TG Muncipal Polling Live Updates : తెలంగాణలో ముగిసిన మున్సిపల్‌ ఎన్నికల పోలింగ్‌

రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ జరిగింది. ఉదయం 7 గంటలకు ప్రారంభం కాగా.. సాయంత్రం 5 గంటలకు ముగిసింది. కొన్నిచోట్ల సాంకేతిక సమస్యలు రాగా.. మరికొన్ని చోట్ల ప్రశాంతంగా పోలింగ్ జరుగుతోంది. లైవ్ అప్డేట్స్ ఇక్కడ తెలుసుకోండి….

Summary

తెలంగాణలో ముగిసిన మున్సిపల్‌ ఎన్నికల పోలింగ్‌

మున్సిపల్ ఎన్నికల పోలింగ్
మున్సిపల్ ఎన్నికల పోలింగ్

తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ జరిగింది. సాయంత్రం 5 గంటలతో పోలింగ్ ముగిసింది. ఫిబ్రవరి 13వ తేదీన ఓట్ల లెక్కింపు ఉంటుంది.

...Read More

Follow all the updates here:
Feb 11, 2026, 17:24:32 IST

తెలంగాణలో ముగిసిన మున్సిపల్‌ ఎన్నికల పోలింగ్‌

తెలంగాణలో మున్సిపల్‌ ఎన్నికల పోలింగ్‌ ముగిసింది. సా.5 గంటల్లోపు క్యూలో ఉన్నవారికి ఓటువేసే అవకాశం ఉంది. 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లలో పోలింగ్‌ జరిగింది. ఫిబ్రవరి 13వ తేదీన 136 కేంద్రాల్లో ఓట్ల లెక్కింపు జరగనుంది.

Feb 11, 2026, 17:23:36 IST

Feb 11, 2026, 17:16:37 IST

నిజామాబాద్‌లో ఎంపీ ధర్మపురి అర్వింద్ హల్‌చల్

నిజామాబాద్‌లో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ సందర్భంగా బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ కీలక వ్యాఖ్యలు చేశారు. పోలీసులకు ఎంపీ ధర్మపురి అర్వింద్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. పోలింగ్ కేంద్రం నుంచి బీజేపీ అభ్యర్థిని బయటకు పంపారంటూ ఎంపీకి కార్యకర్తలు సమాచారం ఇచ్చారు. వెంటనే పోలింగ్‌ కేంద్రానికి చేరుకున్న అర్వింద్ అక్కడి ఎన్నికల సిబ్బంది, పోలీసులపై ఫైర్ అయ్యారు.

Feb 11, 2026, 16:26:54 IST

చెదురుమదురు ఘటనలు తప్ప ఎలాంటి సమస్యలు లేవు : ఎస్ఈసీ

మున్సిపల్ ఎన్నికల పోలింగ్‌ మందకొడిగా సాగుతోందని ఎస్‌ఈసీ రాణికుముదిని చెప్పారు. వందశాతం వెబ్‌ కాస్టింగ్‌తో పోలింగ్‌ జరుగుతోందని తెలిపారు. సాయంత్రానికి పోలింగ్‌ శాతం పెరుగుతుందని ఆశిస్తున్నట్టు పేర్కొన్నారు. ఓటర్లు అందరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు. చెదురుమదురు ఘటనలు తప్ప ఎలాంటి సమస్యలు లేవని రాణికుముదిని చెప్పారు.

Feb 11, 2026, 14:20:49 IST

మధ్యాహ్నం 1 వరకు 48.54 శాతం పోలింగ్ నమోదు

మున్సిపల్ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. మధ్యాహ్నం 1 వరకు 48.54 శాతం పోలింగ్ నమోదైంది.

Feb 11, 2026, 13:13:22 IST

ఈనెల 13న కౌంటింగ్

సాయంత్రం 5 గంటలతో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ముగుస్తుంది. ఈ సమయంలోపు క్యూ లైన్లలో నిలబడిన వారికి ఓటు వేసేందుకు అవకాశం ఉంటుంది. ఇందుకు సంబంధించిన ఓట్ల లెక్కింపు ఫిబ్రవరి 13వ తేదీన ఉంటుంది.

Feb 11, 2026, 13:08:14 IST

ఓటు హక్కు వినియోగించుకోండి - మంత్రి పొన్నం

పోలింగ్ రోజు ప్రతి ఓటరు తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని మంత్రి పొన్నం కోరారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రజా ప్రతినిధులను ఏ విధంగా ఎన్నుకుంటున్నారో అర్బన్ ప్రాంతాల అభివృద్ధికి పట్టణ ఓటర్లు తమ విచక్షణ తో ఓటు హక్కు వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు.

Feb 11, 2026, 12:34:27 IST

ఓటేసిన పలువురు ప్రముఖులు

మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా పలవురు ప్రముఖులు వారి ఓటు హక్కును వినియోగించుకున్నారు. సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో పాటు పలువురు మంత్రులు… ఆయా మున్సిపాలిటిల్లో ఓటు వేశారు.

Feb 11, 2026, 12:05:40 IST

బోధనలో ఘర్షణ వాతావరణం

బోధన్ పట్టణంలో ఘర్షణ వాతావరణం నెలకొంది. ఎంఐఎం, బీఆర్‌ఎస్ కార్యకర్తలు పరస్పరం నినాదాలు చేస్తూ ఉద్రిక్త వాతావరణం సృష్టించారు. పోలీసులు వెంటనే జోక్యం చేసుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు.

Feb 11, 2026, 12:03:35 IST

ఎల్లారెడ్డిలో ఉద్రిక్తత

కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మున్సిపల్ ఎన్నికల్లో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది.ఎల్లారెడ్డి పట్టణంలో బీఆర్ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్ ఆందోళన చేపట్టారు. రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు.ఎన్నిక సందర్భంగా కాంగ్రెస్ పార్టీకి పోలీసులు వత్తాసు పలుకుతున్నారని జాజాల సురేందర్ ఆరోపించారు.

Feb 11, 2026, 12:02:29 IST

కొన్నిచోట్ల ఉద్రిక్తతలు…

రాష్ట్రంలో ప్రశాంతంగా మున్సిపల్ ఎన్నికల పోలింగ్ జరుగుతోంది. కొన్నిచోట్ల ఘర్షణపూరితమైన ఘటనలు చోటు చేసుకున్నాయి. పోలీసుల రంగప్రవేశంతో సద్దుమణుగుతున్నాయి.

Feb 11, 2026, 11:34:10 IST

ఓటు హక్కును వినియోగించుకోండి - సీఎం రేవంత్

“ప్రజాస్వామ్య సౌధానికి పునాది ఓటు. మున్సిపల్ ఎన్నికల పోలింగ్ సందర్భంగా ఈ రోజు కొడంగల్ లో నా ఓటు హక్కును వినియోగించుకున్నాను. ప్రతి ఒక్కరు ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరుతున్నాను” అని సీఎం రేవంత్ రెడ్డి ట్వీట్ చేశారు.

Feb 11, 2026, 11:02:37 IST

ఓటు వేసిన సీఎం రేవంత్

మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా కొడంగల్‌లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన ఓటు హక్కు వినియోగించుకున్నారు.

Feb 11, 2026, 10:33:42 IST

నర్సాపూర్ లో ఉద్రిక్తత

నర్సాపూర్ మున్సిపాలిటీ 15వ వార్డులో ఉద్రిక్తత నెలకొంది. బీఆర్ఎస్, బీజేపీ కార్యకర్తల మధ్య ఘర్షణ చోటు చేసుకోగా.. చొక్కాలు పట్టుకుని కొట్టుకున్నారు. ఇరు పార్టీల కార్యకర్తలను పోలీసులు చెదరగొట్టారు.

Feb 11, 2026, 09:46:12 IST

గుర్తులు తారుమారు - నిలిచిన పోలింగ్

మహబూబ్‌నగర్ 45వ డివిజన్ 5వ బూత్‌లో దాదాపు 20 నిమిషాల పాటు పోలింగ్ నిలిచింది. బ్యాలెట్ పేపర్‌పై అభ్యర్ధులకు కేటాయించిన గుర్తులు తారుమారు అవడంతో నిలిచిపోయింది. రంగంలోకి దిగి అభ్యర్థులతో చర్చించిన అధికారులు… ఓటింగ్ ప్రక్రియను పునఃప్రారంభించారు.

Feb 11, 2026, 08:41:55 IST

కొనసాగుతున్న పోలింగ్…

రాష్ట్రవ్యాప్తంగా 7 నగరపాలక సంస్థలు, 116 పురపాలక సంఘాల్లో పోలింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. ఇందులో 412 డివిజన్లు, 2569 వార్డులున్నాయి.

Feb 11, 2026, 08:04:35 IST

నిలిచిన పోలింగ్..

మహబూబ్‌నగర్ లోని 45వ డివిజన్ 5వ బూత్‌లో పోలింగ్ నిలిచింది. సింబల్స్ తారుమారు కావడంతో బ్రేక్ పడింది. పోలింగ్ కేంద్రం వద్ద అభ్యర్థుల ఆందోళనకు దిగారు.

Feb 11, 2026, 08:03:48 IST

హెల్ప్ లైన్ నెంబర్

ఎన్నికల సంఘం రూపొందించిన టీ- పోల్‌(Tpoll) యాప్‌లోకి వెళ్లి ఓటర్‌ గుర్తింపు కార్డు(ఎపిక్‌) నంబరు సాయంతో స్లిప్పులను డౌన్లోడ్ చేసుకోవచ్చు. అంతేకాకుండా ఓటర్ల సహాయం కోసం 92400 21456 నంబరుతో కాల్‌ సెంటర్‌ ఏర్పాటు చేశారు.

Feb 11, 2026, 08:03:28 IST

భారీ బందోబస్తు

ఈ ఎన్నికల కోసం 25,000 మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. రాష్ట్రవ్యాప్తంగా 1900 సమస్యాత్మక, 1400 అత్యంత సమస్యాత్మకంగా పోలింగ్ కేంద్రాలను గుర్తించారు. సీసీటీవీ మానిటరింగ్‌తో పటిష్ట నిఘా ఏర్పాటు చేశారు. ఎలాంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటున్నారు. పోలింగ్‌ ప్రాంతాల్లో బీఎన్‌ఎస్‌ఎస్‌ 163 సెక్షన్‌ అమలు చేస్తున్నారు.

Feb 11, 2026, 08:03:07 IST

ప్రమాణస్వీకారం ఏ రోజంటే..?

ఫలితాల వెల్లడి తర్వాత పట్టణ స్థానిక సంస్థల ఎన్నికైన వార్డు సభ్యులు ఫిబ్రవరి 16న ఉదయం 11 గంటలకు ప్రమాణ స్వీకారం చేస్తారు.

Feb 11, 2026, 08:02:53 IST

ఫిబ్రవరి 16న ఛైర్మన్ల ఎన్నిక

ఫిబ్రవరి 16వ తేదీన కార్పొరేషన్ల మేయర్లు, డిప్యూటీ మేయర్లు, మున్సిపాలిటీల ఛైర్‌పర్సన్లు, వైస్‌ ఛైర్‌పర్సన్ల పదవులకు ఎన్నికలు ఉంటాయి. గెలుపొందిన వార్డు సభ్యులు ఓట్లు వేసి ఎన్నుకోవాల్సి ఉంటుంది.

Feb 11, 2026, 08:02:40 IST

13న ఓట్ల లెక్కింపు

ఎక్కడైనా పోలింగ్ ప్రక్రియలో ఇబ్బందులు వస్తే… ఫిబ్రవరి 12వ తేదీన రీపోలింగ్ నిర్వహిస్తారు. ఈ విషయంలో ఈసీదే తుది నిర్ణయం. ఓట్ల లెక్కింపు ప్రక్రియను ఫిబ్రవరి 13వ తేదీన చేపడుతారు.

Feb 11, 2026, 08:02:23 IST

బరిలో 12,993 మంది అభ్యర్థులు..

మొత్తంగా ఈ ఎన్నికల బరిలో 12,993 మంది అభ్యర్థులున్నారు. పోలింగ్ ప్రక్రియ ముగిసిన తర్వాత… ఓటింగ్ శాతం వివరాలను ఎన్నికల సంఘం వెల్లడిస్తుంది.

Feb 11, 2026, 08:02:12 IST

ఓటర్ల లెక్కలు…

ఈ మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా మొత్తం 52.43 లక్షల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. వీరిలో 26.80 లక్షల మంది మహిళా ఓటర్లు, 25.62 లక్షల మంది పురుష ఓటర్లు, ఇతరులలో 640 మంది ఓటర్లు ఉన్నారు. మహిళా ఓటర్ల భాగస్వామ్యం ఎక్కువగా ఉంది.

Feb 11, 2026, 08:01:51 IST

కొనసాగుతున్న పోలింగ్…

రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. ఉదయం 7 గంటలకు ప్రారంభం కాగా.. సాయంత్రం 5 గంటలతో ముగుస్తుంది. కొన్నిచోట్ల సాంకేతిక సమస్యలు రాగా.. మరికొన్ని చోట్ల ప్రశాంతంగా మొదలైంది.

Home Telangana TG Muncipal Polling Live Updates : తెలంగాణలో ముగిసిన మున్సిపల్‌ ఎన్నికల పోలింగ్‌