సీఎం రేవంత్ రెడ్డి స్టైల్ స్ట్రాటజీ .. చేతిలోకి జూబ్లీహిల్స్ స్థానం!
కొన్ని రోజులు తెలంగాణ వ్యాప్తంగా జూబ్లీహిల్స్ పోరు గురించే చర్చ. ఎవరు గెలుస్తారా? అని అందరూ ఆసక్తిగా చూశారు. మెుత్తానికి హస్తం పార్టీ సీటును కైవసం చేసుకుంది. అయితే ఇందులో సీఎం రేవంత్ రెడ్డి స్ట్రాటజీ పక్కాగా పనిచేసిందనే చెప్పాలి.
మాగంటి గోపినాథ్ మరణంతో జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక అనివార్యమైంది. నోటిఫికేషన్ రాకముందే పార్టీలు జూబ్లీహిల్స్లో మకాం వేశాయి. ఇక అధికార కాంగ్రెస్ పార్టీ, ప్రతిపక్ష బీఆర్ఎస్ నడుమ పోటీ మామూలుగా లేదు. ప్రతీ ఓటరును దర్శనం చేసుకున్నాయి పార్టీలు. ఎలాగైనా గెలిచేందుకు తీవ్రంగా ప్రయత్నాలు చేశాయి. ఇక బీఆర్ఎస్ నుంచి కేటీఆర్, హరీశ్ రావులాంటి కీలక నేతలు రంగంలోకి దిగగా.. కాంగ్రెస్ నుంచి ఏకంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు కూడా ప్రచారంలో కీలకంగా వ్యవహరించారు. సీఎం రేవంత్ రెడ్డి తనదైన స్టైల్లో ఈ ఎన్నికలకు స్ట్రాటజీ ప్లే చేశారు. అది సక్సెస్ అయింది. ఫలితంగా 24,729 ఓట్ల తేడాతో నవీన్ యాదవ్ గెలిచారు.

కేబినెట్ విస్తరణ
జూబ్లీహిల్స్ ఎన్నికల వేల సీఎం రేవంత్ రెడ్డి మార్క్ స్ట్రాటజీ ప్లే చేశారు. ఈ స్థానంలో ముస్లిం ఓటర్లు అధికం. వారు ఎటువైపు ఓటు వేస్తారో ఆ పార్టీకే గెలుపు అవకాశాలు ఎక్కువ. దీంతో రిటైర్డ్ క్రికెటర్, సీనియర్ కాంగ్రెస్ నేత అజారుద్దీన్ను తెరపైకి తెచ్చారు రేవంత్. ఆయనకు మంత్రి పదవి ఇచ్చారు. దీంతో అప్పటికే చాలా మంది ముస్లింలు కాంగ్రెస్ వైపు ఉండగా.. ఈ మంత్రి పదవి తర్వాత దాదాపు హస్తం పార్టీ వైపే మద్దతు ఇచ్చారు.
కార్నర్ మీటింగ్స్
నిజానికి ఏదైనా ఉప ఎన్నిక వస్తే ఏకంగా ముఖ్యమంత్రి వచ్చి ప్రచారంలో పాల్గొనడం అరుదు. కానీ రేవంత్ రెడ్డి అవేమీ పట్టించుకోలేదు. తన పార్టీ గెలవాలనే ఉద్దేశంతో కార్నర్ మీటింగ్స్, రోడ్ షోలు నిర్వహించారు. ఏడు డివిజన్లలో కార్నర్ మీటింగ్లు ఏర్పాటు చేశారు. ఈ నియోజకవర్గంలో పెద్ద సంఖ్యలో సెటిలర్స్, కమ్మ సామాజిక వర్గానికి చెందిన ఓటర్లు ఉన్నారు. తమవైపు తిప్పుకోవడానికి అమీర్పేట్లో ఎన్టీఆర్ విగ్రహం హామీ ఇచ్చారు. ఈ సెంటిమెంట్ బాగా వర్కౌట్ అయింది. ఇక టీడీపీ శ్రేణులు కూడా కాంగ్రెస్ వైపే మెుగ్గు చూపాయి.
మంత్రులు, కార్పొరేషన్ ఛైర్మన్లతో కమిటీలు
జూబ్లీహిల్స్లో పోల్ మేనెజ్మెంట్లో కాంగ్రెస్ గ్రాండ్ సక్సెస్ అయిందని చెప్పవచ్చు. కిందిస్థాయి నేతలతో మంత్రులు, ఎమ్మెల్యేలు, కార్పొరేషన్ ఛైర్మన్లు ఎప్పటికప్పుడు టచ్లోనే ఉన్నారు. మంత్రులు, కార్పొరేషన్ ఛైర్మన్లతో సీఎం రేవంత్ ఏర్పాటు చేసిన కమిటీలు క్షేత్రస్థాయిలో ఓటు బ్యాంకు చీలిపోకుండా చేసింది. బూత్ స్థాయి నుంచి నేతలు ఎప్పటికప్పుడు సమాచారం తెప్పించుకుంటూ ప్రణాళికలు వేశారు. మరోవైపు ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క సినీ కార్మికులకు మేం ఉన్నామంటూ హామీ ఇవ్వడం కూడా కలిసి వచ్చింది. సినీ పెద్దలతో ఎప్పటికప్పుడు మీటింగ్స్ పెట్టడం, కార్మికులకు భరోసా ఇవ్వడంతో కాంగ్రెస్కు ఓటు బ్యాంకు పెరిగింది.
నవీన్ యాదవ్కు టికెట్
జూబ్లీహిల్స్లో బరిలో నిలిచేందుకు హస్తం పార్టీ నుంచి అనేక మంది అభ్యర్థుల పేర్లు తెరపైకి వచ్చాయి. కానీ నవీన్ యాదవ్కు టికెట్ ఇప్పించడంలో రేవంత్ రెడ్డి సక్సెస్ అయ్యారు. నవీన్ యాదవ్ తండ్రి శ్రీశైలం యాదవ్కు స్థానికంగా ఉన్న పేరు, నవీన్ యాదవ్కు యువతలో ఉన్న క్రేజ్, యాదవ ఓటర్లు లాంటి అంశాలను లెక్కలు వేసుకుని రేవంత్ రెడ్డి సరైన నిర్ణయం తీసుకున్నారు.
ఎంఐఎంతో సంప్రదింపులు
జూబ్లీహిల్స్లో ముస్లిం ఓటర్లు అధికం. ఇక్కడ ఎంఐఎం పాత్ర చాలా కీలకమైనది. దీనితో ఆ పార్టీని బరిలో లేకుండా చర్చలు జరిపారు రేవంత్ రెడ్డి. తమకు మద్దతు ఇచ్చేలా వ్యూహాలు రచించారు. నవీన్ యాదవ్కు అంతకుముందు ఎంఐఎంతో ఉన్న దోస్తీ కూడా పనికొచ్చింది. ఫలితంగా ముస్లిం ఓట్లు గంపగుత్తుగా కాంగ్రెస్కే పడ్డాయి.
రేవంత్ రెడ్డి మార్క్ కౌంటర్స్
బీఆర్ఎస్ వర్సెస్ రేవంత్ రెడ్డి అనేలా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికను తీసుకొచ్చారు. బీఆర్ఎస్ చేస్తున్న విమర్శలను సరిగా కౌంటర్ ఇచ్చారు సీఎం. ఆడబిడ్డ సెంటిమెంట్ను బీఆర్ఎస్ పార్టీ తెరపైకి తెచ్చింది. అయితే మీ ఇంటి ఆడబిడ్డకే సరైన న్యాయం చేయలేదంటూ జనాల్లోకి బలంగా తీసుకెళ్లారు. బీఆర్ఎస్ చేసిన ప్రతీ విమర్శకు సరైన రీతిలో కౌంటర్స్ ఇచ్చారు రేవంత్. ఆ మాటలు జనాల్లోకి బలంగా వెళ్లాయి. ఫలితంగా జూబ్లీహిల్స్ నియోజకవర్గం రేవంత్ రెడ్డి చేతిలోకి వచ్చింది.

E-Paper












