కొత్త ఉస్మానియా ఆసుపత్రి పనులను రెండేళ్లలో పూర్తి చేయాలి - సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు
నూతన ఉస్మానియా ఆస్పత్రి పనులపై సీఎం రేవంత్ రెడ్డి ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. రెండేళ్లలో నిర్మాణ పనులను పూర్తి చేయాలని ఆదేశించారు. ఆసుపత్రికి వివిధ రహదారులను అనుసంధానించే ప్రణాళికలు ఇప్పటి నుంచే రూపొందించాలని సూచించారు. పనుల విషయంలో నిరంతర పర్యవేక్షణ ఉండాలని దిశానిర్దేశం చేశారు.
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ఉస్మానియా ఆసుపత్రి నూతన భవన నిర్మాణం రెండేళ్లలో పూర్తి చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఉస్మానియా నూతన ఆసుపత్రి నిర్మాణంపై ముఖ్యమంత్రి గారు ఉన్నతస్థాయి సమావేశంలో సమీక్షించారు. అవసరాలకు తగినట్లు అధునాతన వైద్య పరికరాలను సమకూర్చుకోవాలని సూచించారు.

సీఎం రేవంత్ కీలక ఆదేశాలు…
ఇందుకు సంబంధించి తగిన ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులను సీఎఁ రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. అధునాతన పరికరాల ఏర్పాటుకు తగినట్లు గదులు, ల్యాబ్లు, ఇతర నిర్మాణాలు ఉండాలని ఇంజినీరింగ్ అధికారులకు దిశానిర్దేశం చేశారు.
ఆసుపత్రి నిర్మాణ పనులతో పాటు స్థానికులకు ఇబ్బంది లేకుండా చుట్టూ రోడ్ల నిర్మాణం చేపట్టాలన్నారు. ఆసుపత్రి నిర్మాణ పనుల వేగవంతానికి వైద్య ఆరోగ్య శాఖ, పోలీసు, జీహెచ్ఎంసీ, ఆర్ అండ్ బీ, విద్యుత్ శాఖ అధికారులతో వెంటనే ఒక సమన్వయ కమిటీని ఏర్పాటు చేయాలని ఆదేశించారు.
ఈ కమిటీ క్షేత్ర స్థాయిలో పర్యటిస్తూ ప్రతి పది రోజులకోకసారి సమావేశమై ఏవైనా సమస్యలుంటే పరిష్కరించుకుంటూ పనులు వేగంగా జరిగేలా చూడాలని ఆదేశించారు. ఉస్మానియా నూతన ఆసుపత్రి నిర్మాణం పూర్తయ్యాక అక్కడి బందోబస్తు, ట్రాఫిక్ విధుల నిర్వహణకు సంబంధించి ముందుస్తుగానే తగిన ప్రణాళికలు రూపొందించాలని స్పష్టం చేశారు.
ఆసుపత్రికి వివిధ రహదారులను అనుసంధానించే ప్రణాళికలు ఇప్పటి నుంచే రూపొందించాలని ఆర్ అండ్ బీ అధికారులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచించారు. హైదరాబాద్తో పాటు వివిధ జిల్లాల్లో నిర్మాణంలో ఉన్న ఆసుపత్రులు, మెడికల్ కళాశాలల నిర్మాణానికి సంబంధించి ప్రతి నిర్మాణానికి ఒక అధికారిని ప్రత్యేకంగా నియమించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.
నిర్మాణాలపై 24x7 ఆ అధికారి పర్యవేక్షించేలా పూర్తిస్థాయి బాధ్యతలను అప్పగించాలని చెప్పారు. వచ్చే జూన్ నాటికి నిర్మాణాలు పూర్తి చేయాలని ఆదేశించారు.
ఇటీవలే పనులు ప్రారంభం:
ఉస్మానియా జనరల్ హాస్పిటల్ నూతన భవన సముదాయ నిర్మాణ పనులు దసరా పండగ రోజే ప్రారంభమయ్యాయి. మేఘా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ లిమిటెడ్ (ఎం ఈ ఐ ఎల్ ) ప్రాజెక్టుల విభాగం అధ్యక్షులు కె. గోవర్ధన్ రెడ్డి గురువారం శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించి నిర్మాణ పనులను ప్రారంభించారు.
హైదరాబాద్లోని గోషామహల్ పోలీస్ స్టేడియంలో ఉస్మానియా ఆసుపత్రి నూతన భవనాలను నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. ఈ భవనాల నిర్మాణానికి ఈ ఏడాది జనవరిలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు. దసరా నాడు ప్రారంభమైన పనులు ఇక శరవేగంగా జరగనున్నాయి.
ఉస్మానియా ఆసుపత్రి నూతన భవనాల నిర్మాణం రెండున్నర ఏళ్లలో పూర్తి కానున్నాయి. నూతన భవనాల సముదాయాన్ని 26 ఎకరాల విస్తీర్ణంలో 32 లక్షల చదరపు అడుగుల నిర్మాణ విస్తీర్ణంతో అభివృద్ధి చేయనున్నారు. ఇందులో రెండు వేల పడకలు ఏర్పాటు చేస్తారు. ఈ ఆసుపత్రిలో హాస్పిటల్ బ్లాక్ ఒక్కటే 22.96 లక్షల చదరపు అడుగులు విస్తీర్ణంలో నిర్మిస్తారు. అకడమిక్ బ్లాక్, పురుష, మహిళా వసతి గృహ బ్లాకులు, ధర్మశాల, మార్చురీ, యుటిలిటీ బిల్డింగ్, సెక్యూరిటీ బిల్డింగ్ మిగిలిన తొమ్మిది లక్షల నాలుగు వేల చదరపు అడుగుల్లో నిర్మిస్తారు. రెండు స్థాయిల బేస్మెంట్ పార్కింగ్ను 1,500 కార్ల పార్కింగ్ కు అనువుగా నిర్మించనున్నారు.
ఆసుపత్రి సముదాయంలో 29 ప్రధాన, 12 చిన్న ఆపరేషన్ థియేటర్లు, హెలిప్యాడ్, రోబోటిక్ సర్జరీ థియేటర్లు, ట్రాన్స్ప్లాంట్ యూనిట్లు, సీవేజ్ ట్రీట్మెంట్, బయోమెడికల్ వ్యర్థాల నిర్వహణ ప్లాంట్లు నిర్మిస్తారు. అలాగే నర్సింగ్, డెంటల్, ఫిజియోథెరపీ కాలేజీలు వేర్వేరుగా ఉంటాయి. రూఫ్టాప్ టెర్రస్ గార్డెన్లు, క్రాస్ వెంటిలేషన్ టెక్నాలజీలతో నిర్మించే ఆసుపత్రి నూతన భవనాలు నిరంతరాయంగా సహజమైన గాలిని అందించి రోగులకు సౌకర్యవంతమైన వాతావరణాన్ని అందించనున్నాయి.
ABOUT THE AUTHORMaheshwaram Mahendra Charyమహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్టీ ఇన్స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More

E-Paper

