...
...
Next Story

చేవెళ్ల బస్సు ప్రమాదంలో గుండెను పిండేసే దృశ్యాలు.., కంట్రోల్ రూమ్ నెంబర్లు ఇవి!

రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం మీర్జాగూడ బస్సు ప్రమాదంలో హృదయ విదారక దృశ్యాలు కనిపిస్తున్నాయి. కంకరలో కూరుకుపోయి చాలా మంది చనిపోయారు. బాధితుల కోసం అధికారులు కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు.

Updated on: Nov 03, 2025 10:41 AM IST
Advertisement

రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం మీర్జాగూడ బస్సు ప్రమాదంలో 19 మంది మృతి చెందారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని చెబుతున్నారు. మీర్జాగూడ సమీపంలో ఆర్టీసీ బస్సును కంకర లోడుతో వెళ్తున్న లారీ ఢీకొట్టడంతో ఘటన జరిగింది. ఈ ప్రమాదం జరిగిన సమయంలో తాండూరు ఆర్టీసీ డిపోనకు చెందిన బస్సులో 70 మంది ప్రయాణికులు ఉన్నారు.

చేవెళ్ల బస్సు ప్రమాదం
చేవెళ్ల బస్సు ప్రమాదం

పటాన్‌చెరు లక్డారం క్రషర్‌ నుంచి వికారాబాద్‌ వైపు వెళ్తోంది లారీ. రహదారిపై గుంతను తప్పించబోయి మీర్జాగూడ సమీపంలో ఆర్టీసీ బస్సును కంకర లారీ కొట్టింది. ఎదురుగా వచ్చి పూర్తిగా ఆర్టీసీ బస్సుపైకి ఒరిగింది. బస్సులోని ప్రయాణికులపై లారీలో ఉన్న కంకర పడింది. దీంతో కంకర కింద ప్రయాణికులు కూరుకుపోయారు. కంకరతో బస్సు నిండడంతో సహాయక చర్యలు కష్టంగా మారాయి. మూడు జేసీబీల సహాయంతో సహాయ చర్యలు కొనసాగిస్తున్నారు.

బస్సుపై కంకరలోడు ఒక్కసారిగా పడిపోవడంతో ప్రమాద తీవ్రత ఎక్కువైంది. అందులో ఉన్న ప్రయాణికులు కంకరలో కూరుకుపోయారు. సమాచారం అందిన వెంటనే పోలీసులు ఘటన స్థలానికి వచ్చి సహాయక చర్యలు చేపట్టారు. హైదరాబాద్‌-బీజాపూర్‌ జాతీయరహదారిపై రోడ్డు ప్రమాదం కావడంతో చేవెళ్ల-వికారాబాద్ మార్గంలో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది.

రంగారెడ్డి ప్రమాద తీవ్రతపై ఎప్పటికప్పుడు సమాచారాన్ని సీఎం రేవంత్ రెడ్డి అడిగి తెలుసుకుంటున్నారు. సీఎం ఆదేశాలతో అన్ని విభాగాల అధికారులను సీఎస్ అలర్ట్ చేశారు. వెంటనే సచివాలయంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. సహాయక చర్యలు పర్యవేక్షించాలని ఆర్టీసీ ఎండీ, రవాణాకమిషనర్, ఫైర్ డీజీకి ఆదేశాలు వెళ్లాయి. సచివాలయంలో కంట్రోల్‌రూమ్‌ నంబర్లు 9912919545, 9440854433 ఏర్పాటు చేశారు.

ప్రధాని మోదీ తీవ్ర దిగ్భ్రాంతి

చేవెళ్ల బస్సు ప్రమాద ఘటనపై ప్రధాని మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ప్రార్థించారు. మృతుల కుటుంబాలకు రూ.2లక్షలు, క్షతగాత్రులకు రూ.50 వేల చొప్పున ఆర్థిక సాయం ప్రకటించారు.

 
ABOUT THE AUTHOR
Anand Sai

ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe