తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా ఎంపికైన గ్రూప్-2 అభ్యర్థులకు ముఖ్యమైన అప్డేట్ వచ్చేసింది. ఈనెల 18 వ తేదీన సీఎం శ్రీ రేవంత్ రెడ్డి చేతుల మీదుగా నియామక పత్రాలు అందించనున్నారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణారావు వెల్లడించారు. శిల్పకళా వేదికలో నిర్వహించనున్న ఈ కార్యక్రమం ఏర్పాట్లపై సంబంధిత ఉన్నతాధికారులతో డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో మంగళవారం ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు.
783 మందికి నియామకపత్రాలు…

టీజీపీఎస్సీ గ్రూప్ 2 ద్వారా ఎంపికైన 783 మంది అభ్యర్థులకు సీఎం నియామక పత్రాలు అందిస్తారని సీఎస్ తెలిపారు. వీరిలో దాదాపు 16 శాఖలకు చెందిన అభ్యర్థులు ఉన్నారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర మంత్రులందరినీ ఆహ్వానిస్తున్నట్లు సీఎస్ వివరించారు. ఎంపికైన అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలన కార్యక్రమం త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమానికి అభ్యర్థితో పాటు వారి కుటుంబ సభ్యులను సాయంత్రం 4 గంటలలోపు శిల్పకళా వేదికలో అనుమతించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.
ఈ నియామకాల్లో అత్యధికంగా, సాధారణ పరిపాలన, రెవెన్యూ, వాణిజ్య పన్నుల శాఖ, ఎక్సైజ్ శాఖ, పంచాయతీరాజ్ శాఖలకు చెందిన వారే అధికంగా ఉన్నారు. రెవెన్యూ, హోం, జిఎడి కార్యదర్శులు ఈ కార్యక్రమ నిర్వహణలో సమన్వయంతో ఏర్పాట్లు పూర్తి చేయాలని సీఎస్ రామకృష్ణారావు ఆదేశించారు. నియామక పత్రాలు పొందే అభ్యర్థులు రాబోయే 30 సంవత్సరాలలో సర్వీస్ లో ఉంటారని… కాబట్టి వీరికి ప్రభుత్వ సర్వీస్ పట్ల ఉన్నత భావన కలిగేలా కార్యక్రమాన్ని నిర్వహించాలన్నారు. అందుకు తగు ఏర్పాట్లు చేయాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు.