హైదరాబాద్ లోని నాంపల్లిలోని ఫర్నిచర్ గోడౌన్ లో శనివారం మంటలు చెలరేగడంతో జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం (ఎన్డీఆర్ఎఫ్) సహాయక చర్యల్లో చేరింది. భవనంలోకి చిక్కిపోయిన వారి కోసం రెస్క్యూ కొనసాగుతోంది.
హైదరాబాద్ లోని నాంపల్లిలోని ఫర్నిచర్ గోడౌన్ లో శనివారం భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. అగ్నిప్రమాద శాఖ సిబ్బంది ఐదారు గంటల పాటు శ్రమించినప్పటికీ… మంటల తీవ్రతతో సహాయక చర్యలకు ఆటంకం ఏర్పడింది. వీరికితోడుగా జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం (ఎన్డీఆర్ఎఫ్) కూడా సహాయక చర్యల్లో చేరింది.
సహాయక చర్యలు
"భవనం లోపల ముగ్గురు నుంచి నలుగురు వ్యక్తులు ఉన్నారని మేము అనుమానిస్తున్నాము. వారిని రక్షించేందుకు ప్రయత్నిస్తున్నాం' అని హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ తెలిపారు.
మధ్యాహ్నం 12.30 గంటల సమయంలో ఫర్నిచర్ గోడౌన్ వద్ద మంటలు చెలరేగాయి. భవనంలో చిక్కుకున్న వారిని రక్షించేందుకు ఎన్డీఆర్ఎఫ్ తో పాటు అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యల్లో పాల్గొన్నాయి. ఫైర్ డీజీ విక్రమ్ సింగ్ మాన్ ఘటనాస్థలానికి చేరుకొని పరిస్థితిని పర్యవేక్షించారు. నగర సీపీ సజ్జనార్ కూడా ఘటనాస్థలిని సందర్శించారు.
మరోవైపు గంటలు గడిచే కొద్దీ బాధిత కుటుంబాల్లో ఆందోళన నెలకొంది. వాచ్ మెన్ కుటుంబం కన్నీరుమున్నీరుగా విలపిస్తోంది. భవనం లోపల వాచ్మెన్ కుమారులు అఖిల్ (7), ప్రణీత్ (11) చిక్కుకున్నారు.
నాంపల్లి స్టేషన్ రోడ్ ఫర్నిచర్ మాల్ లో జరిగిన అగ్ని ప్రమాదం పై హైదరాబాద్ ఇంచార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ విచారం వ్యక్తం చేశారు.జిల్లా కలెక్టర్,హైదరాబాద్ పోలీస్ కమిషనర్ లతో ఫోన్ లో మాట్లాడారు. ఘటనకు సంబంధించిన కారణాలు అడిగి తెలుసుకున్నారు. మంటలు విస్తరించకుండా పక్క భవనాలు ఖాళీ చేసేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.