నల్గొండ జిల్లాలోని కేతేపల్లిలో ఘోరం జరిగింది. ఏకంగా ఓ మహిళా… మరో మహిళను పెట్రోల్ పోసి నిప్పటించి హత్య చేసింది. ఈ ఘటనలో 6 నెలల చిన్నారికి కూడా తీవ్రంగా గాయాలయ్యాయి. ఈ ఘటన సంచలనంగా మారింది.

ప్రాథమిక వివరాల ప్రకారం… నాంపల్లి మండలంలోని కేతేపల్లికి గ్రామానికి నగేశ్ భార్య మమత (25)తో అదే గ్రామానికి చెందిన సుజాత అనే మహిళ మధ్య గొడవ జరిగింది. ఇరువురు మధ్య వాగ్వాదం పెరగగా…. మమతపై సుజాత పెట్రోల్ పోసి నిప్పంటించింది. ఆ సమయంలో మమత చేతిలో తన ఆరు నెలల కుమారుడు కూడా ఉన్నాడు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన మమత అక్కడికక్కడే మృతి చెందింది. చిన్నారి పరిస్థితి కూడా విషమంగానే ఉన్నట్లు సమాచారం.
ఇక సుజాత, నగేశ్ మధ్య వివాహేతర సంబంధం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో వీరి మధ్య గొడవ జరిగినట్లు సమాచారం. ప్రస్తుతం నగేశ్ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. మరోవైపు సుజాత నాంపల్లి పోలీస్ స్టేషన్లో లొంగిపోయినట్లు తెలిసింది.
ఈ ఘటనపై పోలీస్ అధికారి స్పందిస్తూ “ఓ మహిళ పెట్రోల్ పోసి నిప్పంటించిందని మాకు సమాచారం అందింది. మేం క్రైమ్ సీన్ బృందాలతో కలిసి సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నాము. పూర్తిస్థాయి విచారణ తర్వాత అన్ని విషయాలు బయటికి వస్తాయి” అని తెలిపారు.