పేదల ఇళ్లే టార్గెట్.. పెద్దవాళ్ల జోలికి హైడ్రా ఎందుకు వెళ్లలేదు? : కేటీఆర్

హైద‌రాబాద్‌లో హైడ్రా పేరుతో ప్రభుత్వం చేస్తున్న అరాచ‌కాల‌కు ఎంతో మంది బాధితులుగా మారారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. మూసీ వ‌ల్ల, హైడ్రా వ‌ల్ల ఎంతో మంది బాధితులుగా అయ్యారని విమర్శించారు.

Updated on: Nov 2, 2025, 14:26:06 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

తెలంగాణ భవన్‌లో పెద్దవాళ్లకు ఒక న్యాయం.. పేద వాళ్లకు ఒక న్యాయం నినాదంతో ఎగ్జిబిషన్ నిర్వహించారు. హైడ్రాపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేశారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. హైద‌రాబాద్‌లో హైడ్రా పేరుతో ప్రభుత్వం చేస్తున్న అరాచ‌కాల‌కు ఎంతో మంది బాధితులుగా మారారు అని విమర్శించారు. మూసీ వల్ల, హైడ్రా వ‌ల్ల ఎంతో మంది బాధితులుగా అయ్యారని తెలిపారు.

కేటీఆర్
కేటీఆర్

'చాంద్రాయ‌ణ‌ గుట్టలో స్కూల్ కూడా కూల‌గొట్టారు. కేసీఆర్ హయాంలో ఎక్కడ చూసినా క‌ట్టడాలే క‌నిపిస్తాయి. హైద‌రాబాద్‌లోనే ల‌క్ష డ‌బుల్ బెడ్రూం ఇళ్లు క‌ట్టించాం. వైట్ హౌస్‌ను త‌ల‌ద‌న్నేలా స‌చివాల‌యం క‌ట్టాం. దేశంలోనే అతిపెద్ద పోలీస్ క‌మాండ్ కంట్రోల్ సెంట‌ర్ క‌ట్టుకున్నాం. హైద‌రాబాద్‌లో 42 ఫ్లై ఓవ‌ర్లు, అండ‌ర్ పాస్‌లు క‌ట్టుకున్నాం. ప్రతీ జిల్లాలో క‌లెక్టరేట్‌లు క‌ట్టుకున్నాం, నీటి ప్రాజెక్టులు క‌ట్టుకున్నాం. ఒక‌టి రెండు కాదు.. రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడికక్కడ కొత్త నిర్మాణాలు చేసుకున్నాం.' కేటీఆర్ అన్నారు.

కాంగ్రెస్ ఈ రెండేళ్లలో ఒక్క ఇటుక పెట్టలేదని, ఒక్క కొత్త క‌ట్టడం చేయలేదని కేటీఆర్ అన్నారు. ఈ రెండేళ్లలో రేవంత్ రెడ్డి చేసింది ఏంటి అంటే.. కూల‌గొట్టడమేనని విమర్శించారు. ఈ ప్రభుత్వం వ‌ల్ల జ‌రిగిన అన్యాయానికి ఎంతో మంది బాధితులుగా మారారు అని కేటీఆర్ అన్నారు. 500 రోజుల్లో కేసీఆర్ ప్రభుత్వం రానుందని, మ‌న ప్రభుత్వం వచ్చిన త‌ర్వాత ప్రతి ఒక్కరికీ న్యాయం చేస్తామన్నారు. ఎవరు కూడా ఇంత అన్యాయంగా, కిరాత‌కంగా ప‌నిచేయాల‌ని కోరుకోరన్నారు.

'పేద‌వాడికి ఒక న్యాయం.. ఉన్నవాడికి ఒక న్యాయం.. ఇది ఈ ప్రభుత్వ ప‌నితీరు. ఒక ఇంటి గృహప్రవేశం చేసి వారం రోజులు కాలేదు.. బుల్డోజ‌ర్ వ‌చ్చి కూల‌గొట్టింది. ఒక గర్భిణిని పక్కకు తోస్తే ఎలా ఉంటుందో అంతా ఆలోచించాలి. మూడేళ్ల చిన్నారి భోజ‌నం లేకండా ఏడ్చిన ప‌రిస్థితి. హైడ్రా బాధితుల బాధ అంద‌రికీ అర్థం కావాలి. హైడ్రాపై భ‌ట్టి విక్రమార్క పెద్ద ప్రజంటేష‌న్ ఇచ్చారు. ఆ రోజు భ‌ట్టి ఇచ్చిన ప్రజంటేషన్‌లో చాలా విష‌యాలు చెప్పారు. ఆయ‌న చాలా బిల్డర్ల పేర్లు చెప్పారు కానీ.. మేం ఏ బిల్డర్‌ను ఇబ్బంది పెట్టద‌లుచుకోలేదు. పేద‌వాడి ఇంటికి బుల్డోజ‌ర్ వ‌చ్చింది.. ఆ బిల్డర్ల జోలికి ఎందుకు వెళ్లలేదో ప్రభుత్వం చెప్పాలి.' అని కేటీఆర్ అన్నారు.

పేద‌లు కోరుకునేది ఒక్కటే కూడు గూడు గుడ్డ. అలాంటి పేద‌ల‌ ఇళ్లను ప్రభుత్వం కూల్చేసిందన్నారు కేటీఆర్. ప్రభుత్వానికి అంతా సమానమైతే పెద్ద వాళ్ల జోలికి ఎందుకు వెళ్లలేదు.. వారికి ఎందుకు నోటీసులు ఇవ్వలేదు? అని ప్రశ్నించారు. పేద‌ల‌కు న్యాయం చేయాల‌నుకుంటే.. ఫైవ్ స్టార్ హోట‌ళ్లలో స‌మావేశాలు ఎందుకు పెడుతున్నట్లు? అని అడిగారు. రూల్స్ అతిక్రమిస్తే కాపాడాల‌ని మ‌న‌మేం చెప్పట్లేదని, పేద‌ల ఇళ్లు కూల‌గొట్టలేద‌ని హైడ్రా క‌మిష‌న‌ర్ చెబుతున్నారన్నారు.

పేప‌ర్లు, కోర్టు తీర్పులు ఉన్నా కూడా.. టైమ్ ఇస్తే కోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకుంటార‌ని చెబుతున్నారని కేటీఆర్ అన్నారు. ఇలా చేస్తుంటే.. ఇక ప్రజాస్వామ్యం ఎందుకు.. కోర్టులు ఎందుకు? అని ప్రశ్నించారు. ఫుల్ ట్యాంక్ లెవ‌ల్లో క‌డితే ఎవ‌రిని వ‌ద‌లం అని చెప్పి పెద్దలను వ‌దిలేశారన్నారు. మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస్ రెడ్డి చెరువును పూడ్చి ఇల్లు క‌ట్టారని, ఈయ‌న రాష్ట్ర రెవెన్యూ మంత్రి.. ఆయ‌న ఇంటికి వెళ్లే ధైర్యం హైడ్రా క‌మిష‌న‌ర్ చేస్తారా? అని అడిగారు.

'మ‌రో మంత్రి వివేక్ కూడా హిమాయ‌త్ సాగ‌ర్ చెరువు వ‌ద్ద ఇల్లు క‌ట్టుకున్నారు. వీళ్లను ముట్టే ధైర్యం హైడ్రా చేస్తుందా రేవంత్ రెడ్డి అన్న తిరుప‌తి రెడ్డి దుర్గం చెరువు ఎఫ్‌టీఎల్ లోపల ఇల్లు క‌ట్టుకున్నారు. సున్నం చెరువులో ఇల్లు క‌ట్టుకున్న పేద‌ల‌ది త‌ప్పు.. దుర్గం చెరువులో క‌ట్టిన తిరుప‌తి రెడ్డిది ఏ త‌ప్పులేదు. పేద‌ల‌కు అస‌లు టైమ్ ఇవ్వరు.. తిరుప‌తి రెడ్డికి టైమ్ ఇచ్చి కోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకునేలా చేస్తారు. ఎమ్మెల్సీ ప‌ట్నం మ‌హేంద‌ర్ రెడ్డి చెరువు మ‌ధ్యలోనే ఇల్లు క‌ట్టుకున్నారు. ఆయ‌న‌కు నోటీసులు ఇచ్చే దైర్యం హైడ్రాకు ఉందా?' అని కేటీఆర్ ప్రశ్నించారు.

మండ‌లి చైర్మన్ గుత్తా సుఖేంద‌ర్ రెడ్డి చెరువులోనే ఇల్లు క‌ట్టుకున్నారని కేటీఆర్ చెప్పారు. వాళ్ల ద‌గ్గరకు వెళ్లి.. వారికి నోటీసులు ఇచ్చే ద‌మ్ము అధికారుల‌కు ఉందా? అని అడిగారు. పెద్ద పెద్ద ఫామ్ హౌజ్‌లు, ఇల్లులు క‌ట్టుకున్నా అడిగేవారు లేరన్నారు. శేరిలింగంప‌ల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ.. గాజుల‌రామారంలో 11 ఎక‌రాల‌కు ప్రభుత్వమే అండ‌గా ఉందన్నారు. పేద‌ల‌ను వెళ్లగొట్టి గాంధీకి మాత్రం అండ‌గా నిలిచారన్నారు.

మాకు హ‌ద్దులు చూపించ‌డం లేదు.. హ‌ద్దులు విష‌యంలో ఇబ్బందులు ఉన్నాయ‌ని అధికారులు చెబుతున్నారని, కాంగ్రెస్‌లో చేరితే ఒక న్యాయం.. ఇత‌రుల‌కు మ‌రో న్యాయం ఉంటుందా? ఈ షీట్‌లు వేసింది కూడా అధికారులేనని కేటీఆర్ అన్నారు. మూసీ న‌దిలో అడ్డంగా క‌ట్టిన బిల్డింగ్‌ను కూడా ఇప్పటి వ‌ర‌కు ఆప‌లేదు.. ఆ ధైర్యం హైడ్రాకు ఉందా? అని ప్రశ్నించారు. పెద్ద బిల్డర్లు క‌డితే వారికి స‌హ‌క‌రించి.. తానా తందానా ఆడ‌తారని, మూసీకి అడ్డంగా ఆకాశ‌మంత పెద్దగా క‌డితే కూడా వారికి క‌నిపించ‌దన్నారు.

'మంత్రులు, పెద్ద పెద్ద నాయ‌కుల‌కు ప్రభుత్వం అండ‌గా ఉంటుంది.. కానీ పేద‌ల‌ పైకి బుల్డోజ‌ర్లు పంపిస్తారు. అందుకే మేం హైడ్రాను వ్యతిరేకించేది. బుల్డోజ‌ర్ నా శ‌రీరంపై నుంచి వెళ్లాల‌ని యూపీలో రాహుల్ గాంధీ మాట్లాడారు. అదే తెలంగాణ‌లో బుల్డోజ‌ర్ ఇళ్లను కూల‌గొడుతుంటే రాహుల్ గాంధీ ఏం చేస్తున్నారు? ఇది త‌ప్పు అని.. రేవంత్ రెడ్డికి ఎందుకు చెప్పట్లేదు?' అని అడిగారు కేటీఆర్.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More