ఆసిఫాబాద్ జిల్లాలో అమానుషమైన ఘటన వెలుగు చూసింది. తన కుమారుడిని కులాంతర వివాహం చేసుకుందన్న కోపంతో మామ అత్యంత దారుణానికి ఒడిగట్టాడు. నిండి గర్భిణీ(9 నెలలు)గా ఉన్న కోడలిని గొడ్డలితో నరికి చంపాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ప్రాథమిక వివరాల ప్రకారం…దహెగాం మండలం గెర్రె గ్రామానికి చెందిన శేఖర్ అనే వ్యక్తి… ఇదే గ్రామానికి చెందిన ఎస్టీ యువతి(20)ని ఏడాది కిందట ప్రేమ పెళ్లి చేసుకున్నాడు. వీరి పెళ్లి విషయంపై శేఖర్ తల్లిదండ్రులు ఆగ్రహంతో ఉన్నారు. అంతేకాదు కొడుకు, కోడలిని ఇంటికి రావొద్దని చెప్పారు. దీంతో శేఖర్ దంపతులు… అత్తగారి ఇంటి వద్దనే ఉంటున్నారు.
ఈ క్రమంలోనే శనివారం రోజు శేఖర్… అత్త, మామ కుటుంబంతో కలిసి వంట చెరుకు కోసం బయటికి వెళ్లారు. సరిగ్గా ఇదే సమయంలో శేఖర్ తండ్రి అయిన సత్తయ్య…. కోడలి ఇంటికి వెళ్లాడు. గొడ్డలితో ఆమెపై దాడికి దిగాడు. నిండు గర్భిణీగా ఉన్న ఆమె… బయటికి పరుగులు తీసినప్పటికీ మామా…బలంగా నరికాడు. దీంతో కోడలు ప్రాణాలు కోల్పోయింది. ఇంతలోనే సత్తయ్య అక్కడ్నుంచి పారిపోయాడు.
మృతురాలి తండ్రి ఫిర్యాదు మేరకు మామ సత్తయ్యతో పాటు వారి కుటుంబ సభ్యులపై కేసు నమోదు చేశారు. హత్య చేసిన సత్తయ్య పోలీసుల అదుపులోకి తీసుకున్నారు.
ఈ ఘటనపై పోలీసులు స్పందిస్తూ… విచారణ కొనసాగిస్తున్నామని తెలిపారు. ప్రాథమిక దర్యాప్తు ఆధారంగా… కులాంతర వివాహం విషయంలోనే అభ్యంతరాలు ఉన్నట్లు తెలిసిందని పేర్కొన్నారు. పూర్తిస్థాయి దర్యాప్తు చేస్తామని వెల్లడించారు.