రాష్ట్రవ్యాప్తంగా చలి తీవ్రత తగ్గింది. గడిచిన రెండు రోజుల పాటు నమోదైన ఉష్ణోగ్రతలను పరిశీలిస్తే… రాష్ట్రవ్యాప్తంగా పగటి ఉష్ణోగ్రతలు పెరిగాయి. భారత వాతావరణ శాఖ (ఐఎండీ) వివరాల ప్రకారం… చాలా ప్రాంతాల్లో పగటి ఉష్ణోగ్రతల నమోదులో గణనీయమైన మార్పులు కనిపించాయి. సాధారణం కంటే 2 నుంచి 5 డిగ్రీల ఉష్ణోగ్రతలు పెరిగాయి.
పెరిగిన ఉష్ణోగ్రతలు….

గత కొద్ది రోజులుగా తెలంగాణ వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు గణనీయంగా పెరిగాయని వాతావరణ శాస్త్రవేత శ్రీనివాసరావు తెలిపారు. చాలా చోట్ల సాధారణం కంటే 2 నుంచి 5 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని పేర్కొన్నారు. తెలంగాణలో శీతలగాలుల పరిస్థితి తగ్గిందన్నారు. గత రెండు రోజులుగా ఉష్ణోగ్రతలు గణనీయంగా పెరిగాయని వివరించారు.
“ ఈశాన్య మరియు ఉత్తర దిశ నుంచి తూర్పు మరియు ఆగ్నేయ దిశకు గాలులు వీయటమే ఈ మార్పునకు కారణం. రాత్రి ఉష్ణోగ్రతలు 4 నుంచి 5 డిగ్రీలు పెరిగాయి. మిగిలిన వారంలో కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణ స్థితిలో ఉండే అవకాశం ఉంది. రానున్న 3-4 రోజుల్లో హైదరాబాద్ నగరంలో ఉష్ణోగ్రతల్లో కూడా మార్పులుండే అవకాశాలు ఉన్నాయి” అని శ్రీనివాసరావు పేర్కొన్నారు.
హైదరాబాద్ వాతావరణ కేంద్రం వివరాల ప్రకారం... రాష్ట్రంలో పూర్తిగా పొడి వాతావరణం ఉండే అవకాశం ఉంది. ఎలాంటి హెచ్చరికలు లేవు. ఈ వారమంతా కూడా ఇదే మాదిరి వాతావరణ పరిస్థితులుంటాయి.