Hyderabad Crime News : హైదరాబాద్లో దారుణం - 9 నెలల పసిపాపను చెరువులో ముంచి చంపిన తల్లి..!
హైదరాబాద్ ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం జరిగింది. బైరామల్గూడ చెరువులో ఓ తల్లి…. తన తొమ్మిది నెలల కన్నబిడ్డను నీటిలో ముంచి హత్య చేసింది. మద్యం మత్తులో ఉన్న సదరు మహిళను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
హైదరాబాద్ నగరంలో గుండెలను పిండేసే అత్యంత విషాదకర సంఘటన వెలుగుచూసింది. కన్నతల్లే కాలయమురాలై, నవమాసాలు మోసి కన్న తొమ్మిది నెలల పసిపాపను నీటిలో ముంచి ప్రాణాలు తీసింది. ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బైరామల్గూడ చెరువు వద్ద ఈ ఘోరం జరిగింది.

ఎల్బీనగర్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కర్ణాటకలోని బీదర్ జిల్లాకు చెందిన లోకసాని రాజేశ్వరి (34)కి, నల్గొండ జిల్లా చింతపల్లి మండలానికి చెందిన లోకసాని రవీందర్ రెడ్డితో కొన్నేళ్ల క్రితం వివాహమైంది. ఉపాధి నిమిత్తం నగరానికి వచ్చిన ఈ దంపతులు గత కొన్నేళ్లుగా ఎల్బీనగర్ సమీపంలోని ఇంజాపూర్ ప్రాంతంలో నివాసముంటున్నారు. వీరికి తొమ్మిది నెలల వయసున్న 'అనురాధ' అనే కూతురు ఉంది. రవీందర్ రెడ్డి బటాసింగారం పండ్ల మార్కెట్లో హమాలి (కూలీ)గా పనిచేస్తుండగా, రాజేశ్వరి గృహిణిగా ఉంటోంది.
ఈ దంపతుల మధ్య గత కొంతకాలంగా తీవ్రమైన కుటుంబ కలహాలు జరుగుతున్నట్లు పోలీసులు గుర్తించారు. భార్యాభర్తల మధ్య మనస్పర్థల కారణంగా రాజేశ్వరి పలుమార్లు తన పసిపాపను తీసుకుని ఎవరికీ చెప్పకుండా ఇంటి నుంచి వెళ్లిపోయేది. రెండు మూడు రోజుల పాటు బయటే ఉండి తిరిగొచ్చేదని, ఈ విషయమై దంపతుల మధ్య నిత్యం గొడవలు జరుగుతుండేవని పోలీసుల విచారణలో తేలింది.
ఆదివారం సాయంత్రం కూడా గొడవ జరిగిన అనంతరం రాజేశ్వరి కల్లు సేవించి, తీవ్ర మత్తులో తన తొమ్మిది నెలల కూతురు అనురాధను తీసుకుని బైరామల్గూడ చెరువు వద్దకు వెళ్ళింది. ఏ మాత్రం మానవత్వం లేకుండా పసిపాపతో సహా చెరువులోకి దిగి…. చిన్నారిని నీటిలో ముంచి చంపేసింది.
ఈ దృశ్యాన్ని గమనించిన స్థానికులు వెంటనే స్పందించి, ఆమెను అడ్డుకోవడమే కాకుండా పోలీసులకు సమాచారం అందించారు. ఎల్బీనగర్ పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని, చిన్నారి మృతదేహాన్ని నీటి నుంచి బయటకు తీశారు. అనంతరం పోస్టుమార్టం పరీక్షల నిమిత్తం ఉస్మానియా జనరల్ ఆసుపత్రి మార్చురీకి తరలించారు.
కన్నీరుమున్నీరైన తండ్రి….
విషయం తెలిసిన వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న తండ్రి రవీందర్ రెడ్డి… తన కుమార్తె నిశ్చేష్టగా పడివున్న మృతదేహాన్ని చూసి కన్నీరుమున్నీరుగా విలపించాడు. కన్నతల్లే ఇలాంటి దారుణానికి ఒడిగడుతుందని ఊహించలేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు.
పోలీసులు నిందితురాలు రాజేశ్వరిని అదుపులోకి తీసుకుని హత్య కేసు నమోదు చేశారు. కేవలం కుటుంబ కలహాలు, తాగుడు మత్తులోనే ఈ హత్య చేసిందా లేదా దీని వెనుక ఇతర కారణాలు ఏదైనా ఉన్నాయా అనే కోణంలో పోలీసులు లోతుగా విచారణ జరుపుతున్నారు.
ABOUT THE AUTHORMaheshwaram Mahendra Charyమహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్టీ ఇన్స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More

E-Paper

