సింగరేణి కార్మికులకు తెలంగాణ ప్రభుత్వం దీపావళి బోనస్ ప్రకటించింది. బోనస్ కింద రూ.400 కోట్లు విడుదల చేస్తున్నట్టు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ప్రకటించారు. ప్రతి కార్మికుని ఖాతాలో శనివారం రూ. 1.03 లక్షలు జమ అవుతాయని వెల్లడించారు. బోనస్ ప్రకటించడంపై సింగరేణి ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

మొత్తం 39,500 మంది కార్మికులు లబ్ధిదారులు ఉన్నారని సింగరేణి యాజమాన్యం ఓ ప్రకటన ద్వారా వెల్లడించింది. ఒక్కో కార్మికుడికి బోనస్ కింద రూ. 1.03 లక్షలు జమవుతాయని పేర్కొంది. ఈ నెల 18వ తేదీన (శనివారం) చెల్లిస్తామని వెల్లడించింది. ఈ మేరకు యాజమాన్యం సర్క్యులర్ విడుదల చేసింది.
బొగ్గు గనుల్లో పని చేసే కార్మికులకు ఇంత పెద్ద మొత్తంలో బోనస్ లభించడం ఇదే మొదటిసారి అని గణాంకాలు సూచిస్తున్నాయి. 2010- 2011 ఆర్థిక సంవత్సరంలో 21 వేలుగా ఉన్నటువంటి బోనస్ క్రమంగా పెరుగుతూ వచ్చింది. ఈసారి ఏకంగా లక్ష రూపాయల మార్కును దాటింది. దేశంలో పని చేస్తున్న ఇతర కార్మికులకు ఈపిఎల్ఆర్ బోనస్ సెప్టెంబర్ లోనే అందగా…. సింగరేణిలో పనిచేసే కార్మికులకు మాత్రం ఇప్పుడు అందుతుంది.
ఇక ఇటీవలనే దసరా పండుగను పురస్కరించుని కూడా సింగరేణి కార్మికులకు తెలంగాణ ప్రభుత్వం బోనస్ ప్రకటించింది. లాభాల్లో 34 శాతం పంచుతున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు ఒక్కో కార్మికుడికి బోనస్గా రూ.1,95,610 జమచేసింది. మొత్తం 71 వేల మందికి లబ్ధి చేకూరింది. బోనస్ ప్రకటనపై సింగరేణి కార్మికులతో పాటు వారి కుటుంబాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి.