TG EAPCET 2026 Counselling : టీజీ ఈఏపీసెట్ రెండో విడత సీట్ల కేటాయింపు - అలాట్‌మెంట్ లింక్, రిపోర్టింగ్ తేదీలివే

TG EAPCET Second Phase Allotment : తెలంగాణ ఈఏపీసెట్ రెండో విడత కౌన్సెలింగ్ సీట్ల కేటాయింపు ప్రక్రియ ఇవాళ పూర్తి కానుంది. వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకున్న అభ్యర్థులు తమ అలాట్‌మెంట్ వివరాలను https://tgeapcet.nic.in/ వెబ్ సైట్ లో చెక్ చేసుకోవచ్చు.

Published on: Jul 22, 2026, 10:15:38 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

TG EAPCET Second Phase Allotment : తెలంగాణ ఈఏపీసెట్ - 2026 రెండో విడత ఇంజినీరింగ్ కౌన్సెలింగ్ ప్రక్రియ ముగింపు దశకు చేరుకుంది. ఇప్పటికే వెబ్ ఆప్షన్ల ప్రక్రియ పూర్తి కాగా…. విద్యార్థులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సీట్ల కేటాయింపు ఇవాళ(జూలై 22) పూర్తి కానుంది. సీటు పొందిన అభ్యర్థుల వివరాలను అధికారిక పోర్టల్‌లో అందుబాటులో ఉంచుతారు.

టీజీ ఈఏపీసెట్ రెండో విడత కౌన్సెలింగ్ 2026
టీజీ ఈఏపీసెట్ రెండో విడత కౌన్సెలింగ్ 2026

ఈ ఏడాది రెండో విడత కౌన్సెలింగ్‌లో బీటెక్ సీట్ల కోసం విద్యార్థుల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. 60 వేలకుపైగా అభ్యర్థులు వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకున్నారు. కౌన్సెలింగ్ గణాంకాల ప్రకారం విద్యార్థులు ప్రాధాన్య క్రమంలో ఏకంగా 26.55 లక్షల వెబ్ ఆప్షన్లను నమోదు చేశారు. దీనిని బట్టి సగటున ప్రతి అభ్యర్థి దాదాపు 44 కళాశాలలు లేదా కోర్సుల ఐచ్ఛికాలను ఆప్షన్లుగా ఎంచుకున్నట్లు స్పష్టమవుతోంది. విద్యార్థులు సాధించిన ర్యాంకులు, రిజర్వేషన్ ప్రమాణాల ఆధారంగానే ఇవాళ సీట్లను కేటాయిస్తారు.

గతంలో నిర్వహించిన తొలి విడత కౌన్సెలింగ్‌లో 79,000 మందికి పైగా విద్యార్థులకు సీట్లు లభించాయి. అయితే, వారిలో 60,300 మంది అభ్యర్థులు మాత్రమే ఆన్‌లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ పూర్తి చేసి తమ సీట్లను ఖరారు చేసుకున్నారు. మిగిలిన అభ్యర్థులతో పాటు, ఇంకా మెరుగైన కళాశాల లేదా కోరుకున్న బ్రాంచ్ పొందాలని ఆశించిన అత్యధిక మంది విద్యార్థులు ఈ రెండో విడతలో మళ్లీ వెబ్ ఆప్షన్లు ఇచ్చుకున్నారు. వీరంతా కూడా సీట్ల కోసం పోటీ పడుతున్నారు.

TG EAPCET రెండో విడత సీట్ల కేటాయింపు - ఎలా చెక్ చేసుకోవాలి?

  1. అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ tgeapcet.nic.in ను సందర్శించాలి.
  2. హోమ్‌పేజీలో కనిపించే 'Candidates Login' లింక్‌పై క్లిక్ చేయాలి.
  3. మీ అప్లికేషన్ నంబర్, పాస్‌వర్డ్ వివరాలను నమోదు చేసి లాగిన్ అవ్వాలి.
  4. ఇక్కడ స్క్రీన్‌పై సీట్ల కేటాయింపు ఫలితం కనిపిస్తుంది.
  5. భవిష్యత్తు అవసరాల కోసం విద్యార్థులు ఆ అలాట్‌మెంట్ లెటర్‌ను డౌన్‌లోడ్ చేసుకుని… ప్రింట్ అవుట్ కాపీని భద్రపరుచుకోవాలి.
  6. అడ్మిషన్ ప్రక్రియలో అలాట్ మెంట్ అర్డక్ కాపీ చాలా కీలకం.

రిపోర్టింగ్ తేదీలు…

టీజీ ఈఏపీసెట్ రెండో విడతలో సీటు సాధించిన అభ్యర్థులు జులై 22 నుంచి జులై 24 వరకు వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో ట్యూషన్ ఫీజు చెల్లించి, సెల్ఫ్ రిపోర్టింగ్ పూర్తి చేయాల్సి ఉంటుంది. ఆన్‌లైన్ ప్రక్రియ పూర్తయిన తర్వాత, కేటాయించిన కళాశాలలకు నేరుగా వెళ్లి సర్టిఫికెట్లతో నివేదించేందుకు జులై 25 నుంచి జులై 28 వరకు గడువు ఇచ్చారు.

ఒకవేళ రెండో విడతలో కేటాయించిన సీటు వద్దనుకుని రద్దు చేసుకోవాలనుకునే అభ్యర్థులకు జులై 28ని చివరి తేదీగా నిర్ణయించారు.విద్యార్థులు నిర్ణీత గడువులోగా తమ సీటును ఖరారు చేసుకోవాలని…. నిర్దేశిత తేదీలు దాటితే కేటాయించిన సీటు రద్దవుతుందని అధికారులు స్పష్టం చేశారు.

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More