స్థానిక సంస్థల తొలి విడత ఎన్నికల కోసం రాత్రిలోపు అభ్యర్థుల జాబితా సిద్ధం చేయాలి : రేవంత్ రెడ్డి

స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్ల దామాషా ప్రకారం అభ్యర్థులను ఖరారు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. పీసీసీ నిర్ణయించే వరకు రాజకీయ ప్రకటనలు చేయవద్దని స్పష్టం చేశారు.

Published on: Oct 9, 2025, 13:51:54 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదలైంది. మెుదటి విడత పోలింగ్ కోసం పార్టీలు అభ్యర్థులను ఎంపిక చేయడంపై కసరత్తు ప్రారంభించాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్థానిక ఎన్నికలపై సమావేశం నిర్వహించారు. అన్ని పరిస్థితులు ఎదుర్కొని స్థానిక సంస్థల ఎన్నికల్లో ముందుకు వెళ్తున్నామని చెప్పారు. ఇన్ఛార్జి మంత్రులు, ముఖ్య నేతలతో చర్చించి అభ్యర్థులను ఖరారు చేయాలన్నారు.

సీఎం రేవంత్ రెడ్డి
సీఎం రేవంత్ రెడ్డి

నామినేషన్ల ప్రక్రియ కోసం పూర్తిస్థాయిలో సమయం కేటాయించాలని స్పష్టం చేశారు సీఎం రేవంత్ రెడ్డి. నామినేషన్ల దరఖాస్తు పత్రం క్షేత్రస్థాయికి పంపాలని, రిజర్వేషన్ల దామాషా ప్రకారమే అభ్యర్థులను ఖరారు చేయాలని స్పష్టం చేశారు. ఆ నేతలకే బీ ఫారం ఇవ్వాలని, నో డ్యూ పత్రాలు ఇప్పించాలన్నారు. న్యాయపరమైన అంశాల నివృత్తికి గాంధీ భవన్‌లో సమన్వయ కమిటీ ఉండాలన్నారు.

టోల్ ఫ్రీ నంబర్ ఏర్పాటు చేయలన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఎన్నికల ప్రక్రియపై అవగాహన ఉన్నవారు కమిటీలో ఉండేలా చూడాలని తెలిపారురు. 'ఎంపీపీలు, జడ్పీ ఛైర్మన్‌ పదవుల ఎంపికను పీసీసీ నిర్ణయిస్తుంది. పీసీసీ నిర్ణయించే వరకు రాజకీయ ప్రకటనలు చేయకూడదు. హైకోర్టులో బీసీ రిజర్వేషన్ల కేసుపై పీసీసీ చీఫ్‌ పర్యవేక్షణ చేయాలి. ఉన్నత న్యాయస్థానం తీర్పు తర్వాత తర్వాత కార్యాచరణపై రాత్రి మరో భేటీ పెడతాం. తొలివిడత కోసం రాత్రికి అభ్యర్థుల జాబితా సిద్ధం చేయాలి.' అని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.

తాజాగా రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల చేసింది. రెండు విడుతల్లో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు జరగనున్నాయి. రాష్ట్రంలోని మెుత్తం 565 జెడ్పీటీసీలు, 5,749 ఎంపీటీసీ స్థానాలకు రెండు విడతల్లో ఎన్నికలు నిర్వహిస్తారు. ఇందులో భాగంగా మొదటి విడత ఎన్నికలకు రాష్ట్ర ఎన్నికల సంఘం తాజాగా నోటిఫికేషన్‌ విడుదల చేసింది. తక్షణమే నామినేషన్ల ప్రక్రియ మెదలవుతుందని తెలిపింది. మెుదటి విడతలో 292 జెడ్పీటీసీ, 2963 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు నిర్వహిస్తారు. ఈ నెల 11వ తేదీ వరకు అధికారులు నామినేషన్లు స్వీకరిస్తారు. అక్టోబర్‌ 12న నామినేషన్ల పరిశీలన, అక్టోబర్‌ 15న నామినేషన్ల ఉపసంహరణకు గడువు పెట్టారు. 23వ తేదీన పోలింగ్ ఉంటుంది. నవంబర్ 11న కౌంటింగ్ తర్వాత ఫలితాలు వెలువడుతాయి.

రెండో విడతలో మిగిలిన స్థానాలకు ఎన్నికలు ఉంటాయి. అక్టోబర్ 13న నామినేషన్లు స్వీకరణ మెుదలవుతుంది. 15న ముగిస్తారు. అక్టోబర్ 16న నామినేషన్ల పరిశీలన, అక్టోబర్ 19 వరకు నామినేషన్ల ఉపసంహరణకు అవకాశం ఉంటుంది. అక్టోబర్ 27న పోలింగ్ నిర్వహిస్తారు. నవంబర్ 11న రెండు విడతలకు సంబంధించి ఓట్లు లెక్కింపు, ఫలితాలు ఉంటాయి.

గ్రామ పంచాయతీ సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నికలు మూడు విడుతల్లో నిర్వహిస్తారు. 12,733 సర్పంచులు, 1,12,288 వార్డు స్థానాలకు ఎన్నికలు జరుగుతాయి.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More