ప్రమాదకర బ్యారేజీల జాబితాలో మేడిగడ్డ..!
మేడిగడ్డపై కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ కీలక ప్రకటన చేసింది. అత్యంత ప్రమాదకర బ్యారేజీల జాబితాలో మేడిగడ్డ ఉందని పేర్కొంది. లోక్ సభలో టీడీపీ ఎంపీలు అడిగిన ప్రశ్నకు ఇచ్చిన సమాధానంలో పలు విషయాలను ప్రస్తావించింది.
కాళేశ్వరం ఎత్తిపోతలలోని మేడిగడ్డ(లక్ష్మి) బ్యారేజీలో అత్యంత తీవ్ర (కేటగిరి-1) లోపాలున్నాయని కేంద్ర ప్రభుత్వం… లోక్ సభలో వెల్లడించింది. డ్యామ్ సేఫ్టీ అథారిటీ నివేదికను లోక్సభలో విడుదల చేసింది. పలువురు సభ్యులు అడిగిన ప్రశ్నలకు జవాబునిస్తూ… కేంద్ర జలమంత్రిత్వశాఖ ఈ సమాచారం అందజేసింది.

జాతీయ ఆనకట్టల భద్రతా పర్యవేక్షణ సంస్థ(ఎన్డీఎస్ఏ) రూపొందించిన స్పెసిఫైడ్ డ్యామ్స్ జాతీయ రిజిస్టర్(ఎన్ఆర్ఎస్డీ) 2025లో 50 ఏళ్లు దాటిన 1681 డ్యాంలను నమోదు చేసినట్లు పేర్కొన్నారు. రాష్ట్రాల భాగస్వామ్యంతో చేపట్టిన అధ్యయనానికి సంబంధించిన వివరాలను అధ్యయనం చేసిన తర్వాత…. NDSA మేడిగడ్డను కేటగిరీ I - కింద పరిగణించినట్లు వివరించింది. పరిష్కరించని లోపాలు వైఫల్యానికి దారితీయవచ్చని హెచ్చరించినట్లు తెలిపింది.
దేశవ్యాప్తంగా మూడు డ్యామ్ లు ప్రమాదకరస్థితిలో ఉండగా.. మొదటి స్థానంలో మేడిగడ్డ ఉంది. ఆ తర్వాతి స్థానాల్లో ఉత్తర్ ప్రదేశ్లోని లోయర్ ఖజూరీ డ్యాం, ఝార్ఖండ్లోని బొకారో బ్యారేజీలు ఉన్నాయని పేర్కొంది.
మేడిగడ్డ బ్యారేజీలో 2023 అక్టోబర్లో కొన్ని లోపాలు బయటపడ్డాయి. బ్యారేజీలోని బ్లాక్ 7ను పూర్తిగా తొలగించి పునర్నిర్మించాలని…. అదనపు పరిష్కార చర్యలను చేపట్టాలని NDSA సిఫార్సు చేసిన సంగతి తెలిసిందే. సుందిళ్ల, అన్నారం బ్యారేజీల విషయంలో పలు సూచనలను పేర్కొంది.
50 సంవత్సరాల కంటే పాత ఆనకట్టల భద్రతపై టీడీపీ ఎంపీలు జి. లక్ష్మీనారాయణ, బైరెడ్డి శబరి లేవనెత్తిన ప్రశ్నలకు సమాధానంగా గురువారం లోక్సభలో కేంద్ర జలశక్తి సహాయ మంత్రి రాజ్ భూషణ్ చౌదరి లిఖితపూర్వకంగా ఇచ్చిన సమాధానంలో ఈ వివరాలను వెల్లడించారు.
దేశంలోని పాత డ్యాంల పరిరక్షణ చర్యలకు కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. డ్యామ్ సేఫ్టీ చట్టాన్ని అనుసరించి… కేంద్రం రాష్ట్రాల భాగస్వామ్యంతో ఆనకట్టల భద్రత, నిర్వహణ విషయంలో పలు కార్యక్రమాలు చేపడుతోంది. గతేడాది వర్షాకాలానికి ముందు, ఆ తర్వాత పలు డ్యాంలకు సంబంధించి పరిశీలన పూర్తిచేసి రాష్ట్రాలు కేంద్రానికి నివేదిక సమర్పించాయి. ఈ నివేదికలను పరిశీలించిన కేంద్రం…. డ్యామ్ లను 3 విభాగాలుగా విభజించింది. మొదటి కేటగిరీలో అత్యంత తీవ్రమైన లోపాలు ఉన్న వాటి వివరాలు వెల్లడించింది. రెండో కేటగిరీలో భారీ లోపాలున్నవి…. 3వ కేటగిరీలో చిన్నచిన్న లోపాలు ఉన్న వాటి వివరాలను ప్రస్తావించింది.
మరోవైపు మేడిగడ్డ లోపాలను రిపేర్ చేయటానికి తెలంగాణ ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఇప్పటికే కన్సల్టెంట్ను ఖరారు చేసే ప్రక్రియలో ఉంది. ఒప్పందం ప్రకారం మేడిగడ్డ బ్యారేజి ఇన్వెస్టిగేషన్స్, మరమ్మతు పనులు చేయాల్సిందేనని.. ఈ మేరకు కార్యాచరణకు దిగకపోతే నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవాల్సి ఉంటుందంటూ కూడా నిర్మాణ సంస్థకు స్పష్టం చేసింది.
ABOUT THE AUTHORMaheshwaram Mahendra Charyమహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్టీ ఇన్స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More

E-Paper

