పంచాయతీ ఎన్నికలపై స్టే విధించేందుకు రాష్ట్ర హైకోర్టు నిరాకరించింది. రిజర్వేషన్ల కోసం ప్రభుత్వం జారీ చేసిన జీవో 46పై అభ్యంతరంపై వ్యక్తం చేస్తూ పలు బీసీ సంఘాలు హైకోర్టును ఆశ్రయించాయి. అత్యంత వెనుకబడిన కులాలకు రిజర్వేషన్లు కేటాయించాలని పిటిషన్ లో ప్రస్తావించాయి. దీనిపై విచారించిన హైకోర్టు…. ప్రస్తుత దశలో స్టే విధించలేమని స్పష్టం చేసింది.
ఈ దశలో స్టే ఇవ్వలేం….

ఇప్పటికే ఎన్నికల ప్రక్రియ మొదలైందని… ఇలాంటి దశలో స్టే ఇవ్వలేమని ధర్మాసనం పేర్కొంది. ఎన్నికల నోటిఫికేషన్ విడుదలయ్యాక ఎందుకు సవాల్ చేస్తున్నారని ప్రశ్నించింది. ఇరువైపు వాదనలు విన్న కోర్టు…. కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. విచారణను 8 వారాలకు వాయిదా వేసింది.
పంచాయతీ ఎన్నికల్లో రిజర్వేషన్లను కేటాయిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నవంబర్ 22వ తేదీన జీవో 46ను జారీ చేసింది. ఈ జీవోను సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి.జనాభా గణాంకాలు లేకుండా రిజర్వేషన్లు కేటాయించారని…. ఏ ప్రాతిపదికన ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లు కేటాయించరన్నదానిపై స్పష్టత లేదని పేర్కొన్నారు.
బీసీ జనాభాకు సంబంధించి ప్రత్యేక కమిషన్ సమర్పించిన వివరాలను వెల్లడించలేదని పిటిషన్ లో ప్రస్తావించారు. బీసీల్లో ఏ, బీ, సీ, డీ వర్గీకరణ చేపట్టకపోవడంతో రిజర్వేషన్లు తగ్గాయని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. జీవో 46 అమలును నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని కోరారు. ఈ పిటిషన్ పై గురువారం విచారించిన కోర్టు… శుక్రవారం కూడా వాదనలు వినింది. ఇరువైపు వాదనలు విన్న తర్వాత…స్టే ఇచ్చేందుకు నిరాకరించింది.
ఉన్నత న్యాయస్థానం స్టే ఇవ్వకపోవటంతో…. ఎన్నికల ప్రక్రియకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా ముందుకు సాగనున్నాయి. ఎన్నికల కమిషన్ నిర్దేశించిన తేదీల్లోనే ఎన్నికలు జరగనున్నాయి. ఈసీ ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం… డిసెంబర్ 11,14, 17 తేదీల్లో పోలింగ్ జరగనుంది. ప్రస్తుతం మొదటి విడత నామినేషన్లు కొనసాగుతున్నాయి.