తెలంగాణలోని యాదాద్రి భువనగిరి జిల్లాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. పోచంపల్లి మండలం పరిధిలోని ధోతిగూడెం గ్రామంలో ఉన్న ‘హేజెలో లాబ్స్ ప్రైవేట్ లిమిటెడ్’ ఫార్మా కంపెనీలో హఠాత్తుగా సంభవించిన భారీ పేలుడు తీవ్ర విషాదాన్ని నింపింది. ఈ దుర్ఘటనలో ఇద్దరు కార్మికులు అక్కడికక్కడే దుర్మరణం చెందగా, మరో తొమ్మిది మంది తీవ్ర అగ్నిగాయాల పాలయ్యారు.
పేలిన రియాక్టర్….

స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం….. శుక్రవారం రాత్రి దాదాపు 10:30 గంటల ప్రాంతంలో ఫార్మా పరిశ్రమలో ఉన్నట్లుండి భారీ శబ్దంతో పేలుడు సంభవించింది. పరిశ్రమలోని రియాక్టర్ పేలిపోవడమే ఈ భారీ ప్రమాదానికి కారణమని ప్రాథమికంగా అనుమానిస్తున్నారు. పేలుడు తీవ్రతకు కర్మాగారంలో ఒక్కసారిగా మంటలు చెలరేగి దట్టమైన పొగ అలుముకుంది.
ప్రమాదంపై సమాచారం అందుకున్న వెంటనే జిల్లా అగ్నిమాపక శాఖ అధికారులు సమర్థవంతంగా స్పందించారు. చౌటుప్పల్ నుంచి ఒక ఫైర్ ఇంజిన్తో పాటు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి మరో రెండు అగ్నిమాపక వాహనాలను వెంటనే ఘటనా స్థలానికి తరలించారు. అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా శ్రమించి మంటలను అదుపులోకి తెచ్చారు.
ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన తొమ్మిది మంది బాధితులను రెస్క్యూ సిబ్బంది వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించి అత్యవసర వైద్య చికిత్స అందిస్తున్నారు. మరణించిన ఇద్దరి మృతదేహాలను పోస్టుమార్టం (PME) నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు ఫైర్ ఆఫీసర్ ధృవీకరించారు.
"ఫార్మా కంపెనీలో పేలుడు జరిగిందనే కాల్ రాగానే మా బృందాలు ఘటనా స్థలానికి చేరుకున్నాయి. రియాక్టర్ పేలడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని భావిస్తున్నాం. పేలుడుకు గల ఖచ్చితమైన కారణాలపై కేసు నమోదు చేసి సమగ్ర దర్యాప్తు జరుపుతున్నాం" అని అగ్నిమాపక అధికారి వివరించారు. ప్రమాద సమయానికి పరిశ్రమలో ఎంతమంది విధులు నిర్వర్తిస్తున్నారనే కోణంలోనూ పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు.