...
...
Next Story

తెలంగాణ ఆర్టీసీ సమ్మె.. పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్న ఆర్టీసీ డ్రైవరన్న!

TGSRTC Strike : తెలంగాణలో ఆర్టీసీ కార్మికుల సమ్మె కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో దారుణమైన ఘటన జరిగింది. ఓ ఆర్టీసీ డ్రైవర్ పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్నాడు.

Published on: Apr 23, 2026, 16:40:47 IST
Advertisement

తెలంగాణలో ఆర్టీసీ సమ్మె కొనసాగుతున్న విషయం తెలిసిందే. రాష్ట్రవ్యాప్తంగా ఏప్రిల్ 22వ తేదీ నుంచి సమ్మె నడుస్తోంది. బస్సులు డిపోలకే పరిమితం అయ్యాయి. మరోవైపు ఆర్టీసీ ఉద్యోగులు చాలా చోట్ల నిరసనలు చేపట్టారు. అయితే నిరసనలో భాగంగా వరంగల్ జిల్లా నర్సంపేట ఆర్టీసీ డిపోలో డ్రైవర్‌గా పనిచేస్తున్న కోలా శంకర్ గౌడ్ ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్నాడు.

ఆర్టీసీ డ్రైవర్ ఆత్మహత్యాయత్నం
ఆర్టీసీ డ్రైవర్ ఆత్మహత్యాయత్నం

ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయకుండా కాలయాపన చేయడాన్ని నిరసిస్తూ.. నర్సంపేట బస్టాండ్ ఎదుట శంకర్ గౌడ్ ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఆయనను వరంగల్‌లోని ఆసుపత్రికి తరలించారు.

శంకర్ గౌడ్‌కు తీవ్రమైన కాలిన గాయాలవ్వడంతో వరంగల్‌లోని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ప్రభుత్వంలో విలీనాన్ని డిమాండ్ చేస్తూ ఆర్టీసీ ఉద్యోగులు రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు చేపడుతున్నారు. పలు డిపోల వద్ద ప్రదర్శనలు చేశారు.

సికింద్రాబాద్‌లో మహాధర్నా

ఆర్టీసీని ప్రయివేట్ పరం చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కుట్రలు చేస్తుందని మాజీమంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. గురువారం సికింద్రాబాద్‌లోని రాణిగంజ్ డిపో వద్ద ఆర్టీసీ కార్మికులు నిర్వహించిన మహాధర్నాకు ఆయన హాజరై సమ్మెకు మద్దతు తెలిపారు. 92 సంవత్సరాల ఘన చరిత్ర కలిగిన ఆర్టీసీ మనుగడను ప్రశ్నార్థకంగా మార్చేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తుందని మండిపడ్డారు.

సురక్షిత ప్రయాణానికి ప్రత్యేక గుర్తింపు పొందిన ఆర్టీసీ వేలాదిమంది ఉద్యోగుల శ్రమ, కృషి ఎంతో ఉందన్నారు తలసాని. ఆర్టీసీ ఉద్యోగుల డిమాండ్లు న్యాయమైనవని, వాటిని పరిష్కరించి సమ్మెను విరమింప చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో ఆర్టీసీ ఉద్యోగుల పాత్ర ఎనలేనిదని పేర్కొన్నారు. సమస్యల పరిష్కారం అయ్యే వరకు ఆర్టీసీ ఉద్యోగులకు బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.

పెండింగ్లో ఉన్న రెండు పీఆర్‌సీలను వెంటనే అమలు చేయాలని తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. రిటైర్ ఉద్యోగుల బకాయిలను కూడా వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. ఆర్టీసీ ఉద్యోగుల 32 డిమాండ్లలో 29 ఆమోదించామని ప్రభుత్వం తప్పుడు ప్రచారం చేస్తుందని, ఆమోదించిన 29 డిమాండ్లు ఏంటో మీడియా ముఖంగా బహిర్గతం చేయాలని డిమాండ్ చేశారు.

 
ABOUT THE AUTHOR
Anand Sai

ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe