తెలంగాణలో చలితీవ్రత పెరుగుతోంది. ఈరోజు నుంచి మరింత పెరగనుంది. ఇప్పటికే జనాలు సాయంత్రం 6 దాటితే ఇంట్లో నుంచి బయటకు వచ్చేందుకు భయపడుతున్నారు. చలికి వణికిపోతున్నారు. ఉదయంపూట భారీగా పొగమంచు కురుస్తున్నది. చలి గాలులు కూడా వీస్తున్నాయి.

తెలంగాణలో వచ్చే రెండు రోజులు అక్కడక్కడ కనిష్ఠ ఉష్ణోగ్రతలు సాధారణం కంటే.. నాలుగు నుంచి ఐదు డిగ్రీల వరకు తక్కువగా నమోదయ్యే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. ఆదిలాబాద్, కుమురంభీ ఆసిఫాబాద్, నిర్మల్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో అక్కడకక్కడ చలిగాలులు వీస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. మంగళవారంనాడు ఆసిఫాబాద్, ఆదిలాబాద్, నిర్మల్, సంగారెడ్డి, మెదక్ జిల్లాల్లో శీతలగాలులు వీచే అవకాశం ఉంది. ఈ మేరకు ఆయా జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో హెచ్చరికలు జారీ చేసింది. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు పడిపోనున్నాయి.
గడిచిన 24 గంటల్లో పలుచోట్ల ఉష్ణోగ్రతలు సింగిల్ డిజిట్కు పడిపోయాయి. ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్లో 7.4 డిగ్రీ సెల్సియస్ కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. మరోవైపు హైదరాబాద్లోనూ ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. హైదరాబాద్ యూనివర్సిటీ పరిధిలో 8.8 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైందని ఐఎండీ పేర్కొంది. రాజేంద్రనగర్ 10, కంటోన్మెంట్ 11.2, మారేడ్పల్లి 11.5, కుత్బుల్లాపూర్ 12, గచ్చిబౌలి 12 డిగ్రీలకు ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి. సోమవారం రాత్రి కూడా చలి బాగా ఉండనుంది. ఈ సీజన్లో ఉష్ణోగ్రతలు మరింత పడిపోతాయని నిపుణులు చెబుతున్నారు.
ఏపీలో పరిస్థితి ఇలా
బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడి భారీ వర్షాలు, గాలులు వీచే అవకాశం ఉందని ఏపీ వాతావరణ హెచ్చరించింది. అల్పపీడనం ప్రభావం ఏపీ, తెలంగాణపై ఉండనుంది. నవంబర్ 15 శనివారం నైరుతి బంగాళాఖాతంలో, శ్రీలంక తీరానికి ఆనుకుని అల్పపీడనం ఏర్పడింది. ఈ వాతావరణ వ్యవస్థతో ఏపీలో వర్షపాతం నమోదవుతుందని వాతావరణ శాఖ అంచనా వేసింది. వర్షాలతో పాటు గంటకు 35 నుండి 55 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీస్తాయని తెలిపింది.
శ్రీ పొట్టి శ్రీరాములు, నెల్లూరు, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి సహా పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ప్రకాశం, వైఎస్ఆర్ కడప జిల్లాల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురుస్తాయి. కోస్తాంధ్ర, యానాం, రాయలసీమలో 17 నుంచి 20 వరకూ ఉరుములు, మెరుపులు అక్కడక్కడా రానున్నాయి. ఈ ప్రభావంతో తెలంగాణలో చలి తీవ్రత పెరగనుంది.