Mahabubnagar Road Accident : మహబూబ్నగర్ జిల్లాలో సోమవారం ఉదయం పెను విషాదం చోటుచేసుకుంది. పాలకొండ జంక్షన్ సమీపంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం ఐదుగురు వ్యక్తుల నిండు ప్రాణాలను బలితీసుకుంది. అతివేగం, అజాగ్రత్త వెరసి రెండు కుటుంబాల్లో తీరని శోకాన్ని మిగిల్చాయి.
ఐదుగురు మృతి…!
ప్రాథమిక సమాచారం ప్రకారం.. పాలకొండ జంక్షన్ వద్ద ఒక కారు రోడ్డు క్రాస్ చేస్తున్న సమయంలో, అత్యంత వేగంగా వచ్చిన ఒక రేసింగ్ బైక్ దానిని బలంగా ఢీకొట్టింది. ప్రమాద తీవ్రతకు కారు పల్టీలు కొట్టగా, బైక్ నుజ్జునుజ్జు అయింది. ఈ ఘటనలో ఐదుగురు వ్యక్తులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో కారులో ప్రయాణిస్తున్న వారు అలాగే బైక్ నడుపుతున్న యువకుడు ఉన్నట్లు తెలిసింది.
ఈ ప్రమాదంలో మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. రక్తపు మడుగులో ఉన్న బాధితుడిని హుటాహుటిన సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతని పరిస్థితి అత్యంత విషమంగా ఉందని, వైద్యులు అత్యవసర చికిత్స అందిస్తున్నారని సమాచారం.
పాలకొండ జంక్షన్ వద్ద వాహనాలు రోడ్డు దాటే సమయంలో అప్రమత్తంగా ఉండాలని సూచికలు ఉన్నప్పటికీ, రేసింగ్ బైక్ మితిమీరిన వేగంతో రావడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని ప్రాథమికంగా భావిస్తున్నారు. జంక్షన్ వద్ద వేగాన్ని నియంత్రించకపోవడం, అవగాహన లోపం ప్రాణాపాయానికి దారితీశాయి. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం జిల్లా ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతుల పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.