో భద్రపరచాలని ఆదేశించారు.
ఇంతకాలం చెక్ పోస్టులు నిర్వహించిన స్థలాల్లో వాహనాల రాకపోకలకు ఎలాంటి అడ్డంకులు లేకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలని స్పష్టంగా పేర్కొన్నారు. చెక్ పోస్టులను మూసివేసినట్టుగా, సిబ్బందిని రీడిప్లాయ్ చేసినట్టు, రికార్డులను భద్రపరిచిన విషయాలన్నింటిపైనా ఈరోజు సాయంత్రం 5 గంటలలోపు నివేదిక అందించాలని డీటీఓలను ఆదేశిస్తూ రవాణా శాఖ కమిషనర్ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
నిజానికి చాలా కాలంగా రవాణా చెక్ పోస్టుల వద్ద తీవ్రస్థాయిలో అక్రమ వసూళ్ల దందా సాగుతుందన్న చర్చ ఉంది. ఈ నేపథ్యంలోనే వీటిని రద్దు చేయాలని సర్కార్ నిర్ణయించింది. ఈ ఏడాది జులై ఆఖరి వారంలోనే కేబినెట్ నిర్ణయం తీసుకున్నప్పటికీ… వెంటనే జీవో జారీ కాలేదు. నెల రోజుల తర్వాత జీవో జారీ ఇచ్చినప్పటికీ తొలగింపు ప్రక్రియ ముందుకు సాగలేదు. ఈ విషయంపై ఫోకస్ పెట్టిన సీఎం రేవంత్ రెడ్డి… వెంటనే క్లోజ్ చేయాలని ఆదేశించారు. ఇదే విషయంపై కమిషన్ కు ఆదేశాలివ్వటంతో…. ఉత్తర్వులు జారీ అయ్యాయి. దీంతో వీటిని తొలగించే పనిలో అధికారులు పడ్డారు. ఇవాళ సాయంత్రం కల్లా వీటిని తొలగించే ప్రక్రియ పూర్తయ్యే అవకాశం ఉంది.