ఇటీవల కాలంలో హైదరాబాద్ నగరంలో తరుచుగా డ్రగ్స్ పట్టుబడటం కలకలం రేపుతోంది. తాజాగా రాజేంద్రనగర్ పరిధిలో ఓ డ్రగ్స్ ముఠాను పోలీసులు పట్టుకున్నారు. ఈ కేసులో ఆరుగురిని అరెస్ట్ చేసినట్లు సైబరాబాద్ పోలీసులు తెలిపారు. వీరంతా ఎండీఎంఏ, గంజాయి సరఫరా చేస్తున్నట్లు పేర్కొన్నారు.

విశ్వసనీయ సమాచారం ఆధారంగా పోలీసు బృందాలు మొదట ఆరాంఘర్ రోడ్ సమీపంలో మాదకద్రవ్యాల సరఫరాదారుల బృందాన్ని అడ్డగించాయి. విచారణ అనంతరం రాజేంద్రనగర్ లో ముగ్గురు వినియోగదారులను అరెస్టు చేసినట్లు డిప్యూటీ పోలీస్ కమిషనర్ (రాజేంద్రనగర్ జోన్) యోగేష్ గౌతమ్ ఒక ప్రకటనలో తెలిపారు.
నిందితుల నుంచి 18 గ్రాముల ఎండీఎంఏ, 130 గ్రాముల గంజాయి, ఐదు మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ఔషధాల విలువను ఇంకా వెల్లడించలేదు. ఆంధ్రప్రదేశ్ లోని కాకినాడ, రాజమండ్రితో పాటు బెంగళూరుకు చెందిన వాళ్లు సరఫరాదారులుగా ఉన్నట్లు గుర్తించారు. వీరంతా సిండికేట్ మార్గంలో పంపిణీ చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.
18 గ్రాముల ఎండీఎంఏ, 130 గ్రాముల గంజాయిని బెంగళూరు నుంచి హైదరాబాద్ కు రవాణా చేసి బ్యాగుల్లో దాచి ఉంచినట్లు పోలీసులు తెలిపారు. ఆరామ్ఘర్ రోడ్డుకు చేరుకున్న వారిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు. అసలు విషయం బయటికి రావటంతో… ముగ్గురిని ముందుగా అరెస్ట్ చేశారు. ఆ తర్వాత మరో ముగ్గురిని కూడా అదుపులోకి తీసుకొని రిమాండ్ కు పంపారు. పరారీలో ఉన్న సరఫరాదారుని పట్టుకునేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని పోలీసులు తెలిపారు.