...
...
Next Story

అమరావతిలో ప్రధాన న్యాయమూర్తి అధికారిక నివాస నిర్మాణానికి టెండర్ల ఆహ్వానం

అమరావతిలో ప్రధాన న్యాయమూర్తి అధికారిక నివాస నిర్మాణానికి AGICL రూ.14 కోట్ల విలువైన టెండర్‌ను ఆహ్వానించింది. ఆసక్తి ఉన్నవారు బిడ్‌లో పాల్గొనవచ్చు.

Published on: Jul 8, 2026, 16:13:42 IST
Advertisement

అమరావతి గ్రోత్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ లిమిటెడ్(AGICL), అమరావతిలోని నెలాపాడు సమీపంలో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి అధికారిక నివాసం నిర్మాణం కోసం, డిజైన్-బిల్డ్ లంప్-సమ్ కాంట్రాక్టు పద్ధతిలో రూ.14 కోట్లకు పైగా విలువైన పోటీ టెండర్‌ను ఆహ్వానించింది. ఆరు నెలల్లో పూర్తి చేయాల్సిన ఈ ప్రాజెక్టులో రెండేళ్ల లోప బాధ్యత కాలం(Defect Liability Period) కూడా ఉంది. ఈ కాలంలో కాంట్రాక్టర్ లోపాలను సరిదిద్దడం, నాణ్యతా ప్రమాణాలను నిర్ధారించడం వంటి బాధ్యతలను కలిగి ఉంటారు.

అమరావతి
అమరావతి

బిడ్ పత్రం ప్రకారం.. ఈ ప్రాజెక్టు లక్ష్యం ఆర్కిటెక్చరల్ ఫినిషింగ్‌లు, అంతర్గత, బాహ్య విద్యుత్ వ్యవస్థలు, ప్లంబింగ్, శానిటరీ పనులు, అగ్నిమాపక సౌకర్యాలు, లిఫ్టులు, డీజిల్ జనరేటర్, హీటింగ్, వెంటిలేషన్, ఎయిర్ కండిషనింగ్ (HVAC), భద్రతా వ్యవస్థలు, బాహ్య అభివృద్ధి, ల్యాండ్‌స్కేపింగ్‌తో కూడిన పూర్తి ఇంటిగ్రేటెడ్ న్యాయ నివాసాన్ని అభివృద్ధి చేయాలి. సింగిల్-పాయింట్ డిజైన్-బిల్డ్ ఎగ్జిక్యూషన్ మోడల్ ద్వారా వినియోగానికి సిద్ధంగా ఉన్న, అధిక నాణ్యత గల నివాస సౌకర్యాన్ని అందించడమే దీని ప్రధాన ఉద్దేశం.

ప్రాజెక్టుకు హడ్కో(HUDCO), రాష్ట్ర ప్రభుత్వం లేదా ఇతర ఆమోదిత నిధుల వనరుల ద్వారా నిధులు సమకూర్చవచ్చని, ఎంపికైన కాంట్రాక్టర్ ఒప్పంద నిబంధనలకు, పర్యావరణ, సామాజిక భద్రతా చర్యలకు కచ్చితంగా అనుగుణంగా పనిని అమలు చేయాలని ప్రభుత్వం చెబుతోంది. బిడ్డర్లు పర్యావరణ, సామాజిక నిర్వహణ ప్రణాళికలను సమర్పించాలి. భద్రత, ఆరోగ్యం, కార్మిక రక్షణ చర్యలను చేపట్టాలి. నిబంధనలను పాటించాలి. కాంట్రాక్టర్లు బిడ్డింగ్‌కు ముందు స్వతంత్రంగా సైట్ డ్యూ డిలిజెన్స్ చేపట్టాలి. కాంట్రాక్టును కేటాయించిన తర్వాత సైట్ పరిస్థితులపై తదుపరి క్లెయిమ్‌లను లేవనెత్తకూడదు. అందుకే ముందుగానే సైట్‌ను సందర్శించాలి.

ప్రీ బిడ్ సమావేశం 2026 జూలై 8న జరగనుండగా, బిడ్ల స్వీకరణ జూలై 20న ముగుస్తుంది. అనంతరం ఆంధ్రప్రదేశ్ ఇ-ప్రొక్యూర్‌మెంట్ ప్లాట్‌ఫామ్ ద్వారా సాంకేతిక, ఆర్థిక బిడ్లను ఆహ్వానిస్తారు.

 
ABOUT THE AUTHOR
Anand Sai

ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe