సంగారెడ్డి జిల్లాలో కల్వర్టు గుంతలో పడి ముగ్గురు మృతి ప్రాణాలు కోల్పోయారు. బైకుపై వెళ్తూ నిర్మాణంలో ఉన్న పడిపోగా ఈ ఘటన జరిగింది. నారాయణఖేడ్ శివారులోని నిజాంపేట్-బీదర్ జాతీయ రహదారిపై ఈ ప్రమాదం జరిగింది.
ముగ్గురు మృతి…!
ప్రాథమిక వివరాల ప్రకారం…. నారాయణఖేడ్ మండలం నర్సాపూర్ గ్రామానికి చెందిన అవుటి నర్సింహులు(27), జిన్న మల్లేష్(24), జిన్న మహేష్(23) అనే ముగ్గురు యువకులు నారాయణపేట నుంచి నర్సాపూర్ వైపు బైక్పై వెళ్తున్నారు. ఈ క్రమంలోనే నిజాంపేట-బీదర్ జాతీయ రహదారిపై కొత్తగా నిర్మిస్తున్న 160బి హైవేపై కల్వర్టు కోసం తవ్విన గుంతలో పడిపోయారు.
కల్వర్టు గుంతలో పడిన ముగ్గురు కూడా అక్కడికక్కడే మృతి చెందారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
నూతనంగా నిర్మిస్తున్న కల్వర్టు వద్ద సరైన హెచ్చరిక బోర్డులు, సిగ్నల్స్ లేకపోవడం, అలాగే రోడ్డుపై గ్రావెల్ ఉండటంతో బైకు స్కిడ్ అయినట్లు ప్రాథమికంగా పోలీసులు అంచనా వేస్తున్నారు. వేగంగా వచ్చిన బైకు అదుపు తప్పి నేరుగా కల్వర్టు గుంతలో పడిపోయినట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదానికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
కంది దగ్గర NH 65పై రోడ్డు ప్రమాదం:
ఇక సంగారెడ్డి జిల్లా కంది మండల కేంద్రంలో శనివారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అతివేగంగా ప్రయాణిస్తున్న ఒక టిప్పర్ లారీ, ఎదురుగా వస్తున్న ఆర్టీసీ బస్సును బలంగా ఢీకొనడంతో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో బస్సులో ప్రయాణిస్తున్న సుమారు 22 మంది ప్రయాణికులు గాయపడ్డారు. ఈ భారీ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు.
ప్రాథమిక వివరాల ప్రకారం…. సంగారెడ్డి డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు సుమారు 60 మంది ప్రయాణికులతో సంగారెడ్డి పట్టణం నుంచి పటాన్చెరు వైపు వెళ్తోంది. బస్సు కంది మండల కేంద్రానికి చేరుకోగానే అదే సమయంలో ఎదురుగా వచ్చిన టిప్పర్ లారీ అదుపుతప్పి బస్సును ఢీకొట్టింది. ఢీకొన్న వేగానికి బస్సు ముందు భాగం కొంతమేర దెబ్బతింది. ఈ ఘటనపై విచారణ జరుగుతోంది.