Hyderabad : నకిలీ ఆధార్, పెళ్లి సర్టిఫికెట్లతో ఘరానా మోసం - షాదీ ముబారక్’ నిధులు స్వాహా..!ఆర్ఐ సహా ఆరుగురు అరెస్టు
Shaadi Mubarak Scheme Fraud : తెలంగాణ ప్రభుత్వ ప్రతిష్టాత్మక పథకం 'షాదీ ముబారక్' పేరుతో నకిలీ పత్రాలు సృష్టించి ప్రభుత్వ సొమ్మును కాజేస్తున్న ఆరుగురు ముఠా సభ్యులను అత్తాపూర్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఇందులో ఓ ప్రభుత్వ అధికారి కూడా ఉండటం గమనార్హం.
హైదరాబాద్లో ప్రభుత్వ సంక్షేమ పథకాలను ఆసరాగా చేసుకుని భారీ మోసానికి పాల్పడుతున్న ఒక అంతర్రాష్ట్ర ముఠా గుట్టును పోలీసులు రట్టు చేశారు. పేద ముస్లిం యువతుల పెళ్లిళ్లకు ఆర్థిక సాయం అందించే తెలంగాణ ప్రభుత్వ ప్రతిష్టాత్మక పథకం 'షాదీ ముబారక్' ను టార్గెట్ చేసి, నకిలీ పత్రాలతో లక్షల రూపాయల ప్రభుత్వ సొమ్మును స్వాహా చేసిన ఆరుగురు నిందితులను హైదరాబాద్ పోలీసులు శనివారం అరెస్ట్ చేశారు.

రెడ్ హ్యాండెడ్గా దొరికిన ముఠా
పోలీసుల సమాచారం ప్రకారం.. హసన్ నగర్లోని ఫాతిమా కాలనీలో మహ్మద్ ఎతెమాద్ అనే వ్యక్తి తన అనుచరులతో కలిసి షాదీ ముబారక్ పథకానికి సంబంధించి నకిలీ దరఖాస్తులు, ఫోర్జరీ పత్రాలు సృష్టిస్తున్నాడనే నమ్మదగిన సమాచారం జూన్ 12న పోలీసులకు అందింది. ఈ పత్రాలను బండ్లగూడ తాసిల్దార్ కార్యాలయంలో సమర్పించి ప్రభుత్వ నిధులను తమ బ్యాంక్ ఖాతాల్లోకి మళ్లించుకుంటున్నట్లు తేలింది.
రాజేంద్రనగర్ డివిజన్ ఏసీపీ ఆదేశాల మేరకు.. సబ్ ఇన్స్పెక్టర్ టి. జయరాజ్ తన సిబ్బంది, స్వతంత్ర సాక్షులతో కలిసి నిందితుడు మహ్మద్ ఎతెమాద్ నివాసంలో సోదాలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో నకిలీ పత్రాల తయారీకి ఉపయోగిస్తున్న ల్యాప్టాప్లు, సీపీయూలు, మొబైల్ ఫోన్లు మరియు పెద్ద ఎత్తున ఫోర్జరీ దరఖాస్తు పత్రాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
ఫోటోషాప్లో నకిలీ ఆధార్, పెళ్లి సర్టిఫికెట్లు!
పోలీసుల విచారణలో షాకింగ్ నిజాలు బయటికొచ్చాయి. ప్రధాన నిందితుడు మహ్మద్ ఎతెమాద్ పెయింట్, అడోబ్ ఫోటోషాప్ సాఫ్ట్వేర్లను ఉపయోగించి వివాహ ఫోటోలు, ఐడెంటిటీ వివరాలు, పెళ్లి పత్రికలు, వివాహ ధృవీకరణ పత్రాలను డిజిటల్గా మార్ఫింగ్ చేసి నకిలీ రికార్డులను సృష్టించేవాడు.
మరో నిందితుడు మహ్మద్ అక్బర్ ఈ నకిలీ దరఖాస్తులను సేకరించి, బండ్లగూడ తాసిల్దార్ కార్యాలయంలో స్పెషల్ రెవెన్యూ ఇన్స్పెక్టర్ గా పనిచేస్తున్న ధరావత్ అశోక్ కిరణ్ సహాయంతో ఎటువంటి క్షేత్రస్థాయి పరిశీలన (Field Verification) లేకుండానే నేరుగా ఆమోదించేలా చూసేవాడు. మిగిలిన నిందితులు ముషారఫ్, సర్ఫరాజ్, జాఫర్లు నకిలీ లబ్ధిదారులను గుర్తించడం, దొంగ బ్యాంక్ ఖాతాలు, కరెంట్ బిల్లులు సమకూర్చడం వంటి పనులు చేస్తూ, వచ్చిన డబ్బును అందరూ పంచుకునేవారని విచారణలో తేలింది.
రూ. 21 లక్షల ప్రభుత్వ సొమ్ము స్వాహా!
ఈ ముఠా ఇప్పటివరకు దాదాపు రూ. 21 లక్షల ప్రభుత్వ సొమ్మును షాదీ ముబారక్ పథకం ద్వారా అక్రమంగా కాజేసి ప్రభుత్వానికి పెద్ద ఎత్తున కన్నం వేసినట్లు పోలీసులు గుర్తించారు. నిందితుల నుంచి స్వాధీనం చేసుకున్న ఎలక్ట్రానిక్ వస్తువులు, పత్రాలను సీజ్ చేసి పంచనామా నిర్వహించారు.
ఈ ఘరానా మోసానికి సంబంధించి హైదరాబాద్లోని అత్తాపూర్ పోలీస్ స్టేషన్లో భారతీయ న్యాయ సంహిత (BNS) కింద కేసు నమోదు చేశారు. అరెస్ట్ అయిన ఆరుగురు నిందితులను కోర్టులో ప్రవేశపెట్టారు.
- అరెస్ట్ అయిన నిందితుల వివరాలు:
- మహ్మద్ ఎతెమాద్ ఉల్ హక్ (25)
- మహ్మద్ అక్బర్ (20)
- సయ్యద్ ముషారఫ్ ఉద్దీన్ (23)
- మహ్మద్ సర్ఫరాజ్ (26)
- మహ్మద్ జాఫర్ (23)
- ధరావత్ అశోక్ కిరణ్ (32) - స్పెషల్ రెవెన్యూ ఇన్స్పెక్టర్ (RI)
ప్రభుత్వ సంక్షేమ పథకాల లబ్ధి కోసం ఎవరికీ దళారులకు డబ్బులు ఇవ్వవద్దని పోలీసులు ప్రజలకు స్పష్టం చేశారు. ఎవరైనా ఇలాంటి మోసపూరిత డిమాండ్లు చేస్తే వెంటనే సమీపంలోని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయాలని కోరారు.
ABOUT THE AUTHORMaheshwaram Mahendra Charyమహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్టీ ఇన్స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More

E-Paper

