జూబ్లీహిల్స్‌లో క్రాస్ వెరిఫై.. ఓటు వేయని వారిని డబ్బులు తిరిగి ఇచ్చేయమంటున్న నేతలు!

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక అందరి దృష్టిని ఆకర్శించింది. పోలింగ్ అనంతరం వివాదం కూడా అయింది. అయితే ప్రధాన పార్టీలు విస్తృతంగా డబ్బు పంపిణీ చేశాయనే ఆరోపణలు కూడా ఉన్నాయి. కానీ ఇప్పుడు నగదు తీసుకొని ఓటు వేయని ఓటర్లను తిరిగి ఇవ్వమని ఒత్తిడి చేస్తున్నాయట.

Published on: Nov 13, 2025 11:34 AM IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నిక పోరు కాంగ్రెస్-బీఆర్ఎస్ మధ్య నువ్వా నేనా అన్నట్టుగా నడిచింది. 48.47 శాతం పోలింగ్ నమోదైంది. ఎప్పటిలాగే సాంప్రదాయాన్ని కొనసాగిస్తూ.. జూబ్లీహిల్స్ ఓటర్లు ఓటింగ్ కేంద్రాలకు రాలేదు. దీంతో పోలింగ్ శాతం తక్కువే నమోదైంది.

జూబ్లీహిల్స్
జూబ్లీహిల్స్

కాంగ్రెస్ ఈ స్థానాన్ని గెలుచుకోవడానికి తీవ్రంగా పోరాడగా, భారత రాష్ట్ర సమితి దానిని నిలుపుకోవడంపై దృష్టి పెట్టింది. కానీ ఎగ్జిట్ పోల్స్ మాత్రం కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా వచ్చాయి. నవంబర్ 14న ఫలితాలు రానున్నాయి. ప్రధాన పార్టీలు డివిజన్లు, మురికివాడలు, అపార్ట్‌మెంట్లలో భారీగా ఖర్చు చేశాయని వార్తలు వచ్చాయి.

అనేక పార్టీల బూత్ కమిటీలు నగదు పంపిణీ జాబితాలను తయారు చేసి, తరువాత వాటిని పోలింగ్ ఏజెంట్లు నిర్వహించే ఓటర్ల జాబితాలతో పోల్చాయని తెలుస్తోంది. పోలింగ్ ముగిసిన తర్వాత పార్టీల కార్యకర్తలు డబ్బు తీసుకున్నా.. ఓటు వేయని వారిని గుర్తించడం ప్రారంభించారట. అనేక కాలనీలు, మురికివాడలలో స్థానిక నాయకులు డబ్బును తిరిగి ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారని తెలుస్తోంది.

అపార్ట్‌మెంట్లు లేదా కాలనీల్లో డబ్బుల పంపిణీ కోసం పెద్దమనుషులను పెట్టారు. అయితే ఓటు వేయని వారి దగ్గర డబ్బులు వసూలు చేసే బాధ్యత వారే తీసుకున్నట్టుగా సమాచారం. బూత్-స్థాయి బృందాలు కాలనీ పెద్దలను సంప్రదించి, కనీసం, తిరిగి చెల్లించిన నగదును కమ్యూనిటీ పనులకైనా.. ఉపయోగించాలని కోరుతున్నారట.

మధురనగర్‌లో ఒక అపార్ట్‌మెంట్ అసోసియేషన్ సమావేశమై డబ్బును స్వీకరించి ఓటు వేయడం మానేసిన ఓటర్ల డబ్బులను సంఘానికి తిరిగి ఇవ్వాలని, అది భవన నిర్వహణకు ఉపయోగపడుతుందని నిర్ణయించిందని తెలుస్తోంది. బూత్ కమిటీ సభ్యులు ఈ ప్రతిపాదనకు అంగీకరించారట.

గత ఎన్నికలలో అధిక ఓటింగ్ నమోదైన ప్రాంతాలలో పార్టీలు డబ్బు పంపిణీ చేశాయి. అనేక బూత్‌లలో సగానికి పైగా ఓటర్లు నగదు అందుకున్నట్లు తెలిసింది. కొన్ని బూత్ కమిటీలు మొదట తమ సొంత పార్టీ కార్యకర్తల కుటుంబాలకు చెల్లించాయి, తరువాత బంధువులు, స్నేహితులు, తెలిసిన గృహాలు పంపించారు. అపార్ట్‌మెంట్లు, మురికివాడలలో సీనియర్ స్థానిక నివాసితులు పంపిణీ చేశారు. అయితే కింది స్థాయి నేతలు డబ్బును పంచకుండా దాచుకున్నారనే ఆరోపణలు కూడా ఉన్నాయి.

రహమత్ నగర్, యూసుఫ్‌గూడ లాంటి డివిజన్లలోని బూత్ కమిటీ బృందాలు క్రాస్-వెరిఫై చేయడం ప్రారంభించాయి. పోలింగ్ సమయంలో ప్రతి అభ్యర్థి ఏజెంట్ ఓటు వేసిన వారి పేర్లను గుర్తించాడు. ఈ జాబితాలను నగదు పంపిణీ రిజిస్టర్‌లతో సరిపోల్చి డబ్బును తీసుకుని ఓటు వేయని చాలా మంది ఓటర్లను కనుగొన్నారట. ఇంటికి వెళ్లి డబ్బు తిరిగి అడుగుతున్నారట.

అనేక కాలనీల్లో ఓటు వేయని వారి గురించి విచారణలు జరిగాయి. తిరిగి వచ్చిన డబ్బును స్థానికంగా ఏవైనా చిన్న చిన్న పనులకు ఉపయోగించాలని పలువురు నేతలు చెబుతున్నారు. అపార్ట్‌మెంట్ బ్లాక్‌లు కూడా అదే విధానాన్ని అనుసరిస్తున్నాయి. డబ్బు తీసుకున్న వారిలో సగం మంది ఓటు వేయలేదట.

News/Telangana/జూబ్లీహిల్స్‌లో క్రాస్ వెరిఫై.. ఓటు వేయని వారిని డబ్బులు తిరిగి ఇచ్చేయమంటున్న నేతలు!
News/Telangana/జూబ్లీహిల్స్‌లో క్రాస్ వెరిఫై.. ఓటు వేయని వారిని డబ్బులు తిరిగి ఇచ్చేయమంటున్న నేతలు!