తెలంగాణ సర్కార్ శుభవార్త - ప్రభుత్వ ఉద్యోగులకు రూ.1.02 కోట్ల ప్రమాద బీమా
సంక్రాంతి పండగ వేళ ప్రభుత్వ ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్తను చెప్పింది. పర్మినెంట్ ఉద్యోగులకు రూ.1.02 కోట్ల ప్రమాద బీమాను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ మేరకు రాష్ట్ర డిప్యూటీ సీఎం, ఆర్థికమంత్రి భట్టి విక్రమార్క ఓ ప్రకటన విడుదల చేశారు.
రాష్ట్రంలోని రెగ్యులర్ ప్రభుత్వ ఉద్యోగులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. రూ.1.02 కోట్ల ప్రమాద బీమాను అందుబాటులోకి తీసుకొస్తువస్తున్నట్లు ప్రకటించింది. ఇందుకు సంబంధించిన వివరాలను రాష్ట్ర డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఓ ప్రకటన ద్వారా వెల్లడించారు.
ప్రభుత్వ ఉద్యోగులకు ప్రమాద బీమా
రూ. 1.02 కోట్ల ప్రమాదం బీమా…
“రాష్ట్ర ప్రభుత్వ రెగ్యులర్ ఉద్యోగులందరికీ రూ. 1.02 కోట్ల ప్రమాద బీమా సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకువస్తున్నాం. రూ. 1.02 కోట్ల ప్రమాద బీమా అమలు ప్రక్రియను ముందుకు తీసుకెళ్లేందుకు రాష్ట్రంలోని ప్రముఖ బ్యాంకర్లతో నిర్వహించిన సంప్రదింపులు విజయవంతమయ్యాయి. ప్రభుత్వం చేపడుతున్న అనేక సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ఇంటింటికి చేర్చే ప్రభుత్వ ఉద్యోగులను మా కుటుంబ సభ్యులుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రజా ప్రభుత్వం భావిస్తోంది” అని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు.
ప్రభుత్వ ఉద్యోగుల సంక్షేమమే లక్ష్యంగా తమ ప్రభుత్వం పని చేస్తోందని భట్టి విక్రమార్క పేర్కొన్నారు. ఎన్నో ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ, గత ప్రభుత్వంలో ఏర్పడిన బకాయిలను సైతం ప్రతి నెల క్రమం తప్పకుండా దశలవారీగా విడుదల చేస్తూ వస్తున్నామని వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో 5.14 లక్షల మంది రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల కుటుంబాలకు ప్రయోజనం చేకూరనుందని పేర్కొన్నారు.
ఇప్పటివరకు 38 వేల మంది సింగరేణి ఉద్యోగులకు బీమా అందుతోంది. ట్రాన్స్ స్కో, ఎస్పీడీసీఎల్, ఎన్పీడీసీఎల్, జెన్కో లకు చెందిన 71,387 మంది ఉద్యోగులకు కూడా ఈ స్కీమ్ వర్తిస్తోంది. అయితే ఈ ప్రమాద బీమా కేవలం రెగ్యూలర్ ప్రభుత్వ ఉద్యోగులకు మాత్రమే వర్తిస్తుందని సర్కార్ స్పష్టం చేసింది.