ఇంటర్ పరీక్షా కేంద్రంలోని బాత్ రూమ్ లో షాకింగ్ ఘటన వెలుగు చూసింది. ఫస్ట్ ఇయర్ పరీక్షలు రాస్తున్న ఓ విద్యార్థిని(మైనర్)….. మృత శిశువుకు జన్మనిచ్చింది. ఈ ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో చోటుచేసుకుంది.

పాల్వంచలోని ఓ కేంద్రానికి ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్న 16 ఏళ్ల బాలిక ఇంగ్లీష్(ఫిబ్రవరి 27) పరీక్ష రాయటానికి వచ్చింది. పరీక్ష ప్రారంభమైన తర్వాత ఇన్విజిలేటర్ అనుమతితో టాయ్లెట్కు వెళ్లింది. ఎంతసేపటికీ రాకపోవటంతో టాయిలెట్ వైపు వెళ్లి చూశారు.
సదరు విద్యార్థిని నెమ్మదిగా నడుచుకుంటూ బయటికి వచ్చింది. ఆమె తీరును గమనించిన సిబ్బంది… ఆమెను ప్రశ్నించారు. బాలిక పలు వివరాలు చెప్పటంతో…. అసలు విషయం బయటపడింది. టాయిలెట్ లోకి వెళ్లిచూడగా.. బేసిన్లో చనిపోయిన శిశువు పడి ఉండటాన్ని సిబ్బంది గమనించారు.
పరువు పోతుందనే భయంతోనే ఎవరికీ అనుమానం రాకుండా శిశువును బాత్రూం బేసిన్లో కుక్కినట్లు బాలిక తెలిపినట్లు సిబ్బంది తెలిపారు. దీంతో పరీక్షా కేంద్రం నిర్వాహకులు విషయాన్ని జిల్లా ఉన్నతాధికారులు, పోలీసులకు ద్వారా తెలియజేశారు.
పరీక్షా కేంద్రానికి వచ్చిన అధికారులు… బాలికను ఆసుపత్రికి తీసుకెళ్లి చికిత్స అందించారు. వాష్ రూంలోని మృత శిశువును 108 వాహనంలో గవర్నమెంట్ ఆసుపత్రిలోని మార్చురీకి తరలించారు. ఈ ఘటనపై ఫిర్యాదు అందగా… పోలీసులు విచారణ జరుపుతున్నారు.